మహాభారతం - హిందుత్వ ఆత్మ


చాలా మంది విద్యావంతులు సైతం, బ్రిటిష్ పాలనకు మునుపు భారతదేశం చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేదని, బ్రిటిష్ వారి పుణ్యాన భారతదేశం ఆ రాజ్యాలన్నీ కలుపుకుని ఒక పరిపూర్ణదేశంగా రూపాంతరం చెందిదని అభిప్రాయపడతారు. వారి ఈ అభిప్రాయానికి కారణం మనం చిన్నప్పుడు చదువుకున్న పాఠ్య పుస్తకాలే. అంతే కాక భారత దేశం అంతటా వివిధ రకాల సంస్కృతులు (ఈ వాదనకు ఊతంగా వివిధ భాషలను తీసుకుంటారు.) ఉండేవని, రాజకీయపరంగా భారతదేశాన్ని ఒక్క గాటిన పెట్టటానికి వీటన్నటినీ సమ్మేళనం చేసి హిందుత్వం అన్న వాదనని తెరపైకి తెచ్చారని కూడా మార్కిస్టులూ మరియూ హిందువేతరులూ భావిస్తారు. వీటిలో నిజానిజాలను పరిశీలిద్దాం.

హిందూ గ్రంధాల ప్రకారం మహాభారత పర్వం సుమారు 3500 ఏళ్ళ కాలం నాటిది. సరే హిందూ మత గ్రంధాల నిబధ్ధతను ప్రశ్నించే ఆస్కారం ఉంది కనుక, మహాభారతం నిజంగా జరిగిందా లేదా అన్న విషయాన్ని పక్కన పెడదాం. అయితే క్రీస్తుపూర్వమే లిఖించిన శిలాశాసనాలపై(ఇవి తమిళనాడులో బయల్పడ్డాయి) మహాభారతం గూర్చిన వివరణ ఉంది. వీటిలో మహాభారత కాలంలో సామ్రాజ్యం ఎక్కడనుండి ఎక్కడ వరకు విస్తరించి ఉన్నదన్న వివరాలు ఉన్నాయి. ఈ శాసనాలలో వర్ణించిన మహాభారత పర్వం జరిగిన ప్రదేశాలు ఇప్పటి భారతావనిలో గుర్తింపబడ్డాయి.

కురుపాండవుల యుధ్ధం గంగా-యమున నదుల మధ్య భాగాన జరిగినట్లు ఉంది(ఇప్పటికీ ఈ ప్రదేశం కురుక్షేత్రం గా పిలవబడుతుంది). కౌరవుల తల్లి గాంధారి పుట్టినిల్లయిన గాంధార దేశం ఆఫ్ఘనిస్తాను-పాకిస్తానుల మధ్య గుర్తింపబడినది. ముందు చెప్పినట్లు మహాభారతం నిజంగా జరిగిందా లేదా అన్నది ఇక్కడ అప్రస్తుతం. 3500 ఏళ్ళ క్రితం భారతం జరగనీ జరగకపోనీ, కానీ ఈ క్రీస్తు పూర్వపు శిలాశాసనాల వర్ణన ప్రకారం, కనీసం ఆనాటికైనా అఖండ మహాభారతావని ప్రస్తావన ఉంది.

పాండవుల తల్లి కుంతీ దేవి పుట్టినిల్లు ఇప్పటి మధ్యప్రదేశ్ నకు చెందినట్లుగా గుర్తింపబడినది. మహాభారత సూత్రధారి శ్రీ కృష్ణుని జన్మస్థలం యమునానదీ తీరాన ఉన్న మధురగా, కృషుడు పాలించిన ద్వారక గుజరాత్ సమీపాన చరిత్రకారులు గుర్తించారు. జరాసంధుడు పాలించిన మగధ బీహార్ నందున్న ఆనవాళ్ళు కనపడగా, భారత యుధ్ధంలో పాల్గొన్న మిగిలిన రాజుల రాజ్యాల పేర్లు అస్సాం నుండి సింధూ వరకు గుర్తింపబడ్డాయి. పాండవులు వనవాసం మరియూ రాజ్యవిస్తరణలో భాగంగా పశ్చిమాన ఆఫ్ఘనిస్తాను నుండి తూర్పున అస్సోం వరకు, ఉత్తరాన టిబెట్ట్ నుండి దక్షిణాన కన్యాకుమారి వరకు సంచరించినట్లు ప్రస్తావన ఉంది.

మహాభారతం పుక్కిట పురాణమా లేదా నిజమా అన్న తర్కం ఇక్కడ ఏ విధంగానూ ఉపయోగపడదు. ఎందుకంటే ఈ శిలాశాసనాల ఆధారంగా అఖండ భారత దేశం యొక్క ఉనికి సుస్పష్టం. చాలా మట్టుకు ప్రపంచదేశాలు నాగరికత సాధించక మునుపు, అఖండ భారతావని ఉండేదని ఇవి ఋజువు చేసాయి(రోమన్ చక్రవర్తులు యూరప్ ఖండాన్ని ఒక్కటిగా చేసే ప్రయత్నానికి చాలా ముందర). ఈ శాసనాల ద్వారానే అఖండ భారతావని తో పాటూ భిన్నసంస్కృతుల వాదనకు కూడా తెర దించవచ్చు. ఎన్నోఏళ్ళ క్రితమే భారతదేశం మొత్తం ఒక్క సంస్కృతితో ఒక్క తాటిపై నడచింది. తదుపరి కాలంలో మొఘల్ చక్రవర్తుల దండయాత్రల ఫలితంగానో, బ్రిటిష్ పరిపాలనల వల్లనో మన సంస్కృతిలో ఈ వైవిధ్యాలు ఆవిర్భవించాయి తప్ప ఇన్ని వైరుధ్యాలు హిందూ సంస్కృతిలో లేవు.

ఒక రకంగా చూస్తే ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇంత పెద్ద విస్తీర్ణంలో ఒకే రకమైన సంస్కృతి తన ఉనికిని చాటుకున్న ఆనవాళ్ళు లేవు. ఈ ఘనత ఒక్క హిందుత్వానిదే అని చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదేమో! దీని ఆధారంగానే భారతదేశం అత్యంత ప్రాచీన దేశమని కూడా భావించవచ్చు. ఈ సారూప్యత దేశ విస్తీర్ణతకే కాక దేశసంస్కృతికీ, హిందుత్వానికీ కూడా ఆపాదించవచ్చు. భిన్న సంస్కృతులుగా భావిస్తున్న శైవం, వైష్ణవం తాలూకు మూలాలు కూడా కాలక్రమంలో ఏర్పడ్డాయన్న సత్యాన్ని మహాభారతం తెలియ చెబుతుంది. మహభారతంలో హిందూ దేవుళ్ళైన శివుడు, విష్ణువు, ఆది పరాశక్తి వివరణలతో పాటుగా విఘ్నాధిపతి గణేశుడు, స్కంధుడు, సూర్యభగవానుడు ప్రస్తావన ఉంది. బ్రహ్మ సిధ్ధాంతం ఆధారంగా మిళితమైన ఈ ఆచారాలు వేదాంత సత్యాలను ఉపదేశించిన వేదాలకు, ఋషులకు, ఉపనిషత్తులకు అత్యంత గౌరవాన్ని కల్పించాయి. వేదాంతం పాటూ యోగ, సంఖ్యా పరమైన బోధనలు కూడా మహాభారతంలో ఉన్నాయి. అంతే కాక పాలకునికి కావలసిన లక్షణాలూ, మానవ జీవన విధానాన్ని, వర్గీకరణాన్ని, వైద్యాన్ని మరియు జ్యోతిష్య శాస్త్రాలను కూడా భారతం వ్యక్తీకరించింది. మహాభారతం ఒక మత గ్రంధం కాదు. పరిపూర్ణ నాగరికతకు ప్రతిబింబం.

ఇందులో మానవ జీవితానికి, సంఘ నిర్మాణానికి సంబంధించి ప్రతిఫలించని విషయం అంటూ లేదు. ప్రాచీన వేదాల సారాంశాన్ని అందరికీ అర్ధమైనట్లు చెప్ప బడిన చరిత్ర తప్ప ఒక మతానికో సంస్కృతికో చెందిన గ్రంధం కాదు. నిజానికి ప్రాచీన ఉపనిషత్తుల్లో కూడా బ్రాహ్మణ, క్షత్రియ మరియూ యోగుల వివరణ ఉంది. ఇదే ఉపనిషత్తుల్లో గాంధార రాజ్యం (ఇప్పటి ఆఫ్ఘనిస్తాను) నుండి వైదేహ (ఇప్పటి తూర్పు బీహార్ - నేపాల్ సరిహద్దులు) వరకు మరియు విదర్భ (మహారాష్ట్ర)ల ప్రస్తావన ఉంది. ఇలా విస్తీర్ణతా పరంగా, సంస్కృతి పరంగా అధిక భూభాగంలో ఆచరించబడిన హిందుత్వం బ్రిటిష్ పరిపాలనా ఫలితంగా ఏకత్వాన్ని సంపాదించిందని చదువుకోవటం(పాఠ్య పుస్తకాలలో) నిజంగా మన దురదృష్టం. బైబిలు ప్రకారం క్రైస్తవం పాలస్తీనా వంటి చిన్న దేశానికి, ఖురాను ప్రకారం ఇస్లాం అరబ్బు, మక్కా వంటి పరిమిత ప్రాంతాలలో ఉనికిని చాటుకుని బలవంతపు మత మార్పిడుల కారణంగా విస్తరించింది.

మిగిలిన మతాలవలే పరిమితమైన ప్రవక్తల గూర్చి కాక వేదాలు వివిధ (వైరుధ్య) వ్యక్తిత్వాలను కలిగిన అసంఖ్యాకమైన యోగులనూ, మహర్షులనూ ఉదహరించాయి. 90 దశకంలో మహాభారతం టెలివిజన్ లో ప్రసారమైనప్పుడు యావత్ భారతదేశం పులకించింది. దుకాణాలు మూసివేయబడ్డాయి. రైళ్ళ రాకపోకలు నిలిపివేయబడ్డ సందర్భాలున్నాయి. రోడ్లు దాదాపు నిర్మానుష్యమయ్యేవి. ప్రపంచంలో మరే దేశంలోనూ బైబిలుకు చెందిన, లేదా మరే ఇతర మతానికి చెందిన కార్యక్రమాలు ఇంత ఎత్తున ఆకర్షించిన దాఖలాలు లేవు. కారణం సుస్పష్టం. ఆ మహాభారతం యొక్క ఆత్మ ఇప్పటికీ ఈ దేశాన్ని, ఇక్కడి హిందువులనూ ఒక్కటిగా చేస్తుంది.

ఎవరైతే ప్రాచీన అఖండ భారతావనిని, సంస్కృతిని, హిందుత్వ ఆత్మను అంగీకరించరో - వారొక్కసారి మహాభారతాన్ని (మత గ్రంధంగా కాక చరిత్ర దృక్పధంతో) చదవాల్సిఉంది. నిజానికి 'మహాభారతం' అన్న పేరు ఒక్కటే చాలునేమో... వాళ్ళ ఆలోచన తప్పు అని చెప్పటానికి.

5 comments:

కొండముది సాయికిరణ్ కుమార్ said...

నిజానికి 'మహాభారతం' అన్న పేరు ఒక్కటే చాలునేమో... వాళ్ళ ఆలోచన తప్పు అని చెప్పటానికి.
===
It says all.

amma odi said...

మంచి టపా.

బృహఃస్పతి said...

ఆదిలక్ష్మి గారు మరియు సాయికిరణ్ గార్లకు ధన్యవాదాలు. రామాయణ చరిత్రను ఇప్పుడే ప్రచురించాను. తిలకించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

విజయ క్రాంతి said...

చాల ఆలస్యం గా చదివాను ఈ టపా .

మహాభారతం జరిగిందనటానికి రుజువులు వున్నై .

ఒక BBC డాకుమెంటరీ లో చోప్రా అనే వ్యక్తి అనుకుంట ..కురుక్షేత్ర సంగ్రామం జరిగిన విషయాలని లోతుగా అధ్యయనం చేసి రుజువులు చూపించారని చెప్పారు .

ఐన ఇంటర్వ్యూ కూడా వుంది ఆ కార్యక్రమంలో . ఇక్కడ BBC గురించి చెప్పాలి ...ఎన్ని అపద్దాలు ప్రచారం చేసినా అప్పుడప్పుడు నిజాలు కూడా చూపుతుంటారు ..;-)

బృహఃస్పతి said...

విజయక్రాంతి గారూ, ధన్యవాదాలు. హిందూ సంస్కృతిని, పురాణాలని అవహేళన చేసేవారికి ఋజువులు చూపేందుకే ఈ వ్యాసం రాసాను. మీ వ్యాఖ్యతో మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు.