రామాయణం - రావణుని చరిత్ర


రామాయణ కావ్యం తెలియని భారతీయులు (ఏ మతస్తులు గానీయండి) ఉండరని చెప్పటం అతిశయోక్తి కాదేమో. అయితే ఈ పురాణ గాధను నిజమని నమ్మేవారు మాత్రం బహుకొద్ది మంది మాత్రమే. బహుశా హిందుత్వాన్ని తృణీకరించటమే అభ్యుదయవాదమనుకునే మన దుస్థితి దీనికి కారణం కావచ్చు. ఈ రామాయణ కధాసారం ఎలా ఉన్నా, రామాయణ ఘట్టంలోని పలు పాత్రల ఉనికికి చారిత్రక ఆనవాళ్ళు ఉన్నాయి. రాముడు అయోధ్యకు చెందిన రఘువంశీకుడని, రావణుడు బ్రాహ్మడని పురాణాలు చెప్తున్నాయి. వీటికి గల చారిత్రక ఆధారాలను పరిశీలిద్దాం.

రామాయణాన్ని - ముఖ్యంగా చివరిదైన ఉత్తరకాండ ను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే, రావణుడు శ్రీలంకలో స్థిరపడ్డవాడే తప్ప ద్రవిడుడు కాదని అర్ధం అవుతుంది. ఈ ప్రకారం చూస్తే మధుర - ప్రస్తుత దక్షిణ డిల్లీ ల మధ్య విస్తరించిన యదువంశం నుండి రావణుడు వచ్చిన ఆనవాళ్ళు ఉత్తరకాండలో కనపడతాయి. నిజానికి సీతాపహరణానికి ముందు రావణుని ప్రస్తావన ఎన్నో ఉత్తరాది ప్రాంతాలలో ఉంది. రామాయణానికి ఎంతో కాలం పూర్వమే శ్రీలంకపై ఈ విధమైన ఉత్తరాది వలస జీవుల ఆధిపత్యానికి చారిత్రక ఆధారాలున్నాయి. మొట్టమొదటిసారిగా శ్రీలంకపై పట్టు సాధించిన గుజరాత్ ప్రాంతానికి చెందిన యదు వంశీకులు రామాయాణానికి ఎంతో ముందర కాలంవారు. గుజరాత్ సముద్ర తీరం నౌకాయానానికి అనుకూలంగా ఉండుటచే వీరు అరేబియా సముద్రతీర ప్రాంతాలైన దక్షిణాది భారతం మొదలుకుని శ్రీలంక వరకు రాజ్యాధికారాన్ని స్థాపించగలిగారు. వీరి వ్యాపార, సంఘ నిర్మాణ విస్తరణలో భాగంగా ఇది సాధ్యమయ్యింది. ఉత్తరకాండం రావణునికీ, గుజరాత్- మహారాష్ట్ర-రాజస్థాన్-మరియు మధురల మధ్య విస్తరించిన యదు వంశీకులకు గల సంబంధ బాంధవ్యాలను విశదీకరించింది.

మధురను పాలించిన సురశేనుల రాజు లవణునికి, రావణునికి గల బంధుత్వ ప్రస్తావన ఇందులో ఉంది(ఈ లవణుడే రాముని తమ్ముడైన శతృఘ్నుని చేతిలో పరాజయం పాలై రాజ్యాన్ని కోల్పోయాడు). రావణుడు యదు వంశీకులకు పట్టుకొమ్మైన నర్మదానదీ తీరాన శివలింగధారిని పూజిస్తుండగా మరో యదువంశపాలకుడైన కార్త్యవీర అర్జునునికి (ఈతడు తదనంతర కాలంలో పరశురాముని చేతిలో హతమయ్యాడు) పట్టుబడినట్లు చెప్పబడింది. రావణుడు మహారాష్ట్ర ప్రాంతంలోని గోదావరీ నదీ సమీప ప్రాంతాలలో సీతాదేవిని అపహరించినట్లు వర్ణించి ఉంది. ఈ ప్రాంతాలన్నీ యదువంశీకులకు పట్టున్న ప్రాంతాలగుటచే రావణునికి - యదు వంశీకులకు ఉన్న సంబంధాలను కొట్టి పారేయలేం.

దాదాపుగా ఇవే ప్రాంతాలలో(అరణ్యవాసంలో భాగంగా సీతారాములు కాలిడిన ప్రదేశం) రావణుని చెల్లెలు శూర్ఫణఖ నివసించినట్లుగా రామాయణం పేర్కొంది. రావణుడు మహర్షి పులస్త్యుని వంశానికి చెందిన బ్రాహ్మణునిగా ఎక్కువ శాతం నమ్ముతారు. నిజమేదైనా (రావణుడు బ్రాహ్మడే గానీయండి లేదా యదువంశీకుడే కానీయండి) చరిత్రలో ఇన్ని సుధీర్ఘ వివరణలున్న వ్యక్తుల ఆనవాళ్ళను పుక్కిట పురాణమనటం అవివేకమే అవుతుంది.

రావణుడు సామవేదాన్ని వల్లించేవాడు. శివుని అనుగ్రహానికై కైలాసంలో అడుగిడినాడు. హిమాలయా ప్రాంతానికి చెందిన కైలాసం మధురకు దగ్గరగా ఉన్న కారణం చేత కూడా రావణుడు యదువంశీకుడయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

సంస్కృత భాషలో ప్రావీణ్యాన్ని సంపాదించిన రావణుడు శివతాండవ స్తోత్రాన్ని స్వరీకరించాడు. శివతాండవ స్తోత్రం రామాయణం జరిగిన చాలా ఏళ్ళ తర్వాత ఉద్భవించిందని భావించేవాళ్ళు చెప్పింది నిజమని అనుకున్నా కూడా రావణునికి సంస్కృతంలో గల పాండిత్యాన్ని కొట్టిపారేయలేకుండా ఎన్నో వర్ణనలు రామాయణ కావ్యంలో కనిపిస్తాయి. రావణుని మాతృభాష ద్రవిడ భాష కాదని, జన్మ స్థలం శ్రీలంక కాదని, రాజ్య విస్తీరణలో భాగంగా కుబేరుని ఓడించి శ్రీలంకను కైవశం చేసుకున్నాడని ఈ చరిత్ర చెబుతుంది.

రామ రావణుల చరిత్రకు సుర-అసుర వైరాలకు చాలా సారూప్యతలున్నాయి.

వేద, పురాణ, ఉపనిషత్తుల మొదలుకుని, మహాభారతం వరకు దేవతల - రాక్షసుల నిరంతర శతృత్వం పై అనేక కధనాలున్నాయి. ఈ దేవ దానవుల చరిత్రకు గల ఆధారాలను పరిశీలిద్దాం.

సురులుగా పిలవబడే దేవతల గురువు బృహస్పతి కాగా , అసురులుగా లేదా దైత్యులగా పిలవబడే రాక్షసుల(దానవుల) గురువు భృగు వంశానికి చెందిన శుక్రుడు. ఓ విధంగా ఇరు వర్గాలూ సనాతన వేద ధర్మాలను ఆచరించినవారే. ముఖ్యంగా భృగు వంశీకులకు సురులకు మూలం ఒక్కటే. అయినప్పటికినీ శుక్రుడు వివిధ కారణాల వల్ల అసుర పక్షం చేరినాడు. మను సంహితం ప్రకారం సుర సంస్కృతి సరస్వతీ నదీ సమీపాల్లో ఆవిర్భవించింది(ఇది ఇప్పటి ఉత్తర భారత దేశం).

కాగా దైత్యుల (అసురుల) సంస్కృతి యొక్క ఆనవాళ్ళు భృగువంశీకులకు నిలయమైన దక్షిణాది ప్రాంతాలలో కనిపిస్తుంది. ఈ ప్రదేశాలు అరేబియా తీర ప్రాంతాల్లోగల భృగు రాజ్యంగా నిర్ధారింపబడ్డాయి. 'భృగుకక్ష్య' గా పిలవబడే భృగు రాజ్యం కాలక్రమేపీ 'బారుచ్చ్' గా రూపాంతరం చెంది, నేడు బరోడాగా ఆధునీకరంపబడింది. భృగువంశీకులు పూజించే వరుణుడు/సముద్రుడు వీరికి ఆద్యులు. తొలి నాళ్ళల్లోని మను వంశీకుడైన శౌర్యతమ మానవుడు గుజరాత్ చుట్టుప్రక్కల ప్రాంతాలను ఏలినవాడు. ఇతడే కుశస్థలి నగరాన్ని (ద్వారకగా రూపాంతరం చెందినది) నిర్మించినవాడు.

ఈ శౌర్యతముని గురువు భృగువంశీకుడైన చ్యవన భార్గవుడు. అయితే తదుపరి కాలంలో అసురులు శౌర్యతముని నుంచి మను రాజ్యాన్ని చేజిక్కించుకున్నట్లుగా మను సంహితంలో చెప్పబడింది.

దేవ దానవుల మధ్యన ఈ నిరంతర వైరం వల్ల వర్గాలు ఏర్పడ్డాయి. మను వంశస్థుడైన యయాతికి ఇద్దరు భార్యలు. ఒకరు శుక్రుని(భృగు వంశం) కుమార్తెయగు దేవయాని కాగా మరొకరు దైత్యరాజైన(అసుర వంశం) వృషపర్వుని కుమార్తె షర్మిష్ట. ఈ విధంగా మను వంశీకుడైన యయాతి దానవ కన్యనూ, ఆర్యకన్యనూ (భృగువంశం) పెండ్లాడి ఒక కొత్త వర్గానికి శ్రీకారం చుట్టినాడు. యయాతి ఆఖరి కుమారుడైన 'పురు' డు(షర్మిష్టకు పుట్టినవాడు) అసుర వంశ లక్షణాలను పుణికి పుచ్చుకుని మధ్య సరస్వతీ రాజ్యాలను స్థాపించాడు. దీని వల్ల దేవతల(ఆర్యుల)తో అసుర వైరం మరింత ముదిరింది.

యయాతి పెద్ద కుమారుడైన 'యదు' డు(షర్మిష్టకు పుట్టినవాడు) దైత్యుల పట్టుకొమ్మయైన అరేబియా ప్రాంతాలను పాలించాడు. ఇతని సైనిక తరహా పాలన ఇతనికి గల అసుర లక్షణాలను తెలియజేస్తుంది.

ఇక యయాతి రెండవ పుత్రుడు 'తూర్వేషుడు' (దేవయాని సంతానం) ద్రవిడ సంస్కృతికి ఆద్యునిగా ఈ మనుసంహిత చెబుతుంది.

ఓ విధంగా చూస్తే రామ రావణుల యుధ్ధం, తరతరాలుగా సాగుతున్న ఆర్యుల-యదువంశీకుల మధ్యన వైర పరంపరలో భాగంగా భావించవచ్చు.

ఇంతకు పూర్వమే ఇటువంటి వర్గ వైషమ్యాలకు సంబంధించిన సంఘటనలు వేద పురాణాల్లో కనిపిస్తాయి.

పరశురాముడు కార్త్యవీర అర్జునినిపై (యదు వంశీకుడు) సాధించిన విజయం,

కాశీని పాలించిన దేవదాసుడు వితిహవ్యునిపై (యదువంశీకుడు) విజయం,

అయోధ్యను పాలించిన సాగరుడు వైహితునిపై (యదు వంశీకుడు) విజయం ఈ కోవలోనివే.

ఈవిధంగా రాముడు రావణునిపై సాధించిన విజయాన్ని రావణునికి గల యదు సంబంధాలతో కలిపి చూస్తే యదు వైర పరంపరలో భాగంగా అనిపిస్తుంది.

యదువంశీకులు బలపరాక్రమ వంతులు, వేద విద్యా పారంగతులు కావటంచేత ఎన్నో ఏళ్ళు వీరి ఆధిపత్యం చెల్లింది. రావణుడు కూడా ఇట్టి సైనిక పాలనకు పాల్పడ్డ యదువంశీకుడయ్యే ఆస్కారం ఉంది. యాదవుడైన మరో నియంత కంసుడు తదుపరి కాలంలో మధురను పాలించాడు.

యదువంశంనందు ఇటువంటి కర్కశులే కాక ఎందరో మహానుభావులు కూడా జన్మించారు. కృష్ణుడు, రావణుని తమ్ముడైన విభీషణుడు వంటి వారు ఈ కోవలోనికి వస్తారు.

అదే విధంగా ఆర్యుల్లో అందరూ మహనీయులనే అనుకోనఖ్ఖరలేదు. ధుర్యోధనుడు, కౌరవులు ఇటువంటి ఆర్యుల జాబితాలోనికి వస్తారు.

దీనిని బట్టి ద్రవిడులంటే రాక్షసులని, ఆర్యులంటే దేవతలని అపోహను తొలగించవచ్చు. ద్రవిడుల ప్రాబల్యంగల కిష్కింధ(నేటి కర్ణాటక) హనుమంతునికి జన్మనిచ్చింది. రామరావణ యుధ్ధంలో హనుమంతుడు తనకు బలిచక్రవర్తి వంశీకులతో గల పూర్వ బంధాల సహాయంతో ద్రవిడ సైన్యాన్ని రామునికి అండగా తెచ్చాడు.

1980 దశకం వరకూ కూడా శ్రీలంకనందు ఆర్య సంస్కృతి క్రీస్తుపూర్వం 600సం,, తరువాతనే బయల్పడినదని భావించేవారు. అయితే 90లలో సఫలీకృతమైన హరప్పా అధ్యయనాలలో క్రీస్తు పూర్వం 6000 ఏళ్ళనాటికే ఈ వలసలు ఉండేవని నిర్ధారణ అయ్యింది.

శ్రీలంక దేశస్థులు బౌధ్ధ మతానికి స్వీకరించటానికి గల కారణాలు కూడా రావణుడు ఉత్తరాదికి చెందిన యదువంశీకుడయ్యే ఆధారాలను చూపిస్తుంది. యదువంశీకులు పాలించిన మధుర నేపాల్ సరిహద్దుల్లో ఉన్నందువల్లనే కాక ఆశ్చర్య కరంగా ప్రసిధ్ధ బౌధ్ధ సూత్రమైన లంకావతారం శ్రీలంకను పవిత్ర స్థలంగా పేర్కొంది. ఈ బౌధ్ధసూత్రాలలోనే రావణుని యక్ష రాజుగా కీర్తిస్తారు. (దీనికి సమాంతరంగా హిందుత్వం రావణునికి పూర్వం అదే లంకను పాలించిన కుబేరుడని యక్షరాజుగా ప్రస్తుతిస్తుంది.)

ఈ ప్రకారం దక్షిణాదివారు గర్వపడే విధంగా రావణుడు ద్రవిడుడు కాకపోవచ్చు. ప్రాదేశికంగా రావణుడు శ్రీలంకలో స్థిరపడినప్పటికినీ అతని ప్రస్తావన, ఆనవాళ్ళు ఉత్తరాదిన ఎన్నో సంఘటనలలో ఉదహరించబడింది.

ఇక రామభక్తుడు హనుమంతునిలో ద్రవిడ సంస్కృతి ప్రతిఫలించినప్పటికినీ ఆతని వంశబీజాలు బలి చక్రవర్తితోనూ, తమను తాము ఆర్యులుగా ప్రకటించుకున్న వేదపారంగతులైన అగస్త్య, విశ్వామిత్రులలోనూ ఉన్నాయి.

స్థూలంగా చెప్పాలంటే అందరూ ఊహించే విధంగా వీరు ఆర్యులు, వీరు ద్రవిడులు అన్న వివరణ అందరికీ స్పష్టంగా చరిత్రలో ఎక్కడా లభించలేదు. అయితే ఈ విధమైన లోతైన అధ్యయనం చేయక పైపైన గల కధను కట్టె -కొట్టె - తెచ్చె చందాన తెలుసుకుని రామాయణం అభూత కల్పనంటూ కొట్టిపారేసేవారు ఇప్పటికీ కోకొల్లలు. మరో రూపంలో ఇది ఇప్పటి రాజకీయ నాయకులకు కూడా ఒక ఆయుధమయ్యింది. (రామ సేతువు, బాబ్రీ మసీదు ల వివాదాల రూపేణా..)

ఈ ప్రకారం ఉత్తరాది నుంది దక్షిణకు వచ్చినవారిలో రాముడు మొదటివాడేమీ కాదు. యదువంశీకులు, దైత్యులు అంతకు ఎన్నో ఏళ్ళపూర్వమే శ్రీలంకలో స్థిరపడ్డారు. రాముడు కేవలం తన వ్యక్తిగత కారణాలవల్లనే కాక దక్షిణాదిని రావణుని కబంధహస్తాల నుండి విముక్తి చేసేందుకు అక్కడ సుస్థిరమైన, సౌఖ్యమైన పాలనను అందించేందుకు దండెత్తినట్లు ఈ విధమైన చారిత్రక ఆనవాళ్ళు లభిస్తాయి.

రాముడు తన విజయానంతరం, ఉత్తరాది ప్రాబల్యాన్ని దక్షిణాదిపై రుద్దకుండా విభీషణునికే పట్టం కట్టి వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ కారణం చేతనే రాముడు దైవ స్వరూపునిగా ప్రజలందరిచేత పూజింపబడ్డాడు.

ఈ విధమైన తార్కిక ఆలోచన, లోతైన అధ్యయనం - రామాయణం ఎందుకు నిజం కాకూడదు అన్న ప్రశ్నను, విజ్ఞతను బుధ్ధిమంతులలో తప్పక మొలకెత్తిస్తుంది.

16 comments:

Anonymous said...

జైన రామాయణంలో రావణుడు గొప్ప పాలకుడు అని వ్రాసి ఉంది. చదివారా?

Unknown said...

చరిత్రను విశదంగా తెలుసుకోవటానికి శాసనాలు ఎలా సరియైన ఆధారాలో అదేప్రకారంగా పూర్వీకులచే వ్రాయబడ్డ సాహితీ సంపద కూడా సరియైన ఆధారాలుగానే పరిగణించవచ్చుననేది నా అభిప్రాయం.వాల్మీకి,వ్యాసమహర్షులచే వ్రాయబడ్డ రామాయణ భారత భాగవతాలు కూడా చరిత్రాన్వేషకులకు ఏంతో విలువైన సమాచారాన్ని తమ గ్రంధాల ద్వారా అందిస్తున్నాయి.వీటినికూడా ప్రామాణికతా నిర్ధారణ చేసేటప్పుడు సాక్ష్యంగా తీసుకోవచ్చనుకుంటాను.ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Anonymous said...

http://palavelli.blogspot.com/2009/06/blog-post_7606.html

Sridhar said...

http://theuntoldhistory.blogspot.com/

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు. వాల్మీకి రామాయణంలో, అంతకు ముందు అనేక చోట్ల కూడా రావణుని ప్రతిభను వర్ణించారు. సినిమాలలో, సీరియల్‌లలో పూర్తి పక్షపాతంతో వ్యాపార ప్రయోజనాల కోసం ఆయనను విలన్ చేశారు. ఐతే ఆయనను బ్రహ్మజ్ఞానిగా ప్రస్తావించారు. అంతేగాక యుద్ధం ముగిసిన అరువాత బ్రహ్మహత్యాదోషానికి విరుగుడుగా రాముడు రామేశ్వరం మొదలు అనేక చోట్ల శివలింగాలను ప్రతిష్టించారు. కాబట్టి రావణుడు యదుకులానికి చెందినవాడు అనే వాదన మాట సబబు కాదేమో. పైగా ఆయన బ్రహ్మ మానస పుత్రుడైన పూలాస్త్య బహ్మ వంశమునకు చెందిన వాడు. అందుకే మొదట రావణబ్రహ్మగా ఉన్న పేరు రాజ్యపదవిని స్వీకరించినతరువాత రావణాసురడుగా మార్చుకున్నాడు.

బృహఃస్పతి said...

సుబ్రమణ్యం గారు, మీ commentకి ధన్యవాదములు. నేను కూడా రావణుడు పులస్త్య వంశీకుడన్న ప్రస్తావనను మొదట రాసాను. ఇక రావణుడు యదుకులానికి చెందినవాడన్నది నా నమ్మకమో, అభిప్రాయమో కాదు. చరిత్ర పరంగా ఉన్న సారూప్యతల దృష్ట్యా అలా రాసాను. అది అబధ్ధమూ కావచ్చును.

Satya Narayana Sarma IRTS said...

చాలా బాగుంది. ముఖ్యం గా ఆర్య ద్రావిడ మూలాలు భారత దెశంలొనెవె గాని ఆర్యులు బయట నుంచి వచ్చిన యూరొపియన్లూ, ద్రావిడులు దక్షినాదిలొగల రాక్షసులూ అనె వాదన తప్పు అని మీరు చూపిన కారణాలు బాగున్నాయి. నేటి పరిశొధనలు కూడా ఇదే చెబుతున్నాయి. విమర్శించబొయే ముందు లోకులు రామాయణాన్ని క్షుణ్ణం గా చదివితే బాగుంటుంది.

మనోహర్ చెనికల said...

బాగా చెప్పారు.
all the best

madhavarao.pabbaraju said...

శ్రీ బృహస్పతి గారికి, నమస్కారములు.

మీ చారిత్రాత్మక విశ్లేషణ బాగుంది. శ్రీ సుబ్రమణ్యంగారు, రావణుడు "పులాస్త్యబ్రహ్మ వంశానికి" చెందినవాడని పేర్కొన్నారు. శ్రీ వాల్మీకి రామాయణంలో ( మూలంలో original ) ఈ వంశ ప్రస్తావన లేదా? శ్రీ నరసింహంగారు చెప్పినట్లుగా, చారిత్రక అధారాలతొపాటు, రామాయణ మూల కావ్యాన్ని కూడా కలిపి పరిశీలిస్తే బాగుంటుందేమో మరి. అయితే, పెద్దలు చెప్పే ఆ "వాల్మీకి రామయణం మూల కావ్యం" అంటూ అసలు వున్నదా? పరిశీలించగలరు.
భవదీయుడు,
మాధవ రావు.

బృహఃస్పతి said...

సత్యన్నారాయణ శర్మ గారు,
సురులు మరియు భృగుల సంస్కృతి గుజరాత్ సమీపమునందు ప్రారంభమయ్యింది. వీరు అప్పటికే నౌకాయానం మొదలుకుని మరెంతో నాగరికత సాధించారు. తదుపరి కాలంలో వీరు సరస్వతీ నది సమీప రాజ్యాలను కైవసం చేసుకున్నప్పుడు, వీరు పశ్మిమ దిక్కున వచ్చినందువల్లన, మరియు అప్పటికే నౌకాయానాన్ని స్థాపించిన చరిత్ర ఉన్నందువలన (యూరోప్ ప్రాంతీయులు భారత దేశంలో కాలిడుగిడాలన్నా గుజరాత్ ప్రాంతం gateway లాంటిది) వీరు వేరే ఖండాల నుంచి వచ్చిన వారిగా ముద్రింపబడ్డారు.

మాధవగారూ, మీరన్నట్లు మూల రామాయణంలో వంశ ప్రస్తావన క్షుణ్ణంగా ఉండి ఉండవచ్చు. నరసింహ గారు ఈ తరహా విషయాలను ఇప్పటికే లోతుగా అధ్యయనం చేసి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాము.

బృహఃస్పతి said...

చైతన్య మరియూ మాధవగారికి,

ఈ క్రింది సందేహాలను నరసింహ గారికి పంపించాను.

"వాల్మీకీ రామాయణం ప్రకారం రావణుడు బ్రాహ్మడా లేక యాదవుడా? అసలు మూలరామాయణం అనబడు వాల్మీకీ రామాయణ ప్రతులు అందరికీ అందుబాటులో ఉన్నాయా?

రావణుడు యాదవుడు కావచ్చునని సందేహించటానికి గల కారణాలు:

1. సీతాపహరణానికి పూర్వం రావణుడు యాదవ పాలిత ప్రాంతాలలో నిర్భయంగా సంచరించిన ఎన్నో ఆనవాళ్ళు.
2. శూర్ఫణఖ రాముని చూసినది మహారాష్ట్ర ప్రాంతం కావటం
3. రావణునికీ, కంసునికి గల సారూప్యతలు (వ్యక్తిత్వ మరియూ రాజ్య పాలనలలో)
4. బౌధ్ధం శ్రీలంకలో విస్తరించటం వల్లన మరియూ బౌధ్ధులు రావణుని తమ వంశీకునిగా భావించటం వల్లన
5. రావణుని కైలాస యాత్ర"

నరసింహ గారు వారి బ్లాగుల ద్వారా భారతం, అన్నమాచార్య కీర్తనలు మొదలైనవి యధాతధంగా తాత్పర్యంతో పాటుగా అందిస్తున్న సంగతి మీకు తెలిసే ఉంటుంది.
http://sreemadaandhramahaabharatam.blogspot.com/
http://kasstuuritilakam.blogspot.com/
http://kastuuritilakam.blogspot.com/
http://sooktimuktaavali.blogspot.com/
http://mutyalasaraalu.blogspot.com/

Unknown said...

బృహస్పతి గారికి
నా బ్లాగుల గురించి మీ బ్లాగులో పరిచయం చేస్తున్నందులకు మీకు ముందుగా నా ధన్యవాదాలు. నాకు చిన్నప్పటినుంచి భారతం అంటే ఎక్కువ ఇష్టం. దానికి కారణం పౌరాణిక సినిమాలు, మా తాతగారి ప్రభావం కారణమనుకుంటాను. రామాయణాలు చాలా వున్నాయని విన్నాను.మొల్ల రామాయణం,విశ్వనాధ కల్పవృక్షం(పూర్తిగా కాదు.కొంత మాత్రమే)చదివాను. విశ్వనాధ వారి రామాయణం మన తెలుగు లోగిళ్ళలో జరిగిన కథ అని అనిపిస్తుంది, ఎందుకంటే వారు మన పలుకుబడులను అంత విరివిగా వాడారు.ఆ తెలుగు పలుకుబడులంచే ఉన్న ఇష్టంతోనే వాటి గురించి ప్రస్థావిద్దామనే ఉత్సాహం తోనే మొదలు పెట్టాను. గోపీనాథ రామాయణం, భాస్కర రామాయణం, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారి రామాయణం, ఇంకా నాకు తెలియనివి ఎన్నో రామాయణాలు ఉన్నవి. వీనిలో గోపీనాథ రామాయణం మూలమైన వాల్మీకి రామాయణాన్ని అనుసరించి వ్రాయబడినది అని ఆ ప్రచురణ పీఠికలో చదివాను. గోపీనాథ రామాయణాన్ని చాలా కాలం క్రితమే కొన్నా ఇంతవరకూ ప్రారంభించలేదు. రఘువంశంలో కూడా చాలా చారిత్రిక సమాచారం లభించే అవకాశం ఉంది. కాని నాకు సంస్కృతంలో ఆట్టే ప్రవేశం లేదు. వాల్మీకి రామాయణాన్నైతే నేనింతవరకూ చూసే అవకాశమే దొరకలేదు. ఇంతవరకూ ఈ గ్రంథాల్ని కేవలం కథకోసం మాత్రమే చదివేవాడిని. కాని చారిత్రక దృక్పథంతో వివరాలు సేకరించటానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. మీ బ్లాగు చూసినపుడు ఇకనుంచీ చారిత్రక విషయాలమీద కూడా దృష్టి పెడితే బాగుంటుందేమో నని ఉత్సాహంగా ఉంది. అందుచేత ప్రస్తుతానికి మీ ప్రశ్నలకు నా దగ్గఱ సమాధానాలు లేవు. తెలుసుకొనే ప్రయత్నం మీతో బాటుగా నాకూ చేయాలనే ఉంది. భవిఛ్యత్తులో నా దృష్టికి వచ్చిన విషయాలను మీ అందరితో పంచు కోవటానికి ప్రయత్నిస్తాను.

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

రాముని గురించి చదవాలంటే రామాయణం ఒక్కటేగానీ రావణుని గురించి ఇంకాఎన్నో గ్రంధాలు ఉన్నాయని విన్నాను. మీరు వాటినికూడా కొద్దిగా పరిశీలిస్తే మంచింది. ఇంతకాలం ఇటురాకపోవటానికి క్షమించగలరు.

బృహఃస్పతి said...

చైతన్య గారూ! మీరన్నది నిజమే కానీ నా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ఇంత వరకు చదివినవి, తెలుసుకున్నవి, పరిశోధించినవి మీతో పంచుకోవటమే తప్ప కొత్తగా శోధించే అవకాశాలు మృగ్యం. కనుక మీరే నన్ను క్షమించాలి. :)

VeJay said...

పురావస్తు శాస్రం మాట్లాడదు. కాని సత్యాన్ని బయట పెడుతుంది. సాహిత్యానికి అలంకరణలు చేసే స్వభావం ఉన్నది. అందులో గాధలూ, ఇతిహాసాలలో ఉపమానాలూ, అలంకారాలూ, గజి బిజిగా అల్లుకొని ఉంటాయి. కనుక ప్రాచీన చరిత్రల గురించి రాసేటప్పుడు సాహిత్యంలో సాక్ష్యాధారాలను అతి జాగ్రత్తగా స్వీకరించాలి. ఇతర ఆధారాలతో ముఖ్యంగా పురావస్తు శాస్రంతో సరితూగుతున్నదో లేదో గమనించి చేపట్టాలి.
సుమేరియా చరిత్రకారులు ఇలాంటి జాగ్రత్త వహించారు. అలాగే ప్రాచీన దేశాలైన బాబిలోనియా, అస్సీరియా, ఈజిప్ట్, ఫినీషియా, క్రీట్, మీడియా, ఫైరియా, లిడియా, కార్తేజ్, గ్రీస్, రోమ్, పర్ష్యా, చైనాకు సంబంధించిన చరిత్రకారులు తగు జాగ్రత్త వహించారు. కాని, ప్రాచీన భారతావనికి సంబంధించిన చరిత్రకారులు తగు జాగ్రత్త తీసుకోలేదు. భ్రమలంటే వారు భయపడ్డారా? రెండువేల సంవత్సరాల పాటు పుక్కిటి పురాణాల మధ్య మనం నివశించాం. అదే మనకు ఔషధంగా మారింది. మోతాదు ఎక్కువై భ్రాంతిలో పడ్డాం. ప్రస్తుతాన్ని పక్కకు నెట్టి, గతాన్ని భజన చేస్తున్నాం. అయోధ్య గొప్పతనాన్నీ హస్తినాపురం వెలుగుల్నీ చెప్పుకొంటున్నాం. ఇంద్రప్రస్తలో, మయసభను గురించి పొగుడుకుంటున్నాం.
గతాన్ని తవ్వితీసి ఆర్యులను గురించి తెలుసుకుంటే, వాస్తవాలెన్నో బయటపడతాయి. రాముడూ, కృష్ణుడూ పాలించిన స్వర్గయుగాల భ్రమలు చెదిరిపోతాయి. రామాయణ మహాభారతాలకు చెందిన స్థలాలను తవ్వినప్పుడు అలాంటి సత్యాలు బయటకొస్తున్నాయి. భారతదేశానికి దండయాత్రీకులుగా వచ్చిన ఆర్యుల నాగరికత గురించి పుక్కిటి గాధలు బట్ట బయలు అవుతున్నాయి. దేశంలో ఉన్న ప్రజలు నాగరికులుగా, దాడి చేసిన వారు ఆటవికులుగా చరిత్ర చూపుతున్నది. హరప్పా ఉన్నత నాగరికతను ఆర్యులు ధ్వంసం చేశారు.
ఆ తరువాత వెయ్యేళ్ళకు గాని మగధ సామ్రాజ్యం తలెత్తలేదు. హరప్పా, మోహంజోదారో వంటి నగరాలు, కాళీబంగాన్, రంగవూరు వంటి పట్టణాలు, లోతల్ వంటి రేవులు మళ్ళీ రాలేదు. ఆర్యులు మట్టి ఇళ్ళలో ఉంటూ, కుండల్లో వండుకుని, తాగటానికీ, తినటానికీ మట్టి పాత్రలు వాడారు. నగర జీవితానికీ, సౌకర్యాలకూ వారుదూరం. వారి సంస్కృతి పేదది. గ్రామాలలో నివశిస్తూ, ఆవుల్ని పెంచుకున్నారు. ఆవులే వారికి సంపద, ప్రతిష్ఠాకరమైన విలువిచ్చాయి. సోమరసం ఆరగించేవారు. ఆర్యుల సంస్కృతి అల్పస్థాయిలోనే వుండేది. మెసపొటోమియాలో అమురుల వలె ఆర్యులకు కూడా నగరం అంటే తెలియదని, స్టూవర్డ్ పిగాట్ రాశాడు. (Pre Historic India, by Piggort Stauart 1962, Page : 265) సర్ మార్టిమర్ వీలర్ గొప్ప పురావస్తు శాస్ర్తజ్ఞుడు. ఆర్య సంస్కృతి గుర్తించదగినంత గొప్ప సంఘటనగా విడదీసి చూపటానికి ఆధారాలేవీ కనిపించటం లేదని రాశాడు. (Mortimer Wheeler : Civilization of the Indus Vallery, London 1966, Page : 97).
రామ, కృష్ణ భక్తులు ఈ విదేశీ శాస్త్రజ్ఞుల రచనలను పరిశీలించి వారు తప్పు అని రుజువు చేయగలిగితే బాగుండును. రామాయణ, మహాభారతాలకు సంబంధించిన స్థలాలను తవ్వి అలా చేస్తే సంతోషించవచ్చు.

kovela santosh kumar said...

execellent analisys.. it will really help us to research.. thank you sir..