
సత్యాన్ని గ్రహించటానికి కుల, మత, జాతి, వర్ణ వంటి దేశ, సంస్కృతులను దాటి ఆలోచించాలి. స్వవ్యక్తిత్వాలకు అతీతమైనవి గ్రహించగలిగినప్పుడే స్థాన, కాల పరిస్థితులతో నిమిత్తం లేని సత్యం బోధపడుతుంది. అయితే అంతమాత్రాన ఆధ్యాత్మికతను గుర్తించటంలో సంస్కృతి ప్రాధాన్యత లేదని కాదు. మానవీయ కోణంలో చరిత్రను గమనిస్తే ఆధ్యాత్మిక అనుభవం పొందిన పురుషులు గానీ, స్త్రీలు గానీ అన్ని సంస్కృతుల నుంచీ సమానంగా రాలేదు. దీనివల్ల ఆధ్యాత్మికతను పొందటంలో అంతర్లీనంగా దాగున్న సంస్కృతి ప్రభావం కనపడుతుంది. మన దేశ సంస్కృతిలో ఆధ్యాత్మికతను నిలబెట్టటంలో వేదకాలం నుండీ నేటి వరకు ఒక వర్గం ప్రధాన పాత్ర పోషిస్తుంది. వేదకాలం నుండీ ఈ శకానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవాది జిడ్డు కృష్ణమూర్తి వరకూ కూడా వీరందరూ బ్రాహ్మణ కులానికే చెందటం ఏ మాత్రం యాదృచ్చికం కాదు (పాఠకులకి ఒక చిన్నవివరణ: నేను బ్రాహ్మణుణ్ణి కాదు).
యూరోపియన్, ఇస్లాం సంస్కృతలలో ఈ విధమైన ఆధ్యాత్మిక చింతన గల వ్యక్తులు చాలా తక్కువగా ఉండటానికి కారణం సంస్కృతియే. ఆయా సంస్కృతులు, మతాలూ ఇప్పటికినీ ప్రభువు బిడ్డయనో, చివరి ప్రవక్త యనో అవ్యక్తంగా కొందరికి స్థానాలను కట్టబెట్టటం ద్వారా మిగిలిన వారికి స్వతంత్ర్యంగా ఆధ్యాత్మికానుభవం పొందే అవకాశాలను నిర్వీర్యం చేసాయి. అదృష్టవశాత్తూ హిందుత్వానికి ఈ బెడద లేదు. మన భారతీయ సంస్కృతిలో సత్యం ఈ విధంగా కేవలం ఒక్క కోణంలోనే చూడబడలేదు. ఎంతో మంది ఆధ్యాత్మికవాదులు స్వేఛ్ఛగా, స్వతంత్ర్యంగా పూర్వుల ప్రభావం తమపై పడకుండా సత్యశోధన చేయగల ఆస్కారం కల్పించబడింది. మిగిలిన సంస్కృతులలో, మతాలలో గతంలో పుట్టిన ఓ మానవుని దైవ ప్రాతిపదికను ప్రాధమీకరించి సత్యశోధనను ఆ వ్యక్తి ద్వారా ప్రకటించగా, హిందుత్వం ఆత్మ స్పృహను ఆశ్రయించింది. పూర్వులు గొప్పవారే కావచ్చును. అంత మాత్రాన వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ తత్సమానులైన వ్యక్తులు పుట్టబోరనటం మనలను మనం తక్కువ చేసుకోవటమే. మానవుని సమర్ధతను ఈ విధంగా తక్కువ అంచనా వేయటం తగదు.
బౌధ్ధ సంస్కృతిని తరచి చూసినా హిందువులలో ఉన్నంతమంది ఆధ్యాత్మికవాదులు కనపడరు. కారణం బౌధ్ధంలో సైతం హిందుత్వంలో నున్నంత ఆత్మ స్పృహ లేక ఎక్కువగా practicalityని పొందినది. వీటిని బట్టి ఆధ్యాత్మికతను అందించటంలో సంస్కృతి పాత్రను కొట్టిపారేయలేం. నేడు హిందూ సంస్కృతి అంటే అధిక జనాభా, అపరిశుభ్రత, కుల వర్గ విచక్షణ వంటి సామాజిక సమస్యలు కనిపించవచ్చుగాక! అయితే ఇవి హిందుత్వ గొప్పతనాన్ని కప్పివేయకూడదు. అంతకు మించి ఈ సమస్యలు భావితారాలకు హిందుత్వ మహోన్నత విలువలను అందించటంలో ఆటంకాలు కాకూడదు (దురదృష్టవశాత్తూ అదే జరుగుతోంది).
గత వందేళ్ళ కాలంలో చూసినా - రామకృష్ణ, వివేకానందుడు, రామ తీర్థుడు, అరబిందో, రమణ మహర్షి, మాతా ఆనందమయి, స్వామీ శివానంద, నీమ్ కరోలీ బాబా, స్వామీ నిత్యానంద వంటి ఎందరో ప్రముఖ ఆధ్యాత్మిక వాదులను భారత దేశం అందించింది. వీరెవరూ మత సంస్థలద్వారానో, మరే విధంగానో తయారు చేయబడలేదు. వీరంతా స్వతంత్ర్యంగా ఆత్మానుభూతిని పొందినవారే. (జిడ్డు కృష్ణ మూర్తి అనిబీసెంటు సంరక్షణలో సంస్థ ద్వారా శిక్షణ పొందటం వలన ఇక్కడ పేర్కొనలేదు). పశ్చిమ, ఇస్లామిక దేశాలను, బౌధ్ధాన్ని చూస్తే కొద్దో గొప్పో ఉనికి చాటుకున్న ఆధ్యాత్మిక వాదులు మత సంస్థల ద్వారా వచ్చినవారే.
ఈ విదేశీ సంస్కృతులలో స్వఛ్ఛందంగా, వ్యక్తిగతంగా ఆధ్యాత్మికతను సంపాదించటం క్లిష్టతరం కావటం వల్ల అటువంటి వ్యక్తులు మృగ్యం. ఈ రకమైన ఆధ్యాత్మికవాదులను పళ్ళగా భావిస్తే సంస్కృతిని ఆ ఫలవృక్షాలనందించిన భూమాతగా గుర్తించవచ్చు.
అయితే పశ్చిమ దేశాలకు వెళ్ళిన హిందూ యోగా గురువులు తమతో అతి తక్కువ పరిమాణంలో హిందుత్వాన్ని తీసుకు వెళుతున్నారు. వీరు మన సంస్కృతిని విదేశీయుల వద్ద నిజాయితీగా ప్రదర్శించటానికి సంకోచించారు. విగ్రహారాధన వంటి హిందుత్వ ఆచారాలు ప్రశ్నింపబడతాయన్న అనుమానంతో యోగా, ధ్యానం వంటి వాటికి ప్రాధాన్యత కల్పించి విదేశీయులకు ఈ యోగా, ధ్యానం వంటి హిందుత్వ పధ్ధతులతో పాటుగా తమ తమ మతాలను ఆచరించుకునే వెసలుబాటు కల్పించారు.
విగ్రహారాధన, హిందూ అర్చన, పూజ పునస్కారాలు వంటివి చాలా వరకు అపార్ధం చేసుకోబడుతున్నాయి. యోగాని నిష్టతో ఆచరించే హిందువేతరులు, విదేశీయులు కనీసం హిందూ దేవాలయాల లోనికి అడుగు పెట్టి కూడా ఉండరు. ఒక వేళ వెళ్ళినా ఆసక్తి తో తక్కితే మూలాన్ని గ్రహించే అధ్యయనం చేయరు. హిందుత్వం అందించిన అనేక ఫలాలు ఆయుర్వేదం, జ్యోతిష్య శాస్త్రం వంటివి ఇప్పుడిప్పుడే వెలుగు సంతరించుకుంటున్నాయి. సంస్కృత కావ్యాలూ, హిందూ సంగీత సాహిత్యాలూ, నృత్య రీతులు, భంగిమలూ ఇలా అన్నింటి వెనుకనా నిగూఢంగా ఉన్న వేద ఉపనిషత్తుల ప్రభావాన్ని గుర్తించండి. మన సంస్కృతిలో ప్రతీ రంగంలో నున్న ఆధారతత్వాన్ని గమనించండి.
ఆదునిక హిందువు తన సంస్కృతి పట్ల, ఆలయాల పట్ల, ఆచారాల పట్ల, వేద పారాయణం, పండుగల నిర్వహణల పట్ల అవిశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. వేద సారాంసాన్ని ఆరాధించే ఆదునిక హిందువు సైతం ఈ తరహా సంస్కృతులను సన్యసించిన జిడ్డు కృష్ణ మూర్తి, రజనీష్ వంటి ఆధ్యాత్మిక వాదుల నుంచి స్ఫూర్తి పొందుతున్నారు తప్పితే సంస్కృతిని పరిరక్షిస్తున్న వారిని కాదు. ఈ ఆధునిక హిందువు పాశ్చాత్య సంస్కృతి సౌకర్యాలకు అలవాటుపడి హిందు సంస్కృతిలోని అంతఃసౌందర్యాన్ని విస్మరిస్తున్నారు. ఆధునిక హిందువులకు ఓ విజ్ఞప్తి: ఆధ్యాత్మికతనూ సంస్కృతినీ వేరు చేసి చూడవద్దు. ఆధ్యాత్మికత రాముడైతే సంస్కృతి సీత. రాముని లక్ష్య సాధనలో సీత రక్షింపబడాలి. అత్యున్నత వేదసారాంశాన్ని అవపోసాన పట్టటమొక్కటే చాలదు. సంస్కృతిని కూడా పరిరక్షించుకున్నప్పుడే పరిపూర్ణత సిధ్ధిస్తుంది.
మిగిలిన దేశాలలో, సంస్కృతులలో తాత్వికులూ, ఆధ్యాత్మికవాదులు లేకపోలేదు. అయితే సరియైన సంస్కృతి లేకనే హిందుత్వం అందించినటువంటి ఉన్నతమైన ఆధ్యాత్మికవాదులు అక్కడ వెలుగులోనికి రాలేకపోయారు. మిగిలిన ప్రపంచ సంస్కృతులలో ఆధ్యాత్మికత ఎడారిలో ఎండమావిలాంటింది. హిందువు ఆధ్యాత్మికతనూ, సంస్కృతినీ వేరు చేయటం మానాలి. నిశితంగా గమనించి చూడండి. మన సంస్కృతిలోని భక్తి తత్వం, విగ్రహారాధన వంటివి ఆధ్యాత్మికతతో ఏమాత్రం విభేదించటంలేదు. నిజానికి ఈ తరహా సంస్కృతియే ఆధ్యాత్మికతను సముపార్జించటంలో దోహదపడుతుంది. యోగాభ్యాసాలను కూడా ఈ విధమైన సంస్కృతి నుండి వేరు చేయవద్దు. అంత మాత్రాన యోగా శిక్షణలో భక్తి తత్వాన్ని చొప్పించమని చెప్పటం నా ఉద్దేశ్యం కాదు. భక్తి కూడా ఒక విధమైన యోగా అని తెలుసుకోండి. దీనిని తెలియజెప్పటం ద్వారా యోగా సిధ్ధాంతాలు మన సంస్కృతిని నిలబెట్టేందుకు సహాయపడగలవు.
ఆధ్యాత్మికపరంగా పరిణితి సాధించిన వారికి సంస్కృతి ఒక భ్రమ కావచ్చును. అయితే వారు ప్రపంచావసరాలను కూడా గుర్తెరిగి మసలుకోవాలి. ఆధ్యాత్మికత కంటే సంస్కృతి త్వరగా విస్తరిస్తుంది. ఆధ్యాత్మికత పురుషుడైతే సంస్కృతి ప్రకృతి. వ్యక్తి వ్యక్తికీ ఆధ్యాత్మికతలోని లక్ష్యం, చూసే ధృక్పధం మారవచ్చును. కానీ సంస్కృతి ఈ లక్ష్యాన్ని అందరూ ఒకే కోణంలో చూసేందుకు ఉపయోగపడుతుంది. సంస్కృతి అవసరం లేకుండా ఆధ్యాత్మికతను పొందటం కష్టతరమైన కార్యం. సంస్కృతి - కళాలూ, తత్వాలూ, శాస్త్రాలూ వంటి అనేక రూపాల్లో మానసిక వికాసానికి తోడ్పడి ఆధ్యాత్మికతకు దారి తీస్తుంది.
వ్యక్తిగత ఆధ్యాత్మికత నిట్టనిలువుగా ప్రయాణించే సరళరేఖ ఐతే, సంస్కృతి కొంత దూరం అడ్డంగా ప్రయాణించి తర్వాత నిలువుగా సాగుతుంది. ఈ రెంటి పరమార్ధం ఒక్కటే. స్థాన, కాలాలను బట్టి సంస్కృతులను కొంత మేరకు దిద్దుకోవటంలో తప్పులేదు. కానీ ఈ దిద్దుబాటు సంస్కృతిని కలుషితం చేసేది కాకూడదు. సంస్కృతి దాచుకునేది కాదు. క్రైస్తవం, ఇస్లాం మతాల తాకిడితో భారత దేశంలోనే హిందుత్వం ఆత్మ రక్షణలో పడింది. ఈ ఆపద నుండి బయటపడి మన సంస్కృతి గొప్పతనాన్ని చాటుకునే పరిస్థితి రావాలి. సహజంగానే హిందుత్వ ప్రకాశానికి, ప్రచారానికి ఈ ఇతర సంస్కృతులనుండి అవరోధాలేర్పడతాయి. ఈ పోటీలో ఆత్మ రక్షణ ఒక్కటే చాలదు. ధృఢ సంకల్పంతో మన సంస్కృతి విలువలను వినిపించగలగాలి. ఇది కేవలం దేశానికి సంబంధించిన విషయంగా భావించవద్దు. విలువలకు సంబంధించినదని గుర్తెరగండి.
మనలో కూడా చాలా మంది హిందూ సంస్కృతి అనే కంటే భారతీయ సంస్కృతి అని పిలవటానికి ఇష్టపడతారు. వీరి దృష్టిలో 'హిందూ' అన్నది మతానికి సంబంధించినది. భారతీయత అన్నది విభిన్న మతాలకు, సంస్కృతులకూ సంబంధించినది. అయితే మన దేశ మూలాలు హిందుత్వంతోనూ, సంస్కృతంతోనూ ముడిపడి ఉన్నవి. ఇతర మతాలయిన బౌధ్ధ, జైన, సిక్కులతో పాటూ, కొంత మేరకు క్రైస్తవం, ఇస్లాం కూడా మన దేశంలో విస్తరించాక ఈ సంస్కృతిని వంటబట్టించుకున్నవే.
మన సంగీతం 'హిందుస్తానీ' లోని వ్యక్తీకరణ, అంతరార్ధాలూ సామ వేదానికి సంబందించినవి. మన నృత్యం హిందూ దేవాలయాల భంగిమలకు సంబంధించినది. మన ఆయుర్వేదం, జ్యోతిష్య శాస్త్రాలు సైతం వేదాల నుండి వేళ్ళూనుకున్నవే. హిందూ కావ్యాలూ, కవిత్వాలూ, నాటకాలూ, హిందూ పురాణాల చుట్టూ పరిభ్రమిస్తాయి. యోగాభ్యాసాలతో నిండిన హఠయోగం సైతం మతపరమైన ఆచార వ్యవహారాల సాధనల నుండి పుట్టినదే. "అన్నీ వేదాల్లోనే ఉన్నాయషోయ్?" అన్నది ఒక అజ్ఞాని వెటకారమే కావచ్చును. కానీ అది మానవ లక్ష్యసాధనకు సంబంధించినంత వరకు విస్పష్ట సత్యం.
హిందుత్వంపై ఇతర సంస్కృతుల ప్రభావం లేదు. కానీ క్రైస్తవం పై అంతకు ముందరి గ్రీకు రోమన్ల ప్రభావం, ఇస్లాం పై క్రైస్తవ ప్రభావం గమనార్హం.
దురదృష్ట వశాత్తూ ఆధునిక హిందువు పశ్చిమ దేశ సంస్కృతి మోజులో పడి తన ఆలోచనా విధానాన్ని మార్చుకుంటున్నాడు. ఇది కేవలం మన భారత దేశానికే కాక ప్రపంచమంతటికీ నష్ట దాయకం. ప్రపంచంలో మందిని ప్రభావితం చేయగల మేధావులకు కొదువ లేదు. వీరి రాజకీయ పరమైన విశ్లేషణలు సగటు మానవుని భావోద్వేగాలను సొమ్ము చేసుకుని సత్యాన్ని దూరం చేస్తున్నాయి. నేటి తరంలో షేక్సిపియరు ఎందరికి తెలుసు? ఎందరికి కాళిదాసు, భక్తృహరులు తెలుసు? వీరు షేక్సిపయరు కంటే ఎందుకు హీనంగా చూడబడుతున్నారు? ఇంగ్లాండులో షేక్సిపియరు ఉత్సవాలు జాతర్ల మాదిరిగా జరుగుతాయి. మనమెందుకు కాళిదాసుని ఆ విధంగా నెత్తిన ఎత్తుకోలేకపోతున్నాం?
హిందువెందుకు పశ్చిమ దేశాల విద్యా వ్యవస్థని అనుసరించాల్సి వస్తోంది? ఎందుకు మార్క్స్, లెనిన్ వంటి వారి దృక్కోణం నుండి ప్రపంచాన్ని చూడవలసి వస్తోంది? ఎందుకు మనకున్న ఆది శంకరాచార్యుని మొదలు అరబిందో వరకు ఉన్న వారివంక దృష్టి సారించలేకపోతున్నాం? మన సంస్కృతి అన్ని దేశాలూ నేర్చుకుని లాభపడేందుకే కాని విషతుల్యం చేసేది కాదు కదా. మరి మన విజ్ఞానాన్ని అధ్యయనం చేసేందుకు ఎందుకు విదేశీయులు రాలేకపోతున్నారు? ఇందుకు హిందువే ముందడుగు వేయనపుడు విదేశీయులనాశించటం అత్యాశయే అవుతుంది. వీటన్నిటికీ సమాధానంగా నిబధ్ధతతో హిందుత్వాన్ని ఆచరించండి. ఒక దేశ సంస్కృతిగా కాక ప్రపంచ సంస్కృతిగా భావించండి. తెలియని వారికి హృదయం నుండి వివరించండి. వారికి ఒక గొప్ప బహుమతినిచ్చిన వారవుతారు. దీని కోసం కంప్యూటర్లనీ, విజ్ఞానాన్ని త్యజించనవసరం లేదు. నేర్చుకునే వయసులోనున్న మీ పిల్లలకు కనీసం వేసవి శెలవులలో హిందూ సాంస్కృతిక విద్యనందించంఢి.
నేటి ప్రపంచంలో నిజమైన సంస్కృతి దాదాపు అంతరించే స్థితికి దాపురించింది. ప్రపంచదేశాల మధ్య దూరం తగ్గి ఆ దూరాన్ని తగ్గించిన పాశ్చాత్య సంస్కృతి అంతటా విస్తరించి వేళ్ళూనుతోంది. నిజానికి ప్రపంచంలోని ఈ సంస్కృతి లేమి, శూన్యత హిందుత్వానికి ముందడుగు వేసేందుకొక గొప్ప అవకాశం. దీనిని వినియోగించండి.
అయితే అంతకు ముందు నిద్దరోతున్న హిందుత్వ ఆత్మ మేల్కొనాలి. లక్ష్య సాధనకు ఉద్యమించాలి. ఈ శతాబ్దం ఈ విధమైన మేల్కొలుపునకు కీలకమైనది.
Its like Now or Never...