అనంతసాగరం



మేమంతా సముద్రం దగ్గర ఆడుకుంటున్నాం. అప్పుడు నేను చాలా చిన్నవాణ్ణి. పదేళ్ళుంటాయేమో!! సముద్రం ఒడ్డున గవ్వలేరుకుంటున్నాం. అప్పుడు సముద్రాన్ని ఆస్వాదించేంతటి పరిజ్ఞానం లేదు. ఏదో అక్కడైతే గవ్వలేరుకోవచ్చుకదాని, వచ్చి - ఏరుకుని వెళ్ళిపోయేవాడ్ని. నాతో పాటూ చాలా మంది పెద్దవాళ్ళు కూడా గవ్వలేరుకునేవారు. వాళ్ళేరుకునే గవ్వలకి, మేం ఏరుకునే గవ్వలకి తేడా ఉంది. అక్కడక్కడా కొంత మంది సముద్రం వైపు చూస్తూ ఆనందించేవారు. వారి సంఖ్య చాలా తక్కువ. వాళ్ళు కూడా సముద్రంలో ఈత కొట్టే వాళ్ళను కాక, సముద్రంలో పడవలేసుకుని ప్రయాణించే వారినే గమనించేవారు. కొంత మంది ఏదీ చేయక - ఒడ్డున కూర్చుని, తమ ప్రేయసితోనో మరెవరితోనో మాట్లాడుకుంటూ గడిపేవారు. నేను గవ్వలేరుకుని వెళ్ళిపోయేవాడ్ని.

అయిదేళ్ళు గడిచాయి. రోజున నాకెందుకో సముద్రంలో కాలు పెట్టాలనిపించింది. నా ఈడు వారందరూ గవ్వలేరుకుంటున్నారు. నెమ్మదిగా వెళ్ళి కాస్తా తడిగా ఉన్న దగ్గర నించున్నాను. కెరటం వచ్చి నా కాలిని తడిపి రమ్మనట్లుగా ఆహ్వానించింది. నాకు చాలా ఆనందం వేసింది. ముందుకు వెళ్దామనుకున్నాను. ఏం లాభం? అమ్మ చూసింది. మరోసారి సముద్రం వైపు వెళ్తే కాళ్ళిరగ్గొడతానంది. బుధ్ధిగా గవ్వలేరుకోమంది. నోరుమూసుకుని గవ్వలేరుకున్నాను.

అయితే రోజులు గడిచే కొద్దీ నేను ఎవ్వరికీ తెలియకుండా కాళ్ళు తడుపుకోవటమేమిటి? ఏకంగా ఈత కొట్టటమే నేర్చుకున్నాను. మొదట్లో కొంచెం కొంచెమే వచ్చినా ఏళ్ళు గడిచేసరికి ఈతలో ప్రావీణ్యం సంపాదించాను. నా తోటి వాళ్ళే కాక నాకన్నా పెద్దవాళ్ళు కూడా సాధించలేనిది నేను సాధించానని కించిత్ గర్వంగా కూడా ఉండేది. అయితే అది నాలో అహంభావాన్ని మాత్రం పెంచలేదు.

రోజు దీర్ఘంగా ఆలోచించాను. నా ఈత ప్రావీణ్యాన్ని అందరికీ ప్రదర్శించాలన్న కోరిక బలంగా పెరిగింది. వారి మెప్పు కోసం కాదది. నేనంటే ఏమిటో నాకు నేనుగా నిరూపించుకోవటం కోసం.

ముహూర్తం పెట్టుకున్నాను. నన్ను అభిమానించే నలుగురికి విషయం చెప్పాను.

"అది అనంతసాగరం" అన్నాడొకడు.

"నువ్వు ఈదలేవు" అన్నాడు మరొకడు.

"నీలాగనే చాలా మంది ప్రయత్నించి మధ్యలోనే మునిగిపోయారు. నువ్వూ అంతే!" వేరొకడన్నాడు.

"పోన్లే ప్రయత్నించు. నీ ఆసక్తి మేమెందుకు కాదనటం, అయితే అలసిపోతే మాత్రం వెనక్కి వచ్చేయ్. ఏం?!" నాలుగోవాడన్నాడు.

ఉత్సాహంగా ఈత మొదలు పెట్టాను. మాత్రం అలుపు లేదు. నా స్నేహితుల ప్రోత్సాహం మాత్రం వినపడుతుంది. అలా చాలా సమయం ఈదాను. అప్పటికే పడవల్లో ప్రయాణించే వారిని దాటేసాను. వారిని దాటిన గర్వంతో వెనక్కి తిరిగి చూసాను.

నా ఈడు వారు గవ్వలేరుకుంటున్నారు. ప్రేయసీప్రియులు మాట్లాడుకుంటున్నారు. కొందరు తిండిలో నిమగ్నమయి ఉన్నారు. ఎక్కువ మంది పెద్దవాళ్ళు గవ్వలు లెక్క పెట్టుకుంటూ కనపడ్డారు.

'సముద్రాన్ని ఆస్వాదించే వాళ్ళు ఎక్కడున్నారా? నన్ను గమనిస్తున్నారా లేదా?' అని చూసాను. అదేంటో! వాళ్ళు నన్ను గమనించటం లేదు. పడవలేసుకుని, ఈత కూడా రాకుండా - చేపలు పట్టుకునేందుకు సముద్రాన్ని ఉపయోగించుకునే వాళ్ళకు ఒడ్డున నించుని జేజేలు పలుకుతున్నారు.

నేన్నిర్ఘాంతపోయాను.

"మేమే గొప్ప!" అన్నారు పడవలోని వాళ్ళు నాతో - తమకు చప్పట్లు కొడుతున్న వారికి అభివాదం చేస్తూ.

"మీకు ఈత వచ్చా?" ప్రశ్నించాన్నేను.

"ఏమో! ప్రయత్నించలేదు."

"పోనీ ప్రయత్నించి చూడవచ్చు కదా?"

"ఎందుకూ? చేపలు పట్టుకోవటానికి పడవలైతేనే అనుకూలం. ఈదుతూ ఒక్క చేప కూడా పట్టుకోలేం."

"అంటే మీరు, చేపలు పట్టుకోవటం కోసమే వచ్చారా?" ఆశ్చర్యంగా అడిగాను.

హేళనగా నవ్వారు.

"మరి నువ్వెందుకు వచ్చావేమిటి?"

"ఏమో!? ఈదుదామనిపించింది. వచ్చాను. అంతే!"

ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.

"మంచిది. ఈదు...ఈదు..." ఉచిత సలహా ఇచ్చేసారు. నేనెక్కడ చేపలు పట్టటం ప్రారంభించి వారికి పోటీ అవుతానేమోనని.

మళ్ళీ ఈత ప్రారంభించి బయలుదేరుతూ వారిని చూసాను. నేను వెళ్ళిపోయానని భావించి, వారు ఒడ్డు వైపు తిరిగి అక్కడ్నుంచి చూస్తున్న జనాలతో "మేమే గొప్ప!" అంటున్నారు.

వెనువెంటనే కరతాళ ధ్వనులు వినపడ్డాయి. నన్నెవరూ గమనించటం లేదు. నన్ను అభిమానించే నలుగురు మాత్రం చప్పట్లతో నన్ను ప్రోత్సహిస్తున్నారు. అవి నాకు కనపడుతున్నాయి కానీ, వినపడటం లేదు.

మరింత పట్టుదలతో ఈత కొనసాగించాను. అయితే మనసులో భయంగానే ఉంది. నాకు తోడెవ్వరూ లేరు. కనీసం ప్రోత్సహించే వాళ్ళు గానీ, బాగా ఈదుతున్నావనే వాళ్ళు గానీ లేరు. అంతలోనే మొండి ధైర్యం వచ్చింది. ఈదుతూనే ఉన్నాను.

కొంత కాలం గడిచింది. మధ్యలో నేను చాలా శ్రమ పడ్డాను. కొన్ని చేపలు కనపడి 'మమ్మల్ని పట్టుకుని వెన్నక్కి పోయి సుఖంగా ఉండు' అన్నట్లు చూసాయి. సముద్రం కూడా నా కష్టానికి జాలి పడ్డట్లు అనిపించింది.

రోజు సాయంసమయానికి నాకు ఏదో అలజడి వినిపించింది. ఈదుతున్న వాడ్నల్లా ముందుకు చూసాను. నాకు ఎదురుగా ఎవరో కొంతమంది ఈదుతున్నట్లుగా కనపడింది. నాకు భయం వేసింది.

ఇంతవరకు కనపడని వాళ్ళు ఇప్పుడు కనపడటంతో జడుపు వచ్చింది. ఒంటరినైన నాకు తోడు దొరికారన్న ఆనందం మాత్రం సమయానికి కలుగలేదు. వెనుదిరుగుదామని చూసాను. సముద్రం ముందెలా ఉందో వెనక్కీ అలానే ఉంది. నా వాళ్ళు కాదు కదా, కనీసం ఒడ్డు కూడా కనపడటం లేదు. నిజానికి అప్పటికే నేను మునిగిపోయానని నిర్ణయించుకుని వాళ్ళు వెళ్ళిపోయారు.

"అబ్బాయ్! ఎవరు నువ్వు? మాలానే ఈదుదామని ఆసక్తితో వచ్చావా?" ప్రశ్నించిందొక గొంతు.

"...! మరి మీరెవరు?" వణుకుతూ అడిగాను.

క్షణం పాటూ అందరూ ముఖముఖాలు చూసుకున్నారు.

"నేను కృష్ణశాస్త్రిని"

"నేను గోపీచందుని"

"నేను శ్రీశ్రీని"

"నేను కుటుంబరావుని"


నా కళ్ళ నుండి ఆనంద భాష్పాలు జాలువారాయి. వాళ్ళ దగ్గరకు వెళ్ళాలనిపించి ఈదబోయాను.

"అగాగు! ఎక్కడికీ?"

"ఈదటానికి" అమాయకంగా బదులిచ్చాను.

"ఏం సాధించాలని...?"

"మీరు సాధించినదే!! ఆత్మ సంతృప్తి"

"మేం సాధించామని ఎలా చెప్పగలవు?"

"ఏమో! అలా అనుకోవాలనిపించింది."

కొంతసేపు మౌనం రాజ్యమేలింది. తిరిగి నేనే ప్రశ్నించాను.

"ఇది అనంతమంటారు కదా! నిజంగా ఇప్పటి వరకు ఎవ్వరూ దీని అంతు తేల్చలేదా?"

"ఏమో! దీని అంతు తేల్చటం ద్వాపరయుగానికి చెందిన వారికి తప్ప, మన కలికాలం కవులకు సాధ్యం కాదని మా నమ్మకం."

"ఠాగూరికి కూడా?" నా అభిమానాన్ని ప్రకటించాను.

"ఏమో! మాకు తెలియదు. అతనిది మన భాష కాదు కదా! వారిది వేరే సముద్రం. ఐతే అన్ని భాషా సముద్రాలూ అనంతమన్నది వాస్తవం."

"పోనీ మనం ప్రయత్నిస్తే?" అత్యుత్సాహం ప్రదర్శించాను.

"నువ్వు ఇక ఈదటం కష్టం" కృష్ణశాస్త్రి వైపు నుండి వినపడింది.

"ఈదినా సాధించేది ఏదీ లేదు" గోపీచంద్ వైపు నుండి వినపడింది.

"అప్పట్లో ఏదో ఆవేశంతో ఈదేశాను" శ్రీశ్రీ గొంతు ఖంగుమంది.

"వెనక్కి పోవటానికి ప్రయత్నించరాదూ?" కుటుంబరావు గొంతు ప్రశ్నించింది.

"ఇది అనంతసాగరం" అన్నారంతా ముక్తకంఠంతో.

నాకు చెమటలు పట్టాయి. స్వేదం చెంపల మీదుగా జారి సముద్రంలో కలసిపోయింది.

"నిజమే! కావొచ్చిది అనంతసాగరం
ఐతే మాత్రం?!?!
నా ఈత కూడా నిర్విఘ్నమే నిరంతరం"


అప్రయత్నంగా నా నుండి మాటలు వెలువడ్డాయి.

అంతా ఘడియ గంభీరంగా ఆలోచించారు.

"నిన్ను నేను ప్రోత్సహిస్తాను" - కుటుంబరావు

"అందరం కలిసే ఈదుదాం" - గోపీచంద్

"మాతో పాటే నువ్వూనూ" - కృష్ణశాస్త్రి

"పదండి ముందుకు, పదండి తోసుకు" - శ్రీశ్రీ

నలుగురూ ఒక్కసారి సాదరంగా అహ్వానించారు.

ఇప్పుడు నాకు నా ఈతను ఎవరికైనా ప్రదర్శించాలన్న తపన లేదు. అంతకు మించిన ఆనందానుభూతిని పొందాను.

రెట్టించిన ఉత్సాహంతో వారి వైపు ఈత కొనసాగించాను.

"తెలుగు సాహితి - అనంతసాగరం
'ఐతే మాత్రం?!?'
నా ఈత సైతం
నిరాటంకమే నిరంతరం!"

జైహింద్

స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా నే ప్రచురించ దలచిన ఈ టపా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఒకరోజు ఆలశ్యమైనది. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.


ప్రపంచం ఎప్పటికప్పుడు ఏదోవిధమైన ఆపదలను ఎదుర్కొంటూనే ఉంది. ఆపదలు కాలంతో పాటూ రూపాలను మారుస్తూ మానవాళి ప్రశాంత మనుగడపై దాడి చేస్తూనే ఉన్నాయి. ఆపదలు కేవలం మానవీయమైనవే కాక, సకల ప్రాణకోటికీ, ప్రపంచ మనుగడకీ సంబంధించినవి. పరిస్థితులలో దేశమూ కూడా సత్యాన్ని సంరక్షించే భాద్యతను గానీ, నిజమైన ఆధ్యాత్మికత విలువలను ప్రభోదించే కార్యాన్ని గానీ స్వీకరించలేదు.

ఇప్పటికే కొన్ని కమ్యూనిస్టు దేశాలు ఎన్నో దశాబ్దాల అయోమయ, అవినీతి స్థితుల వల్ల ఆర్ధికంగా బలహీనపడి అంతరించాయి.

పారిశ్రామిక, పెట్టుబడి దారీ దేశాలు తమ సంపదలనూ, ఆధిపత్యాన్ని నిలుపుకునే ప్రయత్నంలో భావితరాలకు చేరాల్సిన వనరులను ఇప్పటినుండీ దోచుకుంటూ ఆనందాన్ని పొందుతున్నాయి.

కొన్ని పేదదేశాలు అభివృధ్ధిలో దారుణంగా వెనుకబడి అగ్రదేశాల ముంగిట దేహీ అంటున్నాయి.

మరికొన్ని దేశాలు అంతర్గిక యుధ్ధాలతో, పొరుగు రాజ్యాల కయ్యాలతో సతమతమవుతూ ఉన్నాయి.

అంతకంతకూ పెరుగుతున్న జనాభాని అరికట్టలేక ఇంకొన్ని దేశాలు సమస్యాత్మకం అవుతున్నాయి.

పర్యావరణం ఇప్పటికే పారిశ్రామిక, రసాయనిక వ్యర్ధాలతో, నాశనమైన అడవులతో కాలుష్యం కోరలలో చిక్కుకుంది.

భూభారం వాతావరణంపై సైతం ప్రభావాన్ని చూపుతున్నదని మనకు తెలియనిది కాదు.

ఇలా మనచే నాశనం కాబడుతున్న భూమిపై మన మనుగడ ప్రశ్నార్ధకం కాకుండా, మరిన్ని విపత్కర పరిస్థితులను ఎదుర్కొనకుండా కొనసాగేది ఇంకెన్నాళ్ళు?

అణు ఒప్పందాలు సఫలీకృతమయ్యి, ప్రపంచ దేశాలన్నీ సంతకం చేసినా కూడా మనం విసర్జిస్తున్న వ్యర్ధాలు చాలును, అణుబాంబులకంటే కూడా మిన్నగా విషతుల్యం చేయటానికి. ప్రాధమికంగా మనం వాడే అల్లోపతీ వైద్యాన్ని తీసుకున్నా కూడా అది ప్రకృతికి విరుధ్ధంగా ప్రవర్తించేదే. ఇది మరిన్ని కొత్త వ్యాధులకు కారణమవుతున్నది.

ప్రపంచంలో చాలా మతాలు ఇప్పటికే తమ మత విశ్వాసాలకూ, ఆధునిక పోకడలకు మధ్యన వారధిని కనుగొనలేక సంఘర్షణ పడుతూ ఉన్నాయి. కొంత మంది తమ స్వార్ధ ప్రయోజనాల కోసం తమ కువిశ్వాసాలను ప్రపంచంపై రుద్ది అందరినీ కలుపుకు పోదామని చూస్తున్నారు. తమ విశ్వాసాలు మానవాళి సమస్యలను తీర్చగలవని నమ్మబలుకుతున్నారు.

కొన్ని సంస్కృతులు వస్తువ్యామోహ ప్రపంచంతో రాజీపడి ఆధునికతకు పూర్తిగా దాసోహమయినాయి.

మహోన్నత ఆధ్యాత్మిక నాగరికతలయిన హిందుత్వం, బౌధ్ధం ఇప్పటికీ పశ్చిమ దేశ పోకడలతో తమ పరిధిలో పోరాడుతూనే ఉన్నాయి. పోరాట సమయంలో మనం ఒక ప్రశ్న సంధిద్దాం.

"ప్రస్తుత పరిస్థితులలో భారత దేశ స్థానం ఏమిటి? ఆమె పోషించాల్సిన పాత్ర ఏమిటి?"

భారతదేశం కూడా ఎన్నో సమస్యలను తట్టుకుంటూ మనుగడ సాగిస్తున్నదే. ఇందులో సందేహమేమీ లేదు. మతపరమైన సమస్యలతో పాటూ, నియంత్రణ కోల్పోయి హద్దులు దాటిన జనాభా తలనొప్పిగా తయారయ్యింది. దీనికి తోడు అంతర్గిక వర్గ వైషమ్యాలూ, రాజకీయ స్వార్ధపరాయణత్వం, అవినీతి అగ్నికి ఆజ్యం పోసాయి. భారతదేశ ఆర్ధిక, ప్రభుత్వ విధానాలపై పట్టు సాధించిన లెఫ్టిస్టు, కమ్యూనిస్టు భావకులు మన ఆధ్యాత్మిక సంస్కృతికి విరుధ్ధంగా పాలన సాగిస్తూ భరతమాత ఆత్మ ఘోషకు కారణమయ్యారు. మనకు పెట్టుబడిదారులకు కూడా కొదువలేదు. భారతావనిని ఎలా దోచుకోవచ్చునా అని ఆలోచించే మల్టీ నేషనల్ కంపెనీలకు మన పెట్టుబడిదారీ వర్గాలు దనాపేక్షతో మోకరిల్లాయి.

ఈనాడు హిందుత్వ ఆత్మ ఎక్కడుంది? భరతమాత మనోసంకల్పం ఏమిటి? జరుగుతున్నదేమిటి?

ఈమె శతాబ్దాల తరబడి శాంతి కోసం, సహనంతో మానవాళి ఐకమత్యాన్ని కాంక్షిస్తూ, అన్ని మతాలనూ గౌరవిస్తూ, అన్ని సంస్కృతులనూ కలుపుకుంటూ ప్రవాహంలో దిశలేని నావలా పయనిస్తూ ఉండిపోయింది. పాశ్చాత్య సెక్యులర్ సంస్కృతులు ఈమెపై నిత్యం దాడి చేస్తునే ఉన్నా, మన భరతమాత అందరినీ సంతోషపరచటానికి ప్రయత్నిస్తూనే ఉంది.

మనదేశంలో ప్రతీ రాజకీయ వర్గానికీ, ప్రతీ కులానికీ, ప్రతీ మతానికీ - అందరికీ తమ వంతు వాటా కావాలి. హక్కులు కావాలి. అందరూ పొందాలనుకునేవారే తప్ప ఇచ్చేవారే లేరు. స్వార్ధపరాయణత్వానికీ, వ్యామోహానికీ ఎదురొడ్డి నిలిచేవారుకరువయ్యారు.

ఈ రణరంగంలో సగటు హిందువు పోరాటానికి కాదుకదా కనీసం గొంతెత్తి ప్రశ్నించే ప్రయత్నం కూడా చెయ్యకుండా మిన్నగుండిపోతున్నాడు.

వరదలా వచ్చి పడుతున్న పాశ్చాత్య సంస్కృతులను అహ్వానిస్తూ, అది ఆర్ధికపరమైన అభివృధ్ధియని భ్రమిస్తూ తల్లి మనో సంకల్పాన్ని మరుస్తున్నాడు. మౌనంగా భరిస్తూ తన నేలపైననే ఇతర మతాల వ్యాప్తిని సైతం అంగీకరిస్తున్నాడు.

నేటి సగటు హిందువుకి తన సంస్కృతి పట్ల నమ్మకం లేదు. ఇతర మతాలు బాధించినా విమర్శించలేని పరిస్థితులలో మనో నిబ్బరాన్ని కోల్పోయి ఉన్నాడు. వీటన్నిటినీ పట్టించుకోకుండా, ప్రాధాన్యతనీయకుండా ఉంటే వాటంతటవే వెనక్కి వెళ్ళిపోతాయన్న భ్రమలో మిగిలిపోయాడు. అయితే ఇది ఒక వైరస్ వలే, ఇన్ఫెక్షన్ వలే దేశమంతా వ్యాపించగలదని గ్రహించలేకపోయాడు.

సగటు హిందువు యొక్క మనస్తత్వం ఇదీ...

వారు దేనినీ నిరోధించరు. ఆత్మవిశ్వాసంతో తాము నమ్మిన దానికై నిలబడరు. ప్రపంచం వారినుండి ఏది లాక్కోయత్నించనీ, అడ్డు చెప్పరు. తమ వ్యక్తిత్వాలని భయం చాటున ఉంచుతారు.

మొదట ముస్లింలకు, పిమ్మట బ్రిటిషర్లకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఎదిరించటం అన్నది వీరు మరిచారు. ఒక్కోసారి అమాయకంగా తమను నాశనం చేయగోరే వారితో చేయి కలుపుతారు. తమ వారితోనే పోట్లాడుతారు. (ఇది ఇప్పటికినీ ఉంది. లెఫ్టిస్టు, కమ్యూనిస్టు సిధ్ధాంతాల శరణు జొచ్చి తమ వారితోనే పోరాడే హిందువులెందరో...)

ఇప్పుడు మనమందరం స్వతంత్ర్యులం. అయితే ఏళ్ళ తరబడి పరాయి పాలనలో మ్రగ్గి మనమెవరో మరచాం. ప్రస్తుతం మనలని మనం ఎలా పరిపాలించుకోవాలో తెలియని సంకటస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాం. మనం నిర్దేశింపబడటానికి అలవాటుపడిపోయాం. ప్రస్తుతం ఆర్ధిక శక్తుల రూపంలో వస్తున్న క్రొత్త తరహా దండయాత్రలకై ఎదురుచూస్తున్నాం.

ఇదీ మన పరిస్థితి.

అయితే ఒకప్పటి భారతం ఇలా లేదు. నిరోధించకుండా ఓటమి అంగీకరించే మనస్తత్వం కాదు భారతావనిది. సత్యాన్ని కాపాడుకునేందుకు అన్ని విధాలుగా సర్వశక్తులూ ఒడ్డిన నాగరికత మనది.

మహోన్నతమైన యోగిశ్వరులు పుట్టిన దేశమిది. బుధ్ధుడు, శంకరాచార్యుడు వంటివారు అఖండ భారతావనిని ఒక్క త్రాటిపై తెచ్చి ఉన్నత ఆధ్యాత్మిక ఫలాలనూ, ప్రేమనూ పంచయత్నించారు. రాముడు, కృష్ణుడు వంటి పాలకుల కాలంలో ఈ విలువలు విరాజిల్లేవని చదువుకున్నాము. కాలాక్రమేణా ఎన్నో దాడులు జరిగినా ప్రతిఘటించిన చరిత్ర మనది. ఈ సందర్భంలో గతంలో చదువరి గారి కామెంటొకటి జ్ఞప్తికి వస్తుంది.

"హిందువులను అణగదొక్కే చర్యలు మధ్యయుగం నుండి ఇప్పటి దాకా జరుగుతూనే ఉన్నాయి. మధ్య యుగాల్లో తమకేం జరుగుతోందో ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలిసేది. తమ శక్తిమేరకు ఎదుర్కొన్నారు, హిందువులు. లేనప్పుడు అసహాయులై తలవంచారు. హైందవంలో ఉన్న అంతర్గత శక్తి దాన్ని నిలబెట్టింది.

కానీ
ఇప్పుడు జరుగుతున్నది మాత్రం సూటిగా జరుగుతున్న దాడి కాదు. ఇదో కుట్ర. హైందవమ్మీద చేస్తున్న దొంగ దాడి. ఈ కుట్రదారుల చేతిలో కత్తులూ కఠార్లూ ఉండవు. రకరకాల వాదాలు ఇజాలూ ఉంటాయి. బైటనుంచి అప్పుతెచ్చుకున్న ఎంగిలి సిద్ధాంతాలుంటాయి. వాళ్ళ ద్రోహపూరిత మద్దతూ వీళ్ళకుంటుంది. మన చరిత్రను, మన సాంస్కృతిక వారసత్వాన్ని, మన ఆచారాలను, మన చదువులనూ వ్యతిరేకిస్తూంటారు. మనవైనవన్నిటినీ విమర్శిస్తూ ప్రజల విశ్వాసాలను, ఆత్మవిశ్వాసాన్నీ దెబ్బతీయడమే వీళ్ళ లక్ష్యం!


ఈ మార్క్సేయులది మార్క్సువాదం. బైటవాడు చెప్పేదేదైనా వీళ్ళకి హేతుబద్ధంగానూ, మన పూర్వులు చెప్పేదేదైనా మౌఢ్యంగానూ కనిపిస్తుంది వీళ్ళకు. చరిత్రను తమకు తోచిన విధంగా రాసేసుకుపోతూంటారు. హైందవ వ్యతిరేక విధానాలను విమర్శిస్తే వీళ్ళకు పడదు. మన సంస్కృతి అంటే మంట వీళ్ళకు.
ఇంకో రకం జనమున్నారు.. గతంలో తమను అణగదొక్కారనో మరోటో మనసులో పెట్టుకోని, ఆ కసితో ఇప్పుడు విమర్శిస్తూంటారు. పుస్తకాలు రాసేస్తూంటారు. పోలేరమ్మలు, పోచమ్మలు హిందూ దేవతలు కాదు, ఇప్పుడు హిందువులని చెప్పేవాళ్ళు అసలు హిందువులే కాదు పొమ్మంటూంటారు. హిందువులను చీల్చిపారేసి, వాళ్ళను పరాయి మతాల్లోకి చేర్పించి హిందూమతాన్ని బలహీనపరచాలనే కూహకం వీళ్ళది.

ఇహ
దొంగ లౌకికవాదులు - అందరికంటే ప్రమాదకారులు వీళ్ళు. మధ్యయుగం నాటి ముస్లిము కిరాతకుల కంటే ప్రమాదకారులు వీళ్ళు. ఇతర మతాలను నెత్తికెత్తుకుని హిందూమతాన్ని అణగదొక్కడమే లౌకికవాదం అనేది వీళ్ళ భావన..
కొందరిలో ఈ మూడు రకాలూ కొలువై ఉంటాయి. ఇన్ని రకాల జనాల లక్ష్యం కూడా హిందూమతంపై విషంగక్కడమే. వీళ్ళ దౌష్ట్యాన్ని తట్టుకుని హైందవం ఎన్నాళ్ళు నిలబడుతుందో!"

ఇది నూరుపాళ్ళూ సత్యం.

ముస్లింలు కూడా డజన్ల కొద్దీ యుధ్ధ ప్రతిఘటనల అనంతరమే భారతదేశాన్ని స్వాధీనపరచుకోగలిగారు. అప్పటి పాలకులు ప్రాణాలను సైతం ఇవ్వటానికి సిధ్ధపడ్డారు తప్పితే తలవంచలేదు. ఇలాంటి వీరులను మనం మరువరాదు.

మన మనస్థితి కురుక్షేత్ర యుధ్ధ సమయంలో అర్జునిని సంకటస్థితి.

రెండు మహా సైన్యాల మధ్య అనివార్యమైన యుధ్ధంలో అర్జునుని స్థితి ఇదీ...

అతనికి పోరాడాలని లేదు. పోరాడవలసిన కారణంపై విశ్వాసం లేదు. శతృసైన్యం చేతిలో ఓడేందుకు సిధ్ధపడియున్నాడు. ఇది అతని పిరికితనం కాదు. అతని సున్నితమైన హృదయం ఈ సంఘర్షణలో ప్రత్యర్ధితో వైరాన్ని స్వాగతించలేకున్నది.

మన ప్రస్తుత భారతదేశ స్ఫూర్తి కూడా ఇలానే ఉంది.

జీవితం ఎల్లప్పుడూ కురుక్షేత్రం వంటి రణరంగమే. ఒక్కోసారి కష్టతరమైన పధాన్ని ఎంచుకోవలసి వస్తుంది. మనకు రెండు దారులున్నాయి. ఒకటి ఉన్నతమైన ఆధ్యాత్మిక అభివృధ్ధిని చూపితే, రెండవది ప్రాపంచిక భ్రమలనూ, సరిహద్దు విభజనలనూ సూచిస్తుంది. ఇవి ప్రపంచాన్నే కాదు, దేశాన్ని ఆఖరుకి కుటుంబాన్ని కూడా చీల్చవచ్చు. పర్యవసానంగా మన అభిప్రాయానికి విరుధ్ధమైన ఆలోచనలకు మనతో పాటూ చోటివ్వవలసి వస్తుంది.

ఈ అర్జునుని సంకటస్థికి కృష్ణుడిచ్చిన ఉపదేశం ఇదీ...

"కళ్ళు తరచి చూడు. ఈ నిరోధం కేవలం వర్తమానానికి సంబంధించినది కాదు. ఇది కాల, స్థానాలకు అతీతమైనది, నిర్నిమిత్తమైనది. సత్యం ప్రాపంచిక భ్రమలకై రాజీ పడరాదు. ఎవరో ఒకరు సత్యాన్ని నిలపాలి. అది నీవే అయి తీరాలి. నీవు కాకుంటే వేరెవరు ఈ కార్యానికి పూనుకుంటారు? లేకుంటే నీ పిల్లలకు నీవేం చెబుతావు? ప్రతిఘటించకుండానే రాజీ పడ్డానని చెబుదువా?"

సత్యాన్ని గ్రహించిన అర్జునుని సమాధానం:

"నేను పట్టు సడలించను. ప్రత్యర్ధులకు లేశమాత్రమైనా అవకాశాన్నీయను. నన్ను త్యాగం చేసుకోవలసిన అవసరం వచ్చినా అందుకు సిధ్ధమే. నా సర్వ శక్తులూ ఒడ్డి పోరాడుతాను. ధర్మం నిలబడాలి. అధర్మం విస్తరించిన చోట సహనం జీవించలేదు. ఈ అధర్మం కూకటివేళ్ళతో పెకిళించబడే దాకా నే విశ్రమించను."

ఇదీ ఒకప్పటి భారతదేశ స్ఫూర్తి. దీని అవసరం ప్రస్తుత ప్రపంచానికి ఉంది. భారతదేశ సమస్యలను నిర్లక్ష్యం చేయటమంటే తల్లిని నిర్లక్ష్యం చేయటమే. మనదేశం భూమండలానికి హృదయం వంటిది. ఇక్కడి సమస్యలు ప్రపంచం అంతటా ఏదో విధంగా ప్రతిఫలిస్తాయి. గుండె చెడినపుడు తల, కాళ్ళు వంటి ఇతరత్రా అవయువాలకు సమస్య రావటంలో వింత ఏమున్నది?

పాశ్చాత్య సంస్కృతులు ఈ హృదయం లేని జీవితానికి అలవాటు పడినాయి. స్వార్ధపూరిత, అపరిపక్వత సంస్కృతికి హిందూ ఆధ్యాత్మిక ఆవశ్యకత ఎంతయినా ఉంది. హింసాత్మక కర్మ సిధ్ధాంతంలో, రాజకీయ, సైనిక కబంధ హస్తాలలో చిక్కుకున్న ఇస్లాం సైతం ఈ విధమైన ఆధ్యాత్మికతను ప్రపంచానికి అందించలేదు. మరో దేశమైన చైనా దురదృష్టవశాత్తూ కమ్యూనిజానికి బందీ అయినది. భారతదేశమొక్కటే ఈ విధమైన ఆధ్యాత్మికతను ప్రపంచానికి అందించగల సామర్ధ్యాన్ని కలిగి ఉంది. అయితే ఇక్కడి రాజకీయనాయకులు అవినీతిని ప్రోత్సహిస్తున్నంత కాలం, నైతికంగా హిందుత్వం ఎదగలేదు.

అధర్మంతో రాజీ పడటం అంటే అది సహనమో, అహింసయో కాదు. అది స్వవినాశనం. భయంతోనో, అనుమానంతోనో, అవిశ్వాసంతోనో మనం నమ్మాల్సిన సిధ్ధాంతాలకు నీళ్ళొదలటం అంటే కొరివితో తలగోక్కోవటమే. ప్రపంచం ఆధ్యాత్మిక, నైతిక విలువల లేమితో బాధపడుతుంది. భూగోళాన్ని తల్లిగా భావించి, హిందుత్వాన్ని ఒక విశ్వశాంతి సందేశంగా, శక్తిగా గుర్తెరగండి.

అయితే ఇది జరగటానికి ఎంతో మార్పు కావాలి. ప్రస్తుత భారతం నిజమైన హిందుత్వానికి ప్రతిరూపంగా కాకుండా ఒక ఛాయగా మాత్రమే మిగిలి ఉంది. మహర్షులు నడిచిన ఈ నేలపై అవినీతి, కుసంస్కారం రాజ్యమేలుతున్నాయి. నిజమైన హిందుత్వాన్ని గర్హించినవారు కేవలం బాధాతప్తులై, భగ్న హృదయులై మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. వీరంతా అర్జునుని వలే కార్యోన్ముఖులు కావలసిన అవసరం ఉంది. ఇందుకు బదులుగా పోరాటాన్నే జరుపనవసరం లేదు. కనీసం మనం నమ్మిన సత్యానికై నిలబడినా సంతోషమే. ఈ పరిస్థితులలో ప్రపంచం మొత్తం ఎదురు తిరగనీయి. నీవు మాత్రం మనో సంకల్పాన్ని, నిబ్బరాన్ని కోల్పోవద్దు.

లేవండి. మేల్కొనండి...

నీడా - నేనూ

ది ఒక వెన్నెల రాత్రి.

నేను పాడుబడ్డ శిధిలాల మధ్య ఉన్నాను. ఒంటరిగా ఉన్నాను. మోకాళ్ళల్లో తల దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూఉన్నాను. కాసేపటికి తల ఎత్తి చూస్తే ప్రక్క గోడపై, నా నీడ కూడా ఏడుస్తూ ఉంది.

"నువ్వెందుకు ఏడుస్తున్నావ్?" అడిగా నా నీడను.

"నీ ఏడుపు చూసి ఏడుపు వచ్చింది."

"ఇంతకీ నువ్వెందుకు ఏడుస్తున్నావ్?" ప్రశ్నించింది.

"నాకెవ్వరూ లేరు" ఏడుపు ఆపి జవాబిచ్చాను.

నీడ నవ్వింది.

"నీకంతా ఉన్నారు."

"నిజమే! నాకంతా ఉన్నారు." దిగాలుగానే అన్నాను. "కానీ అర్ధం చేసుకునేవారే లేరు."

"అర్ధం చేసుకునేలా ఎప్పుడు ప్రవర్తించావు గనుక?" నీడ నిష్థూరమాడింది.

"ఆ అవసరం నాకు లేదు." జవాబిచ్చాను.

"అనవసరమనే బదులు, చేతకాదనవచ్చుగా..?" నీడ వెటకారంగా అంది.

కోపం వచ్చింది. కాని వ్యక్తం కాలేదు. ఎందుకంటే - చెప్పాగా, ఆ అవసరం నాకు లేదు.

ఐతే నీడ నా కోపాన్ని గ్రహించింది.

"సంజాయిషీ ఇచ్చుకోవచ్చు కదా!" అడిగింది నన్ను.

"ఆ అవసరం నాకు లేదు."

"ఐతే చేతకానితనమే అనుకోవలసి ఉంటుంది" నీడ విషయాన్ని పెద్దది చేయటానికి ప్రయత్నించింది.

అభ్యంతరం లేదన్నట్లుగా కనుబొమలు చిట్లుస్తూ భుజాలెగరేసాను. నీడకు నోరు పెగల లేదు.

కాసేపాగి అంది.

"నీ ప్రవర్తన వల్ల అపకీర్తిని వెంట తెచ్చుకుంటున్నావ్."

"నేను పట్టించుకోను."

"సంఘంలో..."

"ప్చ్...." విసుగ్గా బుర్ర ప్రక్కకు తిప్పుతూ నీడ మాటలకు అడ్డు తగిలాను.

నీడ చెప్పి తీరాలని నిశ్చయించుకుంది.

"సంఘంలో బ్రతికున్నంత కాలం ప్రక్క వ్యక్తిని మెప్పిస్తూ ఉండాలి."

"నాకా అవసరం లేదు." మనసులో అనుకున్నాను.

నేను వ్యక్తం చేయక పోయినా నీడ నా భావాలను గ్రహించగలదు.

"ఇలా అయితే నువ్వు ఎవ్వరి ప్రేమనూ పొందలేవు."

"నాకు ఎవ్వరి ప్రేమా అవసరం లేదు." సమాధానమిచ్చాను.

"మరి ఇందాక నీ ఏడుపుకి కారణం అదేనని చెప్పినట్లు గుర్తు.." నీడ గుర్తు చేసింది.

సమాధానం ఇవ్వలేక తడబడ్డాను.

'నిజమే!! ఇంతకాలం నా వేదనకి కారణం ఒంటరితనమేమోనని పొరబడుతూ వచ్చాను. కాదని ఖచ్చితంగా తేలింది.'

క్రొత్త ప్రశ్న మొలకెత్తింది.

'నా కన్నీరుకి కారణం ఏమై ఉంటుంది?'

ఎంతగా అలోచించినా అంతు చిక్కలేదు.

"చూస్తూ ఉంటే నీకు మిగిలిన ఏకైక నేస్తాన్ని నేనేలా ఉంది." నీడ నవ్వుతూ అంది.

"లేదు."

"మరి??" నీడ నవ్వుతూనే అడిగింది మళ్ళీ.

"నువ్వు మనిషివి. నిన్ను నేను నమ్మను." జవాబిచ్చాను.

"అలా ఐతే నువ్వు ప్రేమించేది ఎవరిని?"

"కేవలం నన్ను నేను" గర్వంగా బదులిచ్చాను.

నీడ బిగ్గరగా నవ్వింది.

నవ్వాపుకోలేక ఆపసోపాలు పడుతూ చాలా మెత్తగా నెమ్మదిగా అంది.

"నువ్వంటే..... నేను కాదూ....?!?"

చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయాను.

నీడ చెప్పినదంతా అర్ధం అయ్యింది. నా కన్నీరుకి కారణం అవగతమయ్యింది. కానీ ఆ కారణం గుండెల్లో గుచ్చుకుంది.

నిజమే....!!

'నన్ను నేనే ప్రేమించుకోలేకపోతున్నాను!'

"సరే నీకు చేతకానివి... అదే.. అదే.. నువ్వు అనవసరమనుకున్నవన్నీ నేను చేసి చూపిస్తాను." నీడ శెలవు తీసుకుని జనారణ్యంలోనికి వెళ్ళిపోయింది.

నీడ నవ్వులు చెవుల్లో బిగ్గరగా ప్రతిధ్వనిస్తున్నాయి.

"నువ్వంటే..... నేను కాదూ....?!?" అన్న నీడ మాటలు బాకుల్లా గుచ్చుకుంటున్నాయి.

నేను విలపిస్తున్న సమయంలో నీడ నా ప్రక్కనే కూర్చుని తోడుగా కన్నీరు కార్చటం ఙ్ఞాపకం వచ్చింది.

గోడపై చూసాను.

నీడ లేదు. ఆ నేస్తం కావలనిపించింది.

జనారణ్యంలో ఉంటుందని తెలుసు.

"వెళ్ళనా?" ప్రశ్నించుకున్నాను.

"ఆ అవసరం నాకు లేదు." సమాధానమూ ఇచ్చుకున్నాను.

తెలియకుండానే కన్నీరు వచ్చింది. మోకాళ్ళల్లో ముఖాన్ని ఆజన్మాంతం దాచేసుకున్నాను.

ఇప్పటికీ నేనీ శిధిలాల మధ్య ఒంటరిగా, వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నాను.

జీవితం



జీవితం అన్న మూడక్షరాల పదం తాలూకు మూలార్ధాన్ని వెతకటం కోసం అతడు ఎంతో కాలాన్ని వ్యర్ధం చేస్తున్నాడు. యుగాల తరబడి జీవితాలని వృధా ప్రయాసకై ఉపయోగిస్తున్నాడు.

అతడు రాతియుగంలో పుట్టాడు. ఒంటరిగా కాదు. ప్రకృతి తోడుగా ప్రకృతిలో పుట్టాడు. పసిగుడ్డు. ఏమీ తెలియదు. అలసటతో ఆదమరచి నిద్రించాడు. అస్తవ్యస్తమైన కలలు వచ్చాయి. కానీ అర్ధం కాలేదు. వాటి భాష తెలియదు. భావం తెలియదు. ఎందుకు వచ్చాయో తెలియదు. ఆకలి వేసినప్పుడు అందుబాటులో ఉన్నవి తిన్నాడు. ఆ తిన్నది అశుధ్ధమై వచ్చింది. కోరిక కలిగినప్పుడు ప్రకృతితో ఏకమయ్యాడు. ప్రకృతి ప్రసవిస్తే అశుధ్ధమని భ్రమించాడు. ఆ అశుధ్ధం చలించటంతో అక్కున చేర్చుకున్నాడు. జీవించటం నేర్చుకున్నాడు. కానీ ‘జీవితం’ తెలియలేదు. అసలు జీవితం గురించి తెలుసుకోవాలన్న జిఙ్ఞాస, పరిఙ్ఞానం లేవు. ఆ పరిఙ్ఞానం పెంపొందించుకునేటప్పటికి ప్రళయం వచ్చింది. తాను అనుకూలంగా మార్చుకున్నవన్నీ మట్టిగొట్టుకు పోయాయి. మళ్ళీ ప్రకృతితో పాటూ మిగిలాడు ఒంటరిగా.

తాను కోల్పోయిన వాటిని పునర్నిర్మించుకునే యత్నంలో అతనికి జీవితాన్ని గురించి ఆలోచించే వ్యవధి దొరకలేదు. మళ్ళీ నాగరికంతో పాటూ పెరిగాడు. చాలా విషయాలు తెలిసినై. 'జీవితం' తెలియలేదు. తెలుసుకోవాలని మధనపడ్డాడు. అంతర్లీనంగా లోలోన కాస్తగా పడ్డ తపన క్షణక్షణానికి బలమై జీవితాన్ని తెలుసుకోవటం కోసమే జీవితాన్ని వెచ్చించే స్థితి దాపురించింది. అయినా 'జీవితం' తెలియలేదు. ఇలాకాదని అన్నింటినీ త్యజించి పోయాడు ఒంటరిగా. ఆఖరికి ప్రకృతిని ఒదిలి.

కాళ్ళు లాక్కెళ్ళిన వైపు పోయాడు. నగ్నంగా కనిపిస్తున్న సృష్టిలో ఒంటరినని నిర్ధారించుకుని, కళ్ళు మూసుకుని జీవితం తాలూకు మూలార్ధాన్ని అన్వేషించసాగాడు. నిద్రాహారాలు లేవు. అలసట లేదు. కోరికలు లేవు. మరో వ్యాపకమేదీ లేదు. బహుశా తపస్సు అంటే అదేనేమో.

అతనికి సమాధానం దొరకలేదు. జీవితం అయిపోయింది. మరోసారి తెలుసుకోవచ్చునని తనను తాను సమాధానపరచుకున్నాడు.

మరో జన్మ వచ్చింది. ఈసారి భారాన్నంతా ఓ అదృశ్య శక్తి పై ఆపాదించాడు. ఆ అదృశ్య శక్తికి భగవంతుడని పేరు పెట్టుకున్నాడు. భక్తుడయ్యాడు. జీవితమంతా భక్తి పారాయణం చేసాడు. జీవితం అంతు చిక్కలేదు. తన జీవితం సరిపోలేదు. మరోసారి తెలుసుకోవచ్చని స్థిమితపడ్డాడు.

అది మొదలు ‘జీవితం’ తెలుసుకోవటం కోసం అనేక జీవితాల తరబడి ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

తత్వవేత్త రూపు దాల్చాడు. తెలియలేదు.

ప్రపంచాన్నంతటినీ జయించి ‘జీవితాన్ని’ తెలుసుకోవటం కోసం ఎంతో మందిని నియమించాడు. తెలియలేదు.

రచయితగా పుట్టి జీవితాంతం అన్వేషించాడు. ఉహూ! శాస్త్రవేత్తగా మారి చచ్చే దాకా పరిశోధించాడు. ఫలితం శూన్యమే!

చివరకు సన్యాసిగా అవతరించాడు. అన్నింటినీ త్యజించి తనను తాను పునర్విమర్శ చేసుకున్నాడు. ‘జీవితం’ తెలుసుకోవటం దుస్సాధ్యం అనిపించింది. గతాన్ని తవ్వుకుంటూ తర్కించుకుంటూ పోతే తాను తొలిసారి ప్రకృతి ప్రసవిస్తే ఏమని భ్రమించాడో ఙప్తికి వచ్చింది. నవ్వు వచ్చింది.

అనాగరికంగా, మృగంగా ఉన్నప్పుడు తెలుసుకున్న విషయాన్ని మరచి తిరిగి అదే విషయాన్ని తెలుసుకోవటం కోసం యుగాలు పట్టింది. లెఖ్ఖలేనన్ని జీవితాలు పట్టింది.

అతను ధృఢంగా నిశ్చయించుకున్నాడు.

“నిజం! జీవితం అశుధ్ధం!”

సంస్కృతి - ఆవశ్యకత



త్యాన్ని గ్రహించటానికి కుల, మత, జాతి, వర్ణ వంటి దేశ, సంస్కృతులను దాటి ఆలోచించాలి. స్వవ్యక్తిత్వాలకు అతీతమైనవి గ్రహించగలిగినప్పుడే స్థాన, కాల పరిస్థితులతో నిమిత్తం లేని సత్యం బోధపడుతుంది. అయితే అంతమాత్రాన ఆధ్యాత్మికతను గుర్తించటంలో సంస్కృతి ప్రాధాన్యత లేదని కాదు. మానవీయ కోణంలో చరిత్రను గమనిస్తే ఆధ్యాత్మిక అనుభవం పొందిన పురుషులు గానీ, స్త్రీలు గానీ అన్ని సంస్కృతుల నుంచీ సమానంగా రాలేదు. దీనివల్ల ఆధ్యాత్మికతను పొందటంలో అంతర్లీనంగా దాగున్న సంస్కృతి ప్రభావం కనపడుతుంది. మన దేశ సంస్కృతిలో ఆధ్యాత్మికతను నిలబెట్టటంలో వేదకాలం నుండీ నేటి వరకు ఒక వర్గం ప్రధాన పాత్ర పోషిస్తుంది. వేదకాలం నుండీ ఈ శకానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవాది జిడ్డు కృష్ణమూర్తి వరకూ కూడా వీరందరూ బ్రాహ్మణ కులానికే చెందటం ఏ మాత్రం యాదృచ్చికం కాదు (పాఠకులకి ఒక చిన్నవివరణ: నేను బ్రాహ్మణుణ్ణి కాదు).

యూరోపియన్, ఇస్లాం సంస్కృతలలో ఈ విధమైన ఆధ్యాత్మిక చింతన గల వ్యక్తులు చాలా తక్కువగా ఉండటానికి కారణం సంస్కృతియే. ఆయా సంస్కృతులు, మతాలూ ఇప్పటికినీ ప్రభువు బిడ్డయనో, చివరి ప్రవక్త యనో అవ్యక్తంగా కొందరికి స్థానాలను కట్టబెట్టటం ద్వారా మిగిలిన వారికి స్వతంత్ర్యంగా ఆధ్యాత్మికానుభవం పొందే అవకాశాలను నిర్వీర్యం చేసాయి. అదృష్టవశాత్తూ హిందుత్వానికి ఈ బెడద లేదు. మన భారతీయ సంస్కృతిలో సత్యం ఈ విధంగా కేవలం ఒక్క కోణంలోనే చూడబడలేదు. ఎంతో మంది ఆధ్యాత్మికవాదులు స్వేఛ్ఛగా, స్వతంత్ర్యంగా పూర్వుల ప్రభావం తమపై పడకుండా సత్యశోధన చేయగల ఆస్కారం కల్పించబడింది. మిగిలిన సంస్కృతులలో, మతాలలో గతంలో పుట్టిన ఓ మానవుని దైవ ప్రాతిపదికను ప్రాధమీకరించి సత్యశోధనను ఆ వ్యక్తి ద్వారా ప్రకటించగా, హిందుత్వం ఆత్మ స్పృహను ఆశ్రయించింది. పూర్వులు గొప్పవారే కావచ్చును. అంత మాత్రాన వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ తత్సమానులైన వ్యక్తులు పుట్టబోరనటం మనలను మనం తక్కువ చేసుకోవటమే. మానవుని సమర్ధతను ఈ విధంగా తక్కువ అంచనా వేయటం తగదు.

బౌధ్ధ సంస్కృతిని తరచి చూసినా హిందువులలో ఉన్నంతమంది ఆధ్యాత్మికవాదులు కనపడరు. కారణం బౌధ్ధంలో సైతం హిందుత్వంలో నున్నంత ఆత్మ స్పృహ లేక ఎక్కువగా practicalityని పొందినది. వీటిని బట్టి ఆధ్యాత్మికతను అందించటంలో సంస్కృతి పాత్రను కొట్టిపారేయలేం. నేడు హిందూ సంస్కృతి అంటే అధిక జనాభా, అపరిశుభ్రత, కుల వర్గ విచక్షణ వంటి సామాజిక సమస్యలు కనిపించవచ్చుగాక! అయితే ఇవి హిందుత్వ గొప్పతనాన్ని కప్పివేయకూడదు. అంతకు మించి ఈ సమస్యలు భావితారాలకు హిందుత్వ మహోన్నత విలువలను అందించటంలో ఆటంకాలు కాకూడదు (దురదృష్టవశాత్తూ అదే జరుగుతోంది).

గత వందేళ్ళ కాలంలో చూసినా - రామకృష్ణ, వివేకానందుడు, రామ తీర్థుడు, అరబిందో, రమణ మహర్షి, మాతా ఆనందమయి, స్వామీ శివానంద, నీమ్ కరోలీ బాబా, స్వామీ నిత్యానంద వంటి ఎందరో ప్రముఖ ఆధ్యాత్మిక వాదులను భారత దేశం అందించింది. వీరెవరూ మత సంస్థలద్వారానో, మరే విధంగానో తయారు చేయబడలేదు. వీరంతా స్వతంత్ర్యంగా ఆత్మానుభూతిని పొందినవారే. (జిడ్డు కృష్ణ మూర్తి అనిబీసెంటు సంరక్షణలో సంస్థ ద్వారా శిక్షణ పొందటం వలన ఇక్కడ పేర్కొనలేదు). పశ్చిమ, ఇస్లామిక దేశాలను, బౌధ్ధాన్ని చూస్తే కొద్దో గొప్పో ఉనికి చాటుకున్న ఆధ్యాత్మిక వాదులు మత సంస్థల ద్వారా వచ్చినవారే.

ఈ విదేశీ సంస్కృతులలో స్వఛ్ఛందంగా, వ్యక్తిగతంగా ఆధ్యాత్మికతను సంపాదించటం క్లిష్టతరం కావటం వల్ల అటువంటి వ్యక్తులు మృగ్యం. ఈ రకమైన ఆధ్యాత్మికవాదులను పళ్ళగా భావిస్తే సంస్కృతిని ఆ ఫలవృక్షాలనందించిన భూమాతగా గుర్తించవచ్చు.

అయితే పశ్చిమ దేశాలకు వెళ్ళిన హిందూ యోగా గురువులు తమతో అతి తక్కువ పరిమాణంలో హిందుత్వాన్ని తీసుకు వెళుతున్నారు. వీరు మన సంస్కృతిని విదేశీయుల వద్ద నిజాయితీగా ప్రదర్శించటానికి సంకోచించారు. విగ్రహారాధన వంటి హిందుత్వ ఆచారాలు ప్రశ్నింపబడతాయన్న అనుమానంతో యోగా, ధ్యానం వంటి వాటికి ప్రాధాన్యత కల్పించి విదేశీయులకు ఈ యోగా, ధ్యానం వంటి హిందుత్వ పధ్ధతులతో పాటుగా తమ తమ మతాలను ఆచరించుకునే వెసలుబాటు కల్పించారు.

విగ్రహారాధన, హిందూ అర్చన, పూజ పునస్కారాలు వంటివి చాలా వరకు అపార్ధం చేసుకోబడుతున్నాయి. యోగాని నిష్టతో ఆచరించే హిందువేతరులు, విదేశీయులు కనీసం హిందూ దేవాలయాల లోనికి అడుగు పెట్టి కూడా ఉండరు. ఒక వేళ వెళ్ళినా ఆసక్తి తో తక్కితే మూలాన్ని గ్రహించే అధ్యయనం చేయరు. హిందుత్వం అందించిన అనేక ఫలాలు ఆయుర్వేదం, జ్యోతిష్య శాస్త్రం వంటివి ఇప్పుడిప్పుడే వెలుగు సంతరించుకుంటున్నాయి. సంస్కృత కావ్యాలూ, హిందూ సంగీత సాహిత్యాలూ, నృత్య రీతులు, భంగిమలూ ఇలా అన్నింటి వెనుకనా నిగూఢంగా ఉన్న వేద ఉపనిషత్తుల ప్రభావాన్ని గుర్తించండి. మన సంస్కృతిలో ప్రతీ రంగంలో నున్న ఆధారతత్వాన్ని గమనించండి.

ఆదునిక హిందువు తన సంస్కృతి పట్ల, ఆలయాల పట్ల, ఆచారాల పట్ల, వేద పారాయణం, పండుగల నిర్వహణల పట్ల అవిశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. వేద సారాంసాన్ని ఆరాధించే ఆదునిక హిందువు సైతం ఈ తరహా సంస్కృతులను సన్యసించిన జిడ్డు కృష్ణ మూర్తి, రజనీష్ వంటి ఆధ్యాత్మిక వాదుల నుంచి స్ఫూర్తి పొందుతున్నారు తప్పితే సంస్కృతిని పరిరక్షిస్తున్న వారిని కాదు. ఈ ఆధునిక హిందువు పాశ్చాత్య సంస్కృతి సౌకర్యాలకు అలవాటుపడి హిందు సంస్కృతిలోని అంతఃసౌందర్యాన్ని విస్మరిస్తున్నారు. ఆధునిక హిందువులకు ఓ విజ్ఞప్తి: ఆధ్యాత్మికతనూ సంస్కృతినీ వేరు చేసి చూడవద్దు. ఆధ్యాత్మికత రాముడైతే సంస్కృతి సీత. రాముని లక్ష్య సాధనలో సీత రక్షింపబడాలి. అత్యున్నత వేదసారాంశాన్ని అవపోసాన పట్టటమొక్కటే చాలదు. సంస్కృతిని కూడా పరిరక్షించుకున్నప్పుడే పరిపూర్ణత సిధ్ధిస్తుంది.

మిగిలిన దేశాలలో, సంస్కృతులలో తాత్వికులూ, ఆధ్యాత్మికవాదులు లేకపోలేదు. అయితే సరియైన సంస్కృతి లేకనే హిందుత్వం అందించినటువంటి ఉన్నతమైన ఆధ్యాత్మికవాదులు అక్కడ వెలుగులోనికి రాలేకపోయారు. మిగిలిన ప్రపంచ సంస్కృతులలో ఆధ్యాత్మికత ఎడారిలో ఎండమావిలాంటింది. హిందువు ఆధ్యాత్మికతనూ, సంస్కృతినీ వేరు చేయటం మానాలి. నిశితంగా గమనించి చూడండి. మన సంస్కృతిలోని భక్తి తత్వం, విగ్రహారాధన వంటివి ఆధ్యాత్మికతతో ఏమాత్రం విభేదించటంలేదు. నిజానికి ఈ తరహా సంస్కృతియే ఆధ్యాత్మికతను సముపార్జించటంలో దోహదపడుతుంది. యోగాభ్యాసాలను కూడా ఈ విధమైన సంస్కృతి నుండి వేరు చేయవద్దు. అంత మాత్రాన యోగా శిక్షణలో భక్తి తత్వాన్ని చొప్పించమని చెప్పటం నా ఉద్దేశ్యం కాదు. భక్తి కూడా ఒక విధమైన యోగా అని తెలుసుకోండి. దీనిని తెలియజెప్పటం ద్వారా యోగా సిధ్ధాంతాలు మన సంస్కృతిని నిలబెట్టేందుకు సహాయపడగలవు.

ఆధ్యాత్మికపరంగా పరిణితి సాధించిన వారికి సంస్కృతి ఒక భ్రమ కావచ్చును. అయితే వారు ప్రపంచావసరాలను కూడా గుర్తెరిగి మసలుకోవాలి. ఆధ్యాత్మికత కంటే సంస్కృతి త్వరగా విస్తరిస్తుంది. ఆధ్యాత్మికత పురుషుడైతే సంస్కృతి ప్రకృతి. వ్యక్తి వ్యక్తికీ ఆధ్యాత్మికతలోని లక్ష్యం, చూసే ధృక్పధం మారవచ్చును. కానీ సంస్కృతి ఈ లక్ష్యాన్ని అందరూ ఒకే కోణంలో చూసేందుకు ఉపయోగపడుతుంది. సంస్కృతి అవసరం లేకుండా ఆధ్యాత్మికతను పొందటం కష్టతరమైన కార్యం. సంస్కృతి - కళాలూ, తత్వాలూ, శాస్త్రాలూ వంటి అనేక రూపాల్లో మానసిక వికాసానికి తోడ్పడి ఆధ్యాత్మికతకు దారి తీస్తుంది.


వ్యక్తిగత ఆధ్యాత్మికత నిట్టనిలువుగా ప్రయాణించే సరళరేఖ ఐతే, సంస్కృతి కొంత దూరం అడ్డంగా ప్రయాణించి తర్వాత నిలువుగా సాగుతుంది. ఈ రెంటి పరమార్ధం ఒక్కటే. స్థాన, కాలాలను బట్టి సంస్కృతులను కొంత మేరకు దిద్దుకోవటంలో తప్పులేదు. కానీ ఈ దిద్దుబాటు సంస్కృతిని కలుషితం చేసేది కాకూడదు. సంస్కృతి దాచుకునేది కాదు. క్రైస్తవం, ఇస్లాం మతాల తాకిడితో భారత దేశంలోనే హిందుత్వం ఆత్మ రక్షణలో పడింది. ఈ ఆపద నుండి బయటపడి మన సంస్కృతి గొప్పతనాన్ని చాటుకునే పరిస్థితి రావాలి. సహజంగానే హిందుత్వ ప్రకాశానికి, ప్రచారానికి ఈ ఇతర సంస్కృతులనుండి అవరోధాలేర్పడతాయి. ఈ పోటీలో ఆత్మ రక్షణ ఒక్కటే చాలదు. ధృఢ సంకల్పంతో మన సంస్కృతి విలువలను వినిపించగలగాలి. ఇది కేవలం దేశానికి సంబంధించిన విషయంగా భావించవద్దు. విలువలకు సంబంధించినదని గుర్తెరగండి.

మనలో కూడా చాలా మంది హిందూ సంస్కృతి అనే కంటే భారతీయ సంస్కృతి అని పిలవటానికి ఇష్టపడతారు. వీరి దృష్టిలో 'హిందూ' అన్నది మతానికి సంబంధించినది. భారతీయత అన్నది విభిన్న మతాలకు, సంస్కృతులకూ సంబంధించినది. అయితే మన దేశ మూలాలు హిందుత్వంతోనూ, సంస్కృతంతోనూ ముడిపడి ఉన్నవి. ఇతర మతాలయిన బౌధ్ధ, జైన, సిక్కులతో పాటూ, కొంత మేరకు క్రైస్తవం, ఇస్లాం కూడా మన దేశంలో విస్తరించాక ఈ సంస్కృతిని వంటబట్టించుకున్నవే.

మన సంగీతం 'హిందుస్తానీ' లోని వ్యక్తీకరణ, అంతరార్ధాలూ సామ వేదానికి సంబందించినవి. మన నృత్యం హిందూ దేవాలయాల భంగిమలకు సంబంధించినది. మన ఆయుర్వేదం, జ్యోతిష్య శాస్త్రాలు సైతం వేదాల నుండి వేళ్ళూనుకున్నవే. హిందూ కావ్యాలూ, కవిత్వాలూ, నాటకాలూ, హిందూ పురాణాల చుట్టూ పరిభ్రమిస్తాయి. యోగాభ్యాసాలతో నిండిన హఠయోగం సైతం మతపరమైన ఆచార వ్యవహారాల సాధనల నుండి పుట్టినదే. "అన్నీ వేదాల్లోనే ఉన్నాయషోయ్?" అన్నది ఒక అజ్ఞాని వెటకారమే కావచ్చును. కానీ అది మానవ లక్ష్యసాధనకు సంబంధించినంత వరకు విస్పష్ట సత్యం.

హిందుత్వంపై ఇతర సంస్కృతుల ప్రభావం లేదు. కానీ క్రైస్తవం పై అంతకు ముందరి గ్రీకు రోమన్ల ప్రభావం, ఇస్లాం పై క్రైస్తవ ప్రభావం గమనార్హం.
దురదృష్ట వశాత్తూ ఆధునిక హిందువు పశ్చిమ దేశ సంస్కృతి మోజులో పడి తన ఆలోచనా విధానాన్ని మార్చుకుంటున్నాడు. ఇది కేవలం మన భారత దేశానికే కాక ప్రపంచమంతటికీ నష్ట దాయకం. ప్రపంచంలో మందిని ప్రభావితం చేయగల మేధావులకు కొదువ లేదు. వీరి రాజకీయ పరమైన విశ్లేషణలు సగటు మానవుని భావోద్వేగాలను సొమ్ము చేసుకుని సత్యాన్ని దూరం చేస్తున్నాయి. నేటి తరంలో షేక్సిపియరు ఎందరికి తెలుసు? ఎందరికి కాళిదాసు, భక్తృహరులు తెలుసు? వీరు షేక్సిపయరు కంటే ఎందుకు హీనంగా చూడబడుతున్నారు? ఇంగ్లాండులో షేక్సిపియరు ఉత్సవాలు జాతర్ల మాదిరిగా జరుగుతాయి. మనమెందుకు కాళిదాసుని ఆ విధంగా నెత్తిన ఎత్తుకోలేకపోతున్నాం?

హిందువెందుకు పశ్చిమ దేశాల విద్యా వ్యవస్థని అనుసరించాల్సి వస్తోంది? ఎందుకు మార్క్స్, లెనిన్ వంటి వారి దృక్కోణం నుండి ప్రపంచాన్ని చూడవలసి వస్తోంది? ఎందుకు మనకున్న ఆది శంకరాచార్యుని మొదలు అరబిందో వరకు ఉన్న వారివంక దృష్టి సారించలేకపోతున్నాం? మన సంస్కృతి అన్ని దేశాలూ నేర్చుకుని లాభపడేందుకే కాని విషతుల్యం చేసేది కాదు కదా. మరి మన విజ్ఞానాన్ని అధ్యయనం చేసేందుకు ఎందుకు విదేశీయులు రాలేకపోతున్నారు? ఇందుకు హిందువే ముందడుగు వేయనపుడు విదేశీయులనాశించటం అత్యాశయే అవుతుంది. వీటన్నిటికీ సమాధానంగా నిబధ్ధతతో హిందుత్వాన్ని ఆచరించండి. ఒక దేశ సంస్కృతిగా కాక ప్రపంచ సంస్కృతిగా భావించండి. తెలియని వారికి హృదయం నుండి వివరించండి. వారికి ఒక గొప్ప బహుమతినిచ్చిన వారవుతారు. దీని కోసం కంప్యూటర్లనీ, విజ్ఞానాన్ని త్యజించనవసరం లేదు. నేర్చుకునే వయసులోనున్న మీ పిల్లలకు కనీసం వేసవి శెలవులలో హిందూ సాంస్కృతిక విద్యనందించంఢి.

నేటి ప్రపంచంలో నిజమైన సంస్కృతి దాదాపు అంతరించే స్థితికి దాపురించింది. ప్రపంచదేశాల మధ్య దూరం తగ్గి ఆ దూరాన్ని తగ్గించిన పాశ్చాత్య సంస్కృతి అంతటా విస్తరించి వేళ్ళూనుతోంది. నిజానికి ప్రపంచంలోని ఈ సంస్కృతి లేమి, శూన్యత హిందుత్వానికి ముందడుగు వేసేందుకొక గొప్ప అవకాశం. దీనిని వినియోగించండి.

అయితే అంతకు ముందు నిద్దరోతున్న హిందుత్వ ఆత్మ మేల్కొనాలి. లక్ష్య సాధనకు ఉద్యమించాలి. ఈ శతాబ్దం ఈ విధమైన మేల్కొలుపునకు కీలకమైనది.

Its like Now or Never...