శిలాపుష్పం



స్తాడో రాడో తెలియని
ఆ అపరిచితుని నిరీక్షణలో
తరుగుతున్న కాలంతో పాటూ
పెరుగుతున్న ఆత్రం
కళ్ళను కరిగిస్తూ, గుండెను కదిలించటమే కాదు
కన్నీళ్ళనూ వెదజల్లిస్తోంది.

రాలిపోయిన రోజుల్ని లెఖ్ఖపెట్టుకుంటూ
రేపటి దినాలపై ఆశ నిలుపుకుంటూ
ఆ అపరచితుని,
అస్పష్ట స్వప్నఙ్ఞాపకాలతో
జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ

వేచీ వేచీ వృక్షాన్నై
తనువు శిలైనా,
నిరీక్షించే నా హృదయ కుసుమం
సదా పరిమళిస్తూనే ఉంటుంది.

ఆ ఆగంతకుని రాక కోసం
ఈ శిలాపుష్పం
నిత్యం వాడిపోక, రాలిపోక
రాగాలాలపిస్తునే ఉంటుంది.

ఘోష

మూస కధలతో విసిగివేసారిన తెలుగు పాఠకుల కోసం. సాగర సంగమాన్ని వినూత్న రీతిలో ఆవిష్కరించే ప్రయత్నం. కాల్పనిక కధా సాహిత్యంలో ప్రయోగం. చదివి మీ అభిప్రాయం తెలియజేయండి...

అతను ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. నిశ్చలంగా ఉన్నాడు. సూర్యుడు వచ్చేటప్పుడు నిర్లిప్తంగా చూస్తున్నాడు. చంద్రుని వైపు నిరాశగా చూస్తున్నాడు. ఏ భావమూ పలికించని నిస్పృహ నిండిన వదనంతో తన తల్లిని తల పైకెత్తి చూస్తున్నాడు.

ఒకప్పుడు తనకు తోడెవరైనా వస్తారేమోనని ఉవ్వెత్తున ఎగసేవాడు. పగలు, రాత్రి, వెలుతురు, చీకటి అన్ని సమయాల్లోనూ, చూపు ఆనినంత దూరం, భూమి అంతమైన వరకు ఎవరైనా వస్తారేమోనని ఆశగా చూసేవాడు. నెమ్మదిగా ఎవ్వరూ రారని నిశ్చయించుకుని నిశ్చలమైపోయాడు. ఎప్పుడో చలించినా యాంత్రికంగా చలిస్తాడు. అతని పరిస్థితి చూసి తల్లి ఆకాశం కన్నీళ్ళు పెట్టుకుంది.

ఓ రోజు ఓ అందమైన సుందరి అతని వద్దకు వచ్చి ఆమడ దూరాన నిలుచుని పిలిచినది.

అతనా సమయానికి నిరాశ నిండిన కళ్ళతో, తన ముఖాన్ని మోకాళ్ళల్లో దాచుకుని ఉన్నాడు.

“ఓయీ...!” పిలిచినదామె.

“....!”

“మిత్రమా…!” మళ్ళీ పిలిచినది.

పలుకనే లేదు.

“ప్రియా...!”

కళ్ళు తెరిచాడతడు. ఎదురుగా మనోహరమైన రూపంతో సోయగాలు ఒలికిస్తు, స్వేచ్ఛగా ఎగురుతూ – అనంతం వరకు పరచి ఉన్న శిరోజాలను తన మృదువైన అర చేతితో ప్రక్కకు తొలగిస్తు ‘దేవకన్యయా?’ అనిపించేంతటి వర్ఛస్సుతో ఉన్నదామె.

ఎన్నాళ్ళ క్రితమో అడుగంటిన ఆశ తిరిగి చిగురించినదతనిలో.

“సుందరీ – నీవెవరవు? ఎచటనుంచి వచ్చినావు?” ప్రశ్నించాడతడు.

“మంచు కొండల మలుపుల్లో మానస సరోవరాన పుట్టి, మనసిచ్చే వానికోసం వెదుకుతూ వచ్చినాను.” బదులిచ్చినదామె.

“ఒంటరిగా వచ్చినావా? భయం లేదూ..?” తిరిగి ప్రశ్నించాడు.

“భయమేల? నా బంధువులందరూ దారి పొడుగునా వెన్నంటినారు కదా.” తాను దాటిన పర్వతాలను ఙప్తికి తెచ్చుకున్నదామె.

“ఇంతకీ నీ పేరు చెప్పనేలేదు?” గుర్తు చేసాడతడు.

“యమున”

“.....”

“నీ పేరు?”

“....తెలియదు.... ఇంతవరకు ఎవ్వరూ పిలువనే లేదు.” అతని కళ్ళు చెమ్మగిల్లాయి.

ఆమె జాలిపడింది.

“నేను సాగర్ అని పిలుస్తాను. సరేనా?”

అతడు ఆనందించాడు. మునుపటి ఉత్సాహం, చైతన్యం అతనిలో ప్రవేశించాయి. ఊవ్వెత్తున ఎగసాడు. తన ఆనందాన్ని తల్లి అంబరానికి చెప్పాడు. సూర్యుడు వచ్చినంతనే అతని చెవిలో చెప్పాడు. చంద్రునితోనూ, చీకటితోనూ, చుక్కలతోనూ చెప్పాడు. మబ్బులకు చెప్పాడు.

ఆమె నవ్వుకుంది.

వారిద్దరూ కబుర్లాడుకున్నారు. చెలిమి చేసారు. పరస్పరం ప్రేమించుకున్నారు. కొన్ని రోజులు గడిచాయి.

ఒకనాడతనికి ఆమెను స్పృశించాలన్న కోరిక కలిగింది.

“సఖీ...” పిలిచాడు.

“ఊ…!” కలలోంచి పలికినట్లుగా తన్మయంగా బదులిచ్చినదామె.

“మన ప్రణయానికి గుర్తుగా ఈ ఉంగరం నీ వేలికి తొడగనీయవూ....?” అర్థించాడతడు.

మౌనంగా చేయినందించినదామె.

తనలో దాచుకున్న ఓ అద్భుతమైన ముత్యపుటుంగరాన్ని ఆమె వేలికి తొడిగి ఆమె అరచేతిని చుంబించాడు.

ఆమె సిగ్గు పడింది. అరచేతిని వెనక్కి తీసుకొవటానికి యత్నించింది.

అతడు విడువలేదు. విడిస్తే తనని విడిచి పోతుందని అతని భయం. అతని చర్య ఆమెకు చీకాకు తెప్పించింది. అతడు తన మిగిలిన చేతులను చాచి కౌగిలిలోనికి రమ్మని ఎంతగానో ఆహ్వానించాడు. ఆమె నిరాకరించినది.

ఆతడు నిరాశ చెందాడు. ఆమె ఈసడించుకుంది. అయినా అతడామె చేతిని వదలలేదు. నెమ్మదిగా అతనిలో కాఠిన్యం ప్రవేశించింది. కర్కశంగా ఆమె చేతిపై పట్టు బిగించాడు. యమున విలవిలలాడింది. కన్నీళ్ళు పెట్టుకున్నది. కాని అతని పరిష్వంగంలోనికి రాలేదు.

అంబరం వారివైపు గంభీరంగా చూసింది. గుడ్లురిమింది. అమెనతని కౌగిలిలోనికి పొమ్మన్నది.

యమున మళ్ళీ నిరాకరించింది.

అంబరానికి కోపం వచ్చింది. తుఫాను సృష్టించింది. విధిలేక యమున అతని కౌగిలిలోనికి పోయినది. అతని కోరిక నెరవేరింది. అంబరం శాంతించింది. యమున వెనక్కి మరలింది. అయినా అతడామె చేతిని విడువలేదు.

ఆమె మౌనంగా విలపించింది.

కొన్నాళ్ళు గడచాయి.

ఒకనాడతడు తన వైపు మరో మగువ రావటం గమనించాడు. ఆమె మరింత అందంగా యమునకంటే సుందరంగా ఉన్నది. మరింత పరిణితి చెందిన మనస్కురాలివలే విశాలంగా ఉన్నది. అతడు యమునను ఆమెకు కనపడనీయకుండా వేరే చేతిలోనికి మార్చాడు.

“సుందరీ నీవెవరవు?” ప్రశ్నించాడతడు.

“గంగను” బడులిచ్చినదామె.

“నీ పేరేమిటి?” తిరిగి ప్రశ్నించినది.

“....ఏమో.....? ఇప్పటి వరకు ఎవ్వరూ పిలువనేలేదు.” కళ్ళు చెమర్చాడతడు.

ఆమె జాలి పడింది.

“నేను సాగర్ అని పిలుస్తాను. సరేనా?” అన్నదామె.

అతను ఉలిక్కిపడ్డాడు. అంతలోనే తమాయించుకుని -
“నీవెచటనుంచి వచ్చినావు? నీ తల్లితండ్రులను విడిచి వచ్చుటకు కారణమేమి?” ప్రశ్నించాడతడు.

“కాశ్మీర రాజ్యం నుండి వచ్చినాను. హిమగిరులయందు పుట్టినాను. వారు కన్న బిడ్డనే! వయసొచ్చాక మనసిచ్చే వానికోసం అన్వేషిస్తూ వచ్చినాను.” బదులిచ్చినదామె.

అతడానందించాడు. ఆమెకు తీయని కబుర్లు చెప్పాడు. తనలో ఇముడ్చుకున్న వింతలను వెలుపలకు తీసి చూపాడు. నెమ్మది గా ఆమెను వశపర్చుకున్నాడు. ఉంగరం తొడిగే నెపంతో ఆమె చేయినందుకున్నాడు. ఆమె సిగ్గు పడింది. బుగ్గలు ఎరుపెక్కాయి. అతడు ఆమె చేతిని చుంబించాడు. ఆమె వెనక్కి లాక్కోబోయింది. కాని అతడామె చేతిని ఎంతకి విడువకపోవటంతో ఆ సిగ్గు కాస్తా కోపంగానూ, అసహ్యంగానూ, ద్వేషంగానూ మారింది.

అతని కౌగిలిలోనికి రావటానికి నిరాకరించింది.

ఆకాశం ఉరిమింది. ప్రళయాన్ని తెచ్చింది.

అయినా ఆమె చలించలేదు.

గగనం ఉప్పెనను తెచ్చింది. అతడామెను కబళించాడు. అసహాయ స్థితిలో మూగగా రోదించినదామె.

నింగి శాంతించింది. అతడు వెనక్కి మరలాడు. ఆమె చేతిని మాత్రం వదలలేదు. అప్పటి నుండి అతడు ఎందరో స్త్రీలను లోబరుచుకోసాగాడు. ముందుగా బలయిన వారు ఏమీ చేయలేక దీనంగా చూస్తున్నారు. అతడెవ్వరిని విడువటం లేదు. వారెవ్వరూ అతని కౌగిలిలోనికి పోవటంలేదు. అతడి కోరిక గమనించినప్పుడు అతడి తల్లి వారిని భయపెట్టి వారిని ఏకం చేస్తోంది. వారందరికీ సంతానం కలిగింది. ఆ సంతతికి జరిగిన దారుణం తెలుసు. వారు తమ తల్లిని ఎప్పుడూ విడువరు. అతడి పాలపడ్డ అంగనల జీవితాల్లో యాంత్రికత చోటు చేసుకుంది. మునుపటి ప్రేమలు లేవు. మునుపటి ఆత్మీయతలు లేవు. మునుపటి అభిమానాలు లేవు. ఆశలు లేవు. ఆత్రుత లేదు. అతడు చేతులు చాచి వారిని తన కౌగిలిలోనికి రమ్మని కవ్విస్తున్నాడు. అది కూడా యాంత్రికంగా ఉంటుంది. హేళన చేస్తున్నట్లు ఉంటుంది. బానిసను పిలుస్తున్నట్లు ఉంటుంది. ఆతని మాయలో పడ్డ పడతులందరికీ ఈ విషయం తెలుసు. అయినా అతని చేతిలోనుంచి తమ చేతిని విడిపించుకోలేని దీనస్థితిలో అనుక్షణం కుమిలిపోతూ, ఆ యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డారు.

వారి కంఠథ్వనుల, ఆర్తనాదాల ఘోష ఇప్పటికీ అతని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది.

విప్లవ తరంగం - రామ్ స్వరూప్

మతాలని విమర్శించే ప్రక్రియలో నాస్తికుల పుస్తకాలను పక్కన పెడితే, కొన్ని మత ప్రభోధాలు కూడా ఇతర మతాలను ఎండగట్టాయి. అయితే ఇతర మతాలను విమర్శించే హిందూ ఆధ్యాత్మిక పుస్తలాలు దాదాపు లేవనే చెప్పాలి. ఇదిగో... సరిగ్గా ఈ లోటుని భర్తీ చేసినవారే రామ్ స్వరూప్. ఈయన రాసిన "A Hindu View of Christianity and Islam" ఆ రెండు మతాలనూ హిందూ ఆధ్యాత్మిక పరంగా విశ్లేషించి విమర్శించింది. ఈయన తూర్పు ఆసియా మతాలను (హిందూ, బౌధ్ధం, జైన, సిక్కు వంటివి) అంతర్గిక అన్వేషణగా(internal quest) పశ్చిమ దేశమతాలను(ఇస్లాం తో కలిపి) సాంఘిక, రాజకీయ కారణాల వల్ల ఉద్భవించినవిగా వర్గీకరించాడు.

ఒక హిందూ ఆధ్యాత్మికవాది ఇతర మతాలపై వ్యక్తం చేసిన సందేహాలు, విమర్శలూ మనకు దాదాపు లేవు. ఇందుకు కారణాలు అనేకం. అలానే నిజమైన హిందుత్వాన్ని పరిచయం చేసే పుస్తకాలు కూడా ప్రపంచ మార్కెట్ లో మృగ్యం. దీనికీ అనేక కారణాలున్నాయి. ముఖ్యమైనది హిందుత్వం మీద పరిశోధనా పుస్తకాలు ఎక్కువగా వెలువరించినది హిందువులు కాని విదేశీయులూ(ఎక్కువగా క్రైస్తవులు)మరియూ విద్యా వ్యవస్థలో భాగంగా మార్కిస్టు దృక్పధానికి అలవాటైన భారతీయ విద్యావంతులూనూ.

వీరు హిందుత్వాన్ని విమర్శిస్తూ రాసిన పుస్తకాలే హిందుత్వాన్ని తెలుసుకోవటం కోసం చదవాల్సిన పుస్తకాలుగా చలామణీ అయ్యాయి. ఎంత విషాదమో చూసారా? ఇక మరో కారణం హిందుత్వ వ్యాప్తిలో పుట్టుకొచ్చిన గురువులూ, స్వామీజీలూ ప్రపంచానికి సనాతన ధర్మానికి బదులు తమ గురువుల సందేశాలనో, యోగాసనాలనో, భక్తి తత్వాలనో ఉపదేశించారు. కాస్తో కూస్తో ప్రచురించబడిన నిజమైన హిందుత్వానికి నిలువుటద్దంలాంటి పుస్తకాలు ప్రచురణ-క్వాలిటీ లేమి తోనో, పబ్లిసిటీ లోపంతోనో ఎవరో అనామకులు రాసిన పుస్తకాలుగా భావింపబడి విస్మరింపబడ్డాయి.

ఇక మన దేశంలో ఉన్న క్రైస్తవ, ముస్లిం విశ్వాసాల దృష్ట్యా ఆయా మతాలను విమర్శించే పుస్తకాలు దాదాపు కనిపించనివ్వవు మన ప్రభుత్వాలు. మతపరంగా హిందువులపై జరిగిన అన్యాయాలు కూడా (మతమార్పిడిలూ, హింస) రాజకీయ ప్రయోజనార్ధం సాంఘిక సమస్యలుగానే చూపించబడ్డాయి. రామ్ స్వరూప్ ఈ విధమైన రాజకీయ కారణాల వల్ల అణచివేయబడ్డ సత్యాన్ని వెలికి తీసి, ఇతర మతాలలోని మంచినీ, చెడునూ నిర్భయంగా విశ్లేషించాడు.

భారతీయ విద్యావంతుల్లో అధికశాతం మంది మరియూ హిందుత్వం పై పరిశోధనలు చేసిన విదేశీయులూ అందరూ హిందుత్వమంటే విగ్రహారాధన, కుల విచక్షణ, సతీసహగమనాలూ, బాల్య వివాహాలూ, వరకట్న చావులూ అన్న చందాన పరిచయం చేసారు. నా ఇదివరకూ వ్యాసాల్లో చెప్పినట్లు 2, 3 శతాబ్దాలకు పూర్వం భారతదేశం అన్న స్పృహే ఉండేది కాదని, అనేక సంస్థానాలుగా, విభిన్న సంస్కృతులతో ఏ కీలుకాకీలువలే వుండేదని భారతీయ విద్యా వ్యవస్థ సైతం ప్రకటించిన నేపధ్యంలో ప్రపంచానికి ఆ విధమైన అభిప్రాయం కలగటంలో తప్పులేదేమో!

ఇతర మతాలను గూర్చి మాట్లాడాల్సి వచ్చినప్పుడు సగటు హిందువు సాధారణంగా అన్ని మతాలూ ఒక్కటేనని, అన్నింటా మంచిని చూడవచ్చని, అన్ని మతాలనూ గౌరవించాలని వ్యక్తీకరిస్తాడు. ఇది హిందువు మిగిలన వారి అభి'మతాలకు' ఇచ్చే గౌరవంగా మనం భావించవచ్చును గాక! కానీ హిందువేతరులు దీనిని హిందువుకు తమ స్వంత మతంపై నున్న అపనమ్మకంగా భావిస్తారు. నిజం...! దీని వల్లనే ఇతర మతస్థులు హిందుత్వాన్ని చులకన చేసే అవకాశం కల్పించబడుతున్నది.

ఇతరమతాలను ఈ విధంగా గౌరవించే హిందువు నిజానికి ఆయా మతాలను సరిగ్గా అధ్యయనం చేసి ఉండడు. (ఎవరికైనా ఈ విషయంలో రామకృష్ణ పరమహంస పై అపోహలుంటే తరువాతి పంక్తులలో వివరించాను). ఇతరమతాలను గౌరవించుకుంటూ పోయే హిందువు ఆయా మతాలు ఏం ప్రభోదిస్తున్నాయో(చాలా వరకు ఆ ప్రభోదాలు హైందవ ధర్మాలకు విరుధ్ధంగా ఉంటాయి) తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో ఇతర మతాలను గౌరవించటం, సహించటం, అలవరచుకోవటం హిందువుకు అలవాటయినాయి.

"అన్ని మతాలూ సమానం కావు. అన్ని మతాలూ ఒకే విధమైన మంచిని ప్రభోదించలేదు" ఇదీ రామ్ స్వరూప్ వెలిబుచ్చిన అభిప్రాయం. అన్ని రకాలయిన నీళ్ళూ ద్రవ రూపంలోనే ఉంటాయి. అయితే అన్నీ తాగేందుకు పనికిరావు. చూసేందుకు ఒకేలా కనిపించినా, త్రాగే నీటిని జాగ్రత్త వహించి గుర్తించాలి. ఇప్పుడు రామకృష్ణ పరమహంస వద్దకు వద్దాం. ఈయన వివేకానందుని గురువుగా మనందరికీ తెలుసు. వీరు 'అన్ని నదులూ సముద్రంలో కలసిన విదంగా అన్ని మతాలూ చేర్చేది ఆ భగవంతుని వద్దకే' అని నినదించి మూడు దినాలు అత్యంత నిష్టతో సాంప్రదాయ ఇస్లాంని ఆచరించారు. ఇదే విధంగా క్రైస్తవాన్ని అనుభవించి హృదయంలో క్రీస్తుని దర్శించారు. ఇక హిందుత్వాన్ని ముఫ్ఫై ఏండ్ల పైబడి బహు నిష్టతో ఆచరించారు. వీరు సమాజాన్ని మతావసరాలతో ముడి వేసి అన్ని మతాలూ చేర్చేది భగవంతుని వద్దకే అన్నారు తప్పితే నిజమైన ఆధ్యాత్మికతను గుర్తించటంలో అన్ని మతాలూ సమానమేనని ఏనాడూ చెప్పలేదు. పరమహంస ఉద్దేశ్యం ప్రకారం మనుషులందరిలోనూ మంచి ఉన్నట్లు, అన్ని మతాలలోనూ మంచిని కనుగొనవచ్చునని. అంతే!

మిగిలిన మతాలు హిందుత్వం గుర్తించిన అత్యున్నత విషయాలను విస్మరించాయి, విభేదించాయి. హిందుత్వంలోని కర్మ, పునర్జన సిధ్ధాంతాలూ మిగిలిన మతాలు ఎరుగనివి. మన జన్మ సిధ్ధాంతానికి విరుధ్ధంగా క్రైస్తవం, ఇస్లాం - స్వర్గం, నరకాలను నిర్వచించాయి. హిందుత్వం అత్యున్నత లక్ష్యాలుగా ఆత్మ స్పృహని, భగవంతునితో ఐక్యతనూ నిర్వచిస్తే, మిగిలిన మతాలు మానవుడిని భగవంతుని సేవకునిగానే నిర్దేశించాయి. హిందుత్వం మహోన్నత లక్ష్యమైన ఆధ్యాత్మికతకు మార్గంగా క్రమశిక్షణతో కలిగిన ధ్యానం, యోగాలను నిర్వచిస్తే, మిగిలిన మతాలు ప్రార్ధనలను, సమాజ సేవను, ఇంకొంచెం ముందుకు పోయి మతమార్పిడులనూ ప్రోత్సహించాయి(జాగ్రత్తగా చూస్తే ఇవన్నీ దేవునికి ఇచ్చే లంచాల వలే లేవూ?).

హిందూ ఆధ్యాత్మికత వ్యక్తిగతమయ్యింది తప్పితే సంఘ ప్రయోజనలాతోనో, సేవలతోనో, సామూహిక ప్రార్ధనలతోనో ముడి పెట్టబడలేదు. చరిత్ర చూస్తే ఇతరమతాలలో ఇలా వ్యక్తిగత ఆధ్యాత్మికతకు ప్రాధాన్యతనిచ్చినవారు మతం నుండి వెలివేయబడ్డారు. లేదా అతి తక్కువ శాతంలో మిగిలి విస్మరింపబడ్డారు.

మన ఆది వేదమైన ఋగ్వేదం ప్రవచించిన మొట్టమొదటి ప్రవచన సారాంశం "సత్యం ఒక్కటే.. అది వివిధ రూపాలను సంతరించుకుంటుంది" అని. ఇది "అల్లా తప్ప వేరే దేవుడు లేడ"నియో, "మహ్మద్ ప్రవక్త చిట్టచివరి ప్రవక్త" అనియో "కేవలం క్రీస్తు మాత్రమే భగవంతుని కుమారుడు" వంటి ప్రభోదాలు చెప్పలేదు.

పైన చెప్పిన ఇతర మత సిధ్ధాంతాలు ఆయా మతస్థుల చుట్టూ ఒక గిరి గీస్తే, హిందుత్వం "సత్యం ఒక్కటే.." నంటూ మానవుడిని స్వేఛ్ఛా జీవిని చేసింది. అయితే "సత్యం ఒక్కటే" నన్న నిజమైన సత్యం మనచే అపార్ధం చేసుకోబడి అన్ని మతాలూ ఒక్కటే నన్న భ్రమలోనికి నెట్టాయి. హిందువు అన్ని మతాలలోనూ మంచి ఉన్నదని ఒప్పుకొనటం ద్వారా, మిగిలిన మతాలకు తెలియని - హిందుత్వంలో కనుగొనబడిన సత్యాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తి ని ప్రపంచానికి సన్నగిల్లేలా చేసాడు. దీని వల్లనే హిందుత్వంలోనున్న వర్గాల ప్రాముఖ్యత - అవసరాలూ, విగ్రహారాధన ముఖ్యోద్దేశాలూ, కుల వర్గీకరణకు మూల కారణాలు, సంస్కృతి, భూమి, వృక్ష, జంతుజాల, ప్రాణికోటి పరిరక్షణ సిధ్ధాంతాలూ ప్రపంచానికి అర్ధం కాకుండా పోయాయి.

వీటన్నిటినీ రామ్ స్వరూప్ సమర్ధవంతంగా ఎత్తి చూపాడు. ఈయన యోగ, ఆధ్యాత్మికతలతో నిండిన హిందూ ధార్మిక ఆచారాలకూ, మిగిలిన మత విశ్వాసాలకూ గల భేదాలను తన "A Hindu View of Christianity and Islam" పుస్తకంలో విడమరచి చెప్పాడు. ఇతని రచనలు స్పష్టంగా సూటిగా ఉంటాయి తప్పితే సమాజ శ్రేయస్సునో లేక మరేదయినా ప్రయోజనాలనో ఆశించి నిజాలను దాచే విధంగా ఉండవు. రామ్ స్వరూప్ క్రైస్తవ, ఇస్లాం మాధ్యమాలనుండి (ఖురాను, బైబిలు) యధాతధంగా తీసుకున్న విషయాలను తార్కికంగా విశ్లేషించి లోటుపాట్లను ఎత్తి చూపాడు. ఈయన శైలి ఇతర మతాలపై హిందువు స్పందనలా ఉండదు. ఈ ప్రపంచానికి సంబంధం లేని ఒక మనిషి భవిష్యత్తు అవసరాల నిమిత్తం అన్ని మతాలపై పరిశోధన చేసి మానవాళి శ్రేయస్సుకై హిందుత్వాన్ని సిఫార్సు చేసినట్లు ఉంటుంది.

అయితే దురదృష్ట వశాత్తూ మనదేశంలో మైనారిటీల విశ్వాసాలను దృష్టిలో పెట్టుకుని ఈయన పుస్తకం నిషేదింపబడింది. (ఈ పుస్తక బహిష్కరణకు కారణమైన వర్గమే గతంలో సల్మాన్ రష్దీ "satanic verses" నిషేదానికి కారణమయ్యింది. మరో విషయం ఏమిటంటే "satanic verses " పుస్తకాన్ని నిషేదించిన మొట్ట మొదటి దేశం భారత దేశం)

ఈ పరిస్థితులను చూస్తే మన దేశంలో హిందుత్వాన్ని విమర్శించేందుకు, దూషించేందుకు ఏ విధమైన అవరోధాలూ, ఆటంకాలూ ఉండవనిపిస్తోంది. భగవంతుడిని చిల్లరగాళ్ళన్నా, పురాణ పురుషుల మధ్యన గల సంబంధాలను వక్రీకరించినా, అభ్యంతరకరమైన విధంగా హిందూ దేవుళ్ళ చిత్రాలు సృష్టించినా, తిట్టినా, తగులబెట్టినా దేనికీ అడ్డు ఉండదు. మిగిలిన మతాలపై ఇలాంటి సాహసం ఎవ్వరూ చెయ్యరు. చేసినా గట్టి వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితులలోనే రివర్స్ గేర్ వేసిన ఏకైక(ప్రాముఖ్యత కలిగిన) హిందుత్వవాది రామ్ స్వరూప్.

మన దౌర్భాగ్యం - హిందూ దేశమైవుండీ, హిందుత్వ సంరక్షణలో భాగంగా వెలువడిన ఇటువంటి పుస్తకాలు బహిష్కరింపబడటం. హిందువు గోడు ఇక్కడనే గొంతు నొక్కబడితే, ఇంకెక్కడ వెలువడుతుంది చెప్పండి? మనదేశంలో మతసహనలేమికి(హిందుత్వానికి మినహాయింపు) ఈ నిషేదం చక్కని ఉదాహరణ. దీనికి నిజమైన కారణం ఏమిటో తెలుసునా? పరిపక్వత కలిగిన సంస్కృతీ, ఆ సంస్కృతికి చెందిన మనుషులూ - నిందలనూ, ఆరోపణలనూ, విమర్శలనూ హూందాగా స్వీకరిస్తారు. వీటిని హూందాగా స్వీకరించలేని మతం పరిణితి చెందినది కాదు. ఈ అపరిపక్వత వివేకాన్ని నాశనం చేస్తుంది. క్రీస్తును గానీ, క్రైస్తవాన్ని గాని విమర్శించిన క్రైస్తవుడు మతం నుండి వెలివేయబడతాడు. అతడు క్రైస్తవునిగా పిలవబడడు. అదే విధంగా ఇస్లాం ని విమర్శించిన ముస్లిం, ముస్లింగా పిలవబడే అర్హత కోల్పోతాడు. కానీ హిందువో? ఎంత తిట్టినా అతను హిందువుగానే గుర్తింపబడతాడు.

మన సనాతన హిందూ ధర్మ గ్రంధాలు సైతం విభేధాలు వచ్చినప్పుడు ముఖాముఖీ చర్చల్లో పోటీ పడినట్లు చెబుతాయి. హిందుత్వం వేల ఏళ్ళుగా వివిధ వర్గాలనూ, సంస్కృతులనూ - ప్రశ్నించి, విభేదించి, తర్కించి, చర్చించి వివేకాన్ని, విజ్ఞానాన్ని పెంపొందించుకుంది. సంఖ్యా శాస్త్రాలలోనూ, వేదాంతాల పరంగా, ఆచారపరంగా వైరుధ్యం కనిపించినప్పుడు హిందుత్వంలోని ఆయా వర్గాలు ముఖాముఖీ చర్చించుకునెడివి తప్పితే నిషేదమనో, బహిష్కరణయనో ప్రతిపాదించలేదు(ఉదాహరణకు శైవ, వైష్ణవ విభేదాల సమయంలో ఆది శంకరాచార్యుడు ఇలాంటి చర్చల్లోనే పాల్గొనేవాడు).

ఎవరి అహమో, ఏదయినా వర్గం విశ్వాసం దెబ్బతింటుందని తమ సందేహాలను దాచుకొననూలేదు. హిందుత్వంలో సత్య శోధన బాహాబాహీగానే ప్రతి ఒక్క విషయాన్ని ప్రశ్నించుకుంటూ జరిగింది.

సైన్సు కూడా ఈ విధంగా అభివృధ్ధి చెందినదే. ఓ సారి మతాల పరిస్థితిని సైన్సు కి అన్వయించుకుంటే ఎలా ఉంటుందో చూడండి. అన్ని మతాలూ మంచివే అనుకున్నట్లు అన్ని సైన్సు సూత్రాలూ సరియైనవే అనుకోవాలి (అవి విభేదించుకున్నా కూడా). మైనారిటీ సైంటిస్టులకు ప్రత్యేక హోదాలూ, వారి సిధ్ధాంతాలకు ప్రత్యేక గౌరవాన్ని కల్పించాలి. మెజారిటీ సైంటిస్టులు ఈ మైనారిటీ సైంటిస్టుల సిధ్ధాంతాలలో హేతువును ప్రశ్నించకూడదు.

చూసారా ఎంత అస్తవ్యస్తంగా ఉందో? ఈ తరహా ఆలోచనా విధానం ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో ఓట్లకోసం అమలౌతున్నంత వరకూ మనం సత్యానికి చేరువ కాలేము. రామ్ స్వరూప్ ఈ రాజకీయ పరిస్థితులను సవాల్ చేస్తూ చేసిన కౌంటర్ attackవెలుగు నోచుకోలేకపోయింది.

(ఈ నిషేదింపబడిన విప్లవాత్మకమైనపుస్తకం చదవాలనుకుంటున్న వారు EBookకై ఇక్కడ click చేయండి)

హిందుత్వం అన్నది దేశ సరిహద్దులతో సంబంధం లేకుండా మానవాళి మొత్తం పంచుకోవాల్సిన సత్య సందేశం. ఇది నమ్మకాలనూ, విశ్వాసాలనూ, అధికారాలనూ, విద్యావిధానాలనూ, గ్రంధాలనూ మించిన సత్యం. ఈ సత్యాన్ని కనుగొనండి.

ఆనంద నిర్వచనం - తీర్థరాముని సందేశం

వివేకానందుని ఆత్మ సిధ్ధాంతాన్ని క్రితం వారం చదువుకున్నాం కదా... ఈ వారం రామ తీర్థుని ఆనంద నిర్వచనాన్ని తెలుసుకుందాం. ముందుగా రామతీర్థులు తెలియని వారిగురించి రెండు పరిచయ వాక్యాలు. రామ తీర్థులు వివేకానందుని బాటలో ప్రపంచ యాటన చేసి హిందుత్వాన్ని, వేదాంత సారాంశాన్ని ఎలుగెత్తి చాటిన మహనీయుడు. ముఫ్ఫై రెండేళ్ళ వయసులోనే మరణించిన ఈతడు తన ప్రసంగాలను బధ్రపరచుకునే ఆసక్తి కూడా లేకపోవటంతో ఎన్నో విలువైన సందేశాలు మరుగున పడ్డాయి.

ఈయన ఆనందం గురించి చెప్పిన ఒక ఉపన్యాస సారాంశం:





ఈ ప్రపంచం మొత్తం వెంపర్లాడేది సంతోషం కొరకేనని మనమందరం ఏకీభవిస్తాం. కొందరు జ్ఞానం కోసమనో, లక్ష్యం కోసమనో వాదించినప్పటికినీ సూక్ష్మంగా గమనిస్తే వారి జ్ఞాన, లక్ష్య సాధన వెనుకన నిగూఢంగా, అంతర్లీనంగా ఆత్మ సంతృప్తి, ఆనందం దాగిఉంటాయి. ఎంత కాదనుకున్నా గానీ మన జీవిత పరమార్ధం ఈ సంతృప్తినీ, సంతోషాన్ని పొందటమే.

ఈ రోజు ఈ ఆనందమన్నది ఎక్కడ నివసిస్తుందో కనుగొందాం. అందమైన భవంతుల్లోనుంటుందో, సౌందర్యవంతులైన ముద్దుగుమ్మల వద్దనుంటుందో, బంగారు ఆభరణాలు, సంపదలలో ఉంటుందో కనుగొందాం.

అసలీ సంతోషం స్వస్థలం ఎక్కడ? మనలో ఒక్కోసారి ఉంటూ, ఒక్కోసారి వీడుతుంది అంటే సంతోషం కూడా ప్రయాణిస్తూనే ఉండాలి కదా. ఈ సంతోషం ప్రయాణాన్ని తెలుసుకునేందుకు ఒక ఉదాహరణగా కధ చెప్పుకుందాం.

అప్పుడే పుట్టిన బిడ్డకు సంతోషం ఎక్కడ లభిస్తుంది? తల్లి కొంగు చాటున, తల్లి ఒడిలో, పాలిండ్లలో. అతగాడి సంతోషం మొత్తం ఈ ప్రదేశాలలోనే తిరుగుతుంది. తల్లి ఒడిలో కొంగుతో ఆడుకునే పసిపాపాయి బోసి నవ్వులను చూడండి. ప్రపంచంలో ఏ ఇతర వస్తువూ, విషయమూ అతనికి అంతకు మించిన ఆనందాన్ని అందించలేవు. పుస్తకాలతనికి అర్ధంకానివి. సంపదలతనికి నిరుపయోగమైనవి. పళ్ళూ, మిఠాయిలూ రుచిలేనివి. అతని సంతోషం మొత్తం తన తల్లి వద్దనే కేంద్రీకరించబడి ఉన్నది.

ఒక సంవత్సర కాలం గడిచింది. ఇప్పుడు ఆ పసివాని ఆనందం ప్రయాణించి ఉండిఉంటుంది. మునుపటిలా అతడిప్పుడు తల్లి వద్ద సంతోషాన్ని పొందలేడు. ఇప్పుడతనికి ఆటబొమ్మలు కావాలి. ఆ ఆటబొమ్మలకై తన తల్లితో పోట్లాడుతాడు కూడా.పోనీ అతని ఆనందం ఈ ఆటబొమ్మల వద్ద నిలచి ఉంటుందా? ఉహూ..! కొన్నేళ్ళకు అతని ఆనందం మళ్ళీ స్థానభ్రంశం చెంది ఉంటుంది.

ఇప్పుడతని ఆనందం కధల పుస్తకాల వెంబడో లేక ఆటలకై తోటి పిల్లలలోనో ఉంటుంది. ఇదివరకు ఆడుకున్న బొమ్మలు అతనికి ఆనందాన్ని ఈయలేవు. పోనీ సంతోషం ఇక్కడితో తన ప్రయాణాన్ని ఆపేస్తుందా? ఉహూ...!

ఈ బడికెళ్ళే బాలుడు కళాశాలకు వచ్చేసరికి అతని ఆనందం తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఇప్పుడతని ఆనందం శాస్త్ర పుస్తకాల వెనుకనో, లేదా అందమైన ఆడపిల్లల వెనుకనో పడుతుంది. కళాశాలనుండి బయటకొచ్చేసరికి అతని ఆనందం ధనం వెనుకనో, ఉద్యోగం వెనుకనో పరుగులెడుతుంది.

ఇప్పుడతని కలలన్నీ సంపదతో స్థిరత్వాన్ని సృష్టించుకోవటం కొరకే. ఇందులోనే అతడు ఆనందాన్ని పొందగలడు. అయితే ఈ సంపదలను పొందిన అతని ఆనందం అక్కడితో విశ్రమిస్తుందా? లేదు... అతనికిప్పుడు ఒక తోడు కావాలి. జీవిత భాగస్వామి కావాలి.

తల్లి కొంగు అతనికిప్పుడు అర్ధరహితమైనది. ఆటబొమ్మలతనిలో ఏ మాత్రం ఉత్సాహాన్ని కలిగించలేనివి. కధలపుస్తకాలు ఆసక్తిలేనివి. తాను చదివిన చదువు, సంపాదించిన ధనం అన్నీ కూడా జీవిత భాగస్వామి లేకుంటే నిరుపయోగమైనవి. స్వఛ్ఛమైన ప్రేమ కోసం, తోడు కోసం అతను తన ఆర్జితాలను సైతం త్యజించగలిగే స్థితికి వస్తాడు.

సరే ఇతనికి తగిన జోడీ దొరికిందనుకుందాం. అతని ఆనందం ఇప్పటికైనా విశ్రమిస్తుందా? లేదే...! పాశ్చ్యాత్తుల సంగతేమో కానీ సగటు భారతీయుని సంతోషం భార్య పైనుంచి బిడ్డకు ప్రసరిస్తుంది. బిడ్డకొరకు భగవంతుని అర్ధించటమేమిటి? ఎంత సంపదనైనా త్యజించటానికి సిధ్ధపడతాడు.

పైన చెప్పుకున్న వృత్తాంతంలో బిడ్డ అతని ఆనందప్రయాణంలో ఆరవ మెట్టు. బిడ్డ పుట్టాక ఆ తండ్రి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతాడు. అతనిలో ఆనందం శిఖరాన్ని తాకుతుంది. ఇక్కడ కాసేపాగి ఆనంద ప్రయాణ విశేషాలని ఒకసారి గమనిద్దాం. ఇక్కడ సూర్య కిరణాలతో ఆనంద ప్రయాణాన్ని పోల్చిచూద్దాం. సూర్యరశ్మి కూడా ప్రయాణిస్తూనే ఉంటుంది. ఒకసారి జపాన్ పైనున్న కాంతి కొద్దిసేపటికి భారత దేశం మీదకు ప్రసరిస్తుంది. మరికాసేపటికి ఆఫ్రికా, యూరోపుల మీదుగా అమెరికాపై పరావర్తనం చెందుతుంది. అచ్చం మన సంతోషం ప్రయాణించినట్లే... అయితే సూర్యకాంతి ప్రతిఫలించిన ఏ ఒక్క ప్రదేశాన్నయినా (జపాన్, భారత్ తదితర దేశాలూ, ఖండాలూనూ) ఆ కాంతి జనకంగా భావించవచ్చునా? లేదు కదా... ఈ కాంతి సూర్యుని యందు జనియించునన్నది నిశ్చయము.

అదే విదంగా సంతోషమన్నది ఒక్కో సమయంలో ఒక్కొక్క విషయముపై ప్రతిఫలిస్తుంది. అంత మాత్రంచేత ఆ విషయమే కాంతి జనకం కాదు.

మళ్ళీ కధలోకి వద్దాం. ఇంతకు ముందు బిడ్డలో బ్రహ్మానందాన్ని పొందిన వ్యక్తి ఆఫీసులో పని చేసుకుంటుండగా ఫోను మ్రోగింది. ఆ ఫోను ఎత్తి విందుడు కదా... అతని హృదయం బ్రద్దలయ్యేంత విషాదకరమైన వార్త. అది ఏమయ్యుంటుంది? అతని మెదడు మొద్దుబారింది. స్పృహ కోల్పోకుండా నిభాయించుకున్నాడు. తక్షణం ఆఫీసు వదలి ఇంటికి బయలుదేరాడు. అతను తన పై అధికారి అనుమతి తీసుకోవాలన్న సంగతి కూడా మరచిపోయాడు. తన సహోద్యోగులకు సైతం ఒక్క మాటైనా చెప్పలేదు. ఎక్కడి పని అక్కడే వదలి వేసి బయలుదేరాడు. బయట తమ యజమాని కనిపించాడు. ఎన్నో రోజులుగా ఓ అయిదు నిముషాలు తన పదోన్నతి గురించి అతనితో మాట్లాడుదామనుకున్నా కుదరటం లేదు. అలాంటిది ఈ రోజు యజమాని తనంతట తానుగా పలకరించినా వినిపించుకోకుండా పరుగున బైట పడ్డాడు. అతడిని ఎరిగిన పోస్ట్ మేన్ ఒక ఉత్తరాన్ని అందించాడు. ప్రాపంచిక విషయాల దృష్ట్యా ఆ ఉత్తరం అతనికి సంతోషం కలిగించాల్సిన విషయం. ఎందుకంటే అందులో అతనికి వచ్చిన కోటి రూపాయల లాటరీ విషయం ఉంది. ఉహూ...! ఇప్పుడతనికి నిష్ఫలం. ఫొనులో అందిన సమాచారం మరింత బరువైనదీ, బాధాతప్తమైనదీనూ.

అతను పరుగున ఇల్లు చేరుకున్నాడు. అతని ఇల్లు దహించవేయబడుతుంది. మంటలు ఉవ్వెత్తున ఎగసి ఆకాశాన్ని తాకుతున్నాయి. తన భార్యనూ, తల్లినీ, మిగిలిన ఆప్తులందరినీ కనుగున్నాడు. కానీ అతని ముద్దుల బిడ్డ అతనికి కనిపించటంలేదు. ఇల్లంటుకున్న ఖంగారులో కోడలి వద్ద ఉందనుకుని తల్లి, అత్త దగ్గర ఉందనుకుని భార్య ఇద్దరూ బిడ్డను లోపలే వదలివేసి వచ్చారు.

అతడు గుండెలవిసేలా రోదిస్తున్నాడు. తన బిడ్డను తెచ్చిన వారికి తన సర్వస్వం ధారపోస్తానని కేకలు పెడుతున్నాడు. నిష్ఫలితం.

ఇక్కడతడు బిడ్డ కొరకు అన్నీ వదలుకోవటానికి సిధ్ధపడుతున్నాడు. అయితే బిడ్డ అతని సంతోషానికి కేంద్ర బిందువా?

బిడ్డ కొరకు అన్నీ త్యజించివేయ బడుతున్నాయి. అయితే బిడ్డ మరేదయినా పరమార్ధం కొరకు త్యజించవేయబడుతున్నాడని ఎందుకు అనుకోరాదు?

సంపదలూ, ఆస్థిపాస్తులూ అన్నీ బిడ్డ కొరకు త్యజించవేయబడేందుకు సిధ్ధమౌతున్నాయి. బిడ్డ కొరకు ఆ మంటల్లో దూకినప్పటికినీ అతడా బిడ్డను కాపాడుకోలేకపోవచ్చును. అయితే ఈ విధంగా త్యాగం చేయబడుతున్న బిడ్డ మరేదయినా పరమార్ధాన్ని అందించనున్నాడా? అదే నిజమైతే ఆ మరేదయినా పరమార్ధమే నిజమైన ఆనంద కేంద్రకం అయి ఉండాలి. అదే అత్మానందం. బిడ్డ కొరకు సంపదలన్నీ త్యజించవేయబడుతున్నాయి. కానీ ఆ బిడ్డ ఆత్మానందం కొరకు త్యజించవేయబడుతున్నాడు. అంటే బిడ్డ అత్మానందం కనుక గొప్ప విషయం కాదు కనుక త్యజించవేయబడుతున్నాడు.

ఆ పసివాని అందమైన నవ్వు మనకు సంతోషదాయకం. ఎందుకంటే మన సంతోషం ఆ నగుమోముపై ప్రసరిస్తుంది కనుక. అంతే కానీ ఆ కాంతి కారకం బిడ్డ కాదు. బిడ్డ సంతోషకారకం అయి ఉంటే బిడ్డ మృతితోనే ఆ తండ్రి సంతోషం అంతమయ్యి ఉండాలి. కానీ అలా జరగదు కదా... ఆ సంతోష కారకం ఏమయ్యుంటింది? బిడ్డ తనకు తానుగా మనకు ఆనందాన్ని ఇవ్వటం లేదు. మన ఆనందం బిడ్డ పై ప్రతిఫలించటం వల్ల ఆ పసివానిలో ఆనందాన్ని పొందగలుగుతున్నాం. భార్య, సంపదలు తమంతట తాముగా ఆనందాన్ని మనకు కలిగించటం లేదు. మన ఆనందం వారిపై ప్రతిఫలించటం వల్ల ఆనందాన్ని వారిలో పొందగలుగుతున్నాం. ఇదే సత్యం.

అందరూ అంటుంటారు. ఫలితాన్ని ఆశించకుండా ప్రేమించమని. కానీ ఇది సాధ్యం కానిది. ఆ ఫలితం కనీసం మన ఆత్మానందం అయి తీరుతుంది.

భార్యా భర్తలు ఒకరికొకరు ఆనందాన్ని పంచుకోలేని నాడు విడిపోతారు. సంపద ఆనందాన్ని కలిగించని నాడు త్యజించవేయ బడుతుంది. రోమ్ చక్రవర్తి నీరో గురించి మీకు తెలిసే ఉంటుంది. అతనికి సంపదలు ఆనందాన్ని కలిగించలేదు. ఫలితం తన పట్టణాన్నంతటినీ తగులబెట్టించి కొండపై ఫిడేలు వాయించుకుంటూ చూసాడు. అతనికి ఆ మహోజ్వాలల దావానలం సంపద కంటే ఆనందాన్ని కలిగించింది.

అయితే మరి ఈ సంతోషం కేంద్రం ఎక్కడ ఉంది? ఈ పాటికి మనలోనే ఉంటుందని గ్రహించే ఉంటారు. అయితే ఎక్కడ ఉంటుంది? మన పాదంలో ఉంటుందా? ఉహూ...! అలా అయితే కాళ్ళు లేనివాడు ఆనందపడకూడదు కదా...! పోనీ చేతులలోనో, కళ్ళలోనో ఉందా? ఉహూ...! ఇదీ నిజం కాదు. కళ్ళు కాళ్ళ కంటే ప్రీతిపాత్రమే కావచ్చు. కానీ సంతోషం అక్కడ కూడా లేదు. అలా అయితే గుడ్డివాళ్ళు కూడా సంతోషపడకూడదు కదా. కళ్ళ కంటే ప్రీతిపాత్రమైనవి ఊహించండి. మీరు ప్రాణం అని చెప్పే అవకాశం ఉంది. అయితే రాముడు సంతోష కేంద్రం మన దేహంలోనే లేదని చెబుతున్నాడు. దేనికంటే ప్రీతిపాత్రమైనది లేదని మనం ఘంటాపధంగా చెప్పగలమో అది సంతోషానికి కేంద్రం అయిఉండాలి. మన ఆలోచన, మెదడు అన్నిటికంటే ప్రీతిపాత్రమైనదని చెప్పేవారికి ఒక వివరణ.

ఇప్పటికిప్పుడు ప్రాణాన్నిస్తావా? లేక మతి స్థిమ్తాన్ని ఇస్తావా? అని ప్రశ్నిస్తే ఎందరు ప్రాణాన్ని ఎవ్వటానికి సిధ్ధపడతారు? ఇక్కడ ప్రాణం కొరకు మతి సైతం త్యజించవేయబడుతున్నది.

అయితే ప్రాణం అన్నింటికన్నా ప్రీతిపాత్రమైనదా? వేదాంతాలు ఈ ప్రాణాన్ని కూడా సంతోష జనకాకంగా పేర్కొనటం లేదు.

రాముడు ఒకసారి మరణావస్థలోనున్న యువకుడిని చూసాడు. అతను పడుతున్న బాధ, నొప్పి ఆపాద మస్తకమూ కనిపిస్తున్నాయి. నొప్పిని భరించలేని అతడు అన్న మాటలివి: "భగవంతుడా! ఈ ప్రాణం నన్నొదిలి ఎప్పుడు పోతుంది?"

అంటే ప్రాణం సైతం ఆనంద జనకం కాదన్న మాట. ఇప్పుడు ప్రాణం కంటే ప్రీతిపాత్రమైనదాని కొరకు ప్రాణం త్యజించవేయ బడుతున్నది. ప్రాణం అత్యంత దగ్గరగా ఉండటం వల్ల అది ఆనంద కేంద్రకం అనుకుంటాం. కానీ అది కూడా ఆనంద కారకం కాదు. ఆ అత్యంత ప్రీతిపాత్రమైనదాన్ని గుర్తించండి. మీ ఆనంద కేంద్రబిందువు అదే. స్వర్గం, నరకం రెండూ నీలోనున్నవే.

పసి పాపాయి తన నీడను పట్టుకునేందుకు ఎంత వెంటబడినా ఆ నీడ చేజిక్కదు. తల్లి ఆ పాపను తన తలను తానే పట్టుకున్నట్లు నేర్పిన క్షణాన ఆ నీడ తన వశమైన భావన ఆ పాపాయిలో కనిపిస్తుంది. ఇది మనకూ వర్తిస్తుంది. ఆనందం కొరకు దేని వెంటో పడకుండా మనలోని ఆనంద కేంద్రాన్ని గుర్తించి పట్టుకుంటే నిజమైన ఆనందం వశమవుతుంది. అప్పుడు మనం నిర్దేశించుకున్న విషయాలపైననే కాక, లోకం సర్వం ఆనందమయంగా కనిపిస్తుంది.

ఒకనాడు ఒకామె తన ఇంట్లో సూదిని పోగొట్టుకున్నది. ఆమె దీపం కూడా లేని బీదరాలు. వీధి దీపం వద్దకు వచ్చి వెతుకుతున్న ఆమెను దారినపోయేవారు ఏం వెతుకుతున్నావని అడిగారు. సూది కోసం అన్న ఆమెను 'ఎక్కడ పోగొట్టుకున్నావ'ని ప్రశ్నించారు. ఇంట్లో నన్న ఆమె సమాధానానికి అందరూ నవ్వగా ఆమె కోపగించుకుంది. ఇంట్లో దీపం లేదు కనుక వీధి దీపంలో వెతుకుతున్నానన్నది ఆమె తర్కం. సరిగ్గా మనమందరం ఇలానే ప్రవర్తిస్తున్నాం. మనలోనున్న సంతోషాన్ని హృదయంలో అంధకారముందని బయటి వెలుగులో వెతుకుతున్నాం.

మరో కధలో ఒక పిచ్చివాడు వీధి పిల్లలందరికీ రాజుగారు మిఠాయిలు పంచిపెడుతున్నారని అబధ్ధం చెప్పాడుట. పిల్లలందరూ నిజమని నమ్మి రాజుగారింటికి వెళ్ళగా అక్కడలాంటిదేమీ లేదని తెలిసింది. అయితే వారితో పాటూ వచ్చిన పిచ్చివాడ్ని చూసి పిల్లలు 'మిఠాయిలు పంచటం లేదన్న విషయం నీకు తెలుసు కదా, మరి నువ్వెందుకొచ్చావ్?' అని ప్రశ్నించగా, ఇంత మంది వస్తున్నారు కదా నిజమయ్యుంటుందేమోనని వచ్చా అన్నాడట.

అలా మనమందరం సంతోషానికి కేంద్రం మన హృదయంలోనే ఉందని తెలిసి ప్రాపంచిక విషయాల్లో వెతుకుతున్నాం.

Lecture delivered on December 17, 1902 in the Academy of Sciences, San Francisco, USA.

దానవుని జీవనం

ఈ మధ్యన కొన్ని బ్లాగుల్లో అయిదేండ్ల తెలుగు కధలు ప్రతిపాదన చూసాక, హఠాత్తుగా గతంలో నేను పనికిరావనుకుని నలిపి పారేసిన కధలు గుర్తుకొచ్చాయి. అసలు మన కధలకంత సీనుందా? లేదా ఏదన్నా భ్రమలో ఉన్నానా? అని సందిగ్ధావస్థలో పడిపోయాను. ఎందుకంటే ఒకటో అరో కధలు ఇది వరకు బ్లాగుల్లో దర్శనమిచ్చినా ఒక్క విమర్శకైనా నోచుకోలేదు. ఈ క్రింది కధ సంభాషణలతో నిమిత్తం లేకుండా, ఏ విధమైన సందేశాల జోలికి పోకుండా వర్ణనలతో ప్రయత్నించాను. ఈ కధపై విమర్శలను సవినయంగా ఆహ్వానిస్తున్నాను. (గతంలో ఈ కధ విహారి పేరుతో కోడీహళ్ళి మురళీమోహన్ గారి కధాజగత్తులో ప్రచురించాను.) చదివి మీ అభిప్రాయాలను(ముఖ్యంగా లోటుపాట్లు) తెలియజేయండి. ఈ లోపు రేపటి వికాసంలో తీర్థ రాముని పరిచయ ఏర్పాట్లు చేస్తూ ఉంటాను.

దేవతలు, రాక్షసులు తాంబూలాలు పుచ్చుకున్నారు. పెళ్ళి నిశ్చయించారు. నిజానికా సంబంధం దేవతల తరపు వారికి ఇష్టం లేదు. కానీ వేరే దేవతల సంబంధం చేసే స్థోమత లేక, రాక్షసుల కట్నం తక్కువ కావటం చేత ఒప్పుకున్నారు.

దేవతకి, రాక్షసునికి పెళ్ళైపోయింది. దేవతంటే ఆమె నిజంగా దేవతే! అలా అని ఆమెకి గొప్ప ఆదర్శాలు కానీ, విలక్షణ వ్యక్తిత్వం కానీ, ఒకళ్ళని ఉద్ధరించే గుణం కానీ ఉన్నాయనుకోకూడదు. ఆమె చాలా అమాయకురాలైన దేవత. వెన్నపూసలాంటి మనసున్నది. ఎదుటి వారిలోని ఎంతటి తప్పైనా క్షమించగలిగేది. ఆమె రాక్షసునితో వివాహమనగానే తల్లికి ఎదురు చెప్పలేదు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన తనకు తల్లి అంతకంటే ఎక్కువ కట్నం ఈయలేదని గ్రహించింది. అదీ గాక ఆమెకు తల్లిని ఎదిరించటం తప్పని తోచింది. అలా అని లోలోన బాధపడనూ లేదు. ఒక వేళ బాధపడినా తాళి పడ్డ మరుక్షణం ఆ బాధను మరచిపోయింది. పతియే ప్రత్యక్ష దైవం అనుకుంది.

రాక్షసుడు కూడా, రాక్షసుడంటే నలుగురికి కష్టాలు కలిగించేవాడో, ఎదుటి వారికి కీడు తలపెట్టేవాడో కాదు. అతను ఇతరుల జోలికే పోయేవాడు కాదు. కాని అతనిలో రాక్షస సాంప్రదాయాలు మూర్తీభవించి ఉన్నాయి. అతనికి హృదయం లేదు. హృదయం లేదంటే కఠినాత్ముడు అనుకోకూడదు. హృదయం బండరాయంటే కఠినాత్ముడు కానీ, హృదయం లేడంటే కఠినాత్ముడని అర్థం ఎలా వస్తుంది? అతనిలో మృగచేష్టలు ఎక్కువగా కనపడతాయి.

ఆమెకు రాక్షసుని వికృత చేష్టలెన్నో బాధ కలిగించినై. రాక్షసుడు గట్టిగా అరచినట్లు మాట్లాడేవాడు. భాష కూడా జుగుప్సాకరంగా ఉండేది. నవ్వితే బండరాళ్ళు కురిసినట్లు ఉండేది. పళ్ళు వికృతంగా ఉండేవి. శుభ్రంగా ఉండేవాడు కాదు. తినేటప్పుడు అసహ్యకరమైన లొట్టల చప్పుడు వినపడేది. తైల సంస్కారం లేని తల గోక్కుంటూ ఉండేవాడు. పెళ్ళైన కొత్తలో రాక్షసులతోనే గడుపుతూ ఆమెను దూరంగా వేరుగా ఉంచేవాడు. ఆమె అన్నింటికీ ఓర్చుకుంది. భర్త వైఖరిలో మార్పు తేవటానికి ప్రయత్నించేది. కొంచెం కొంచెం పరివర్తన అతనిలో కలిగేది. ఆమెతో బాగానే కాపురం చేసేవాడు. కానీ తన రాక్షసుల మధ్యకు పోయేసరికి రాక్షసుడైపోయేవాడు. రాక్షసుల మధ్యకు వెళితే, రాక్షసులను తన వారిగానూ దేవతలను పరాయి వారిగానూ భావించేవాడు. తనవారు తనకు మంచి చేస్తారని నమ్మేవాడు. మిగిలిన రాక్షసులు అతడిని దేవతలతో చేరి చెడిపోయావనేవారు. అతడు బుర్రూపేవాడు. వట్టి 'వాజమ్మ' వలే తయారయ్యావనేవాళ్ళు. దానికీ బుర్రూపేవాడు.

దేవత వద్దకు వచ్చి ఓ రెండ్రోజులు ఆ ద్వేషాన్ని వెళ్ళగ్రక్కేవాడు. మళ్ళీ అంతలోనే దేవత విలువ తెలుసుకుని బుధ్ధిగా మసలే వాడు. దేవత అతడినెప్పుడూ కించపరచలేదు. అతని తప్పులను తనపై వేసుకుని చూపరులకు దేవతదే తప్పన్న భ్రమ కలిగించేది. అతడు కూడా తన తప్పులను ఆమెపై రుద్ది ఆమెదే తప్పన్న భ్రమ కలిగించేవాడు. తన సంపాదనంతా రాక్షసులకు ధారపోసేవాడు. అయినా దేవత ఎదురు చెప్పలేదు. రాక్షసులను కూడా తన వారిగా భావించగలిగే ఉన్నత మనస్తత్వం ఆమెది.

దేవత తన భర్త ప్రవర్తన మార్చటానికి నానా తంటాలూ పడేది. కొంతవరకు విజయం సాధించింది కూడా. ఎందుకంటే రాక్షసుడు దేవత సాంగత్యంలో రాక్షసునివలే ఉండేవాడు కాదు. మనసున్న వాడిలా మసలే వాడు. కాని అంతలోనే రాక్షసుల సహచర్యంలో రాక్షసుడై పోయేవాడు. దేవత తన లక్ష్య సాధనలో ఎన్నో కష్టాలనుభవించింది. ఆమె గుణాలు కొన్ని రాక్షసునికి అలవడి అతను మంచివాడైనా, అతడి గుణాలు కొన్ని ఆమెకు అబ్బాయి. రాక్షసుల మూర్ఖత్వం కొంతమేరకు ఆమెకు అలవడింది. అయినా ఆమె దేవతే! వజ్రాన్ని కొంత అరగదీసినంత మాత్రాన వజ్రం కాకపోతుందా? పాపం ఆమె మాత్రం ఏం చేస్తుంది? ఆమె అమాయకురాలు. ఎలాంటి పరిస్థితులలోనూ కూడా దుర్గుణాలను దరి చేరనీయనంతటి ధీరోధాత్తురాలూ, ఆదర్శవంతురాలూ కాదు. అసలామెకు ఆదర్శాలే లేవు. కానీ ఆమె దేవతే! ఎందుకంటే ఆమె మనసు వెన్నపూస! కాదు మంచుగడ్డ.

రాక్షసునికి, దేవతకి మొదట ఓ కొడుకు పుట్టాడు. అయితే క్రొద్ది కాలమే బ్రతికి ఏడాదికే పోయాడు. బహుశా పరస్పర విరుద్ధ స్వభావంగల రాక్షసునికి, దేవతకి పుట్టటం వల్ల గాబోలు, కొద్ది కాలమే జీవించగలిగాడు. దేవత కుమిలిపోయింది. భోరున విలపించింది. రాక్షసుడూ ఏడ్చాడు. కానీ ఎందుకు ఏడ్చాడో అతనికి తెలియదు. భార్య ఏడుపు చూసి అతనికి కన్నీళ్ళు వచ్చాయి. అంతే!

కొన్నాళ్ళకు వారికి మరొక సంతానం కలిగింది. ఈ సారి భగవంతుడు బాగా అలోచించి పూర్తి రాక్షసపుత్రికనే పుట్టించాడు. రాక్షసులంతా పండగ చేసుకున్నారు. తమ రాక్షస సోదరుడ్ని అభినందించారు. దేవతకు రాక్షసపుత్రి కలిగినందుకు బాధ కలగలేదు. ఎందుకంటే రాక్షసుడు ఆనంద పడ్డాడు గనుక. సంతోషమూ కలుగకపోయినా, ఆమె భర్త ఆనందాన్ని పంచుకుంది.

రాక్షస పుత్రి రెండేళ్ళదయ్యింది. ఆమెకు అచ్చం రాక్షస వంశ గుణాలే వచ్చాయి. రాక్షసుని ముద్దుల కూతురయ్యింది. పోలికలో కూడా అచ్చం తండ్రిలానే ఉండేది.

మరొక ఏడాదికి వారికి మరొక సంతానం కలిగింది. ఈసారి దేవపుత్రుడు జన్మించాడు. దేవత మురిసిపోయింది. రాక్షసుడూ మురిసాడు. ఎందుకంటే అతనికి దేవతల విలువ తెలుసు. కానీ రాక్షసుల మధ్యకు చేరితే అతడా విలువను మర్చిపోతాడు.

పిల్లలిద్దరూ పెరిగి పెద్దవారయ్యారు. రాక్షసుని ప్రవర్తనలో మార్పులేదు. దేవత వద్ద ఒక రకంగా, రాక్షసుల మధ్య మరో రకంగా ప్రవర్తించేవాడు. రాక్షసులు అతడిని ఇప్పటికీ 'వాజమ్మ' అనేవారు. అతడు బుర్రూపేవాడు. కానీ వాళ్ళ దగ్గరకు వెళ్ళటం మానలేదు. తనవాళ్ళనీ, రక్తసంబంధీకులనీ ప్రేమ. హృదయం లేనివాడికి తన జాతి పై మాత్రం ప్రేమ ఎలా వచ్చిందంటే సమాధానం చెప్పలేం. రక్తసంబంధం కనుక ఆ ప్రేమ రక్తంలోనే ఉన్నదనుకోవాలి.

అదేంటోగానీ రాక్షసుడు దేవతని విడిచి రాక్షసుల వద్దకు పోయి ఎన్ని రోజులైనా ఆనందంగా గడపగలిగేవాడు. కానీ అతడిని విడిచి దేవత ఒక్క క్షణం గడప దాటినా ఉండలేకపోయేవాడు.
ఎప్పుడైనా ఆమె పుట్టింటికి వెళితే, దేవత లేని తన ఇంట్లో పిచ్చాడైపోయేవాడు. అలాంటప్పుడే అతనికి దేవత విలువ తెలిసొచ్చేది.

పిల్లలు మరింత పెద్దవారయ్యారు. రాక్షసపుత్రిని చూసి రాక్షసులు గర్వపడేవారు. రాక్షసుడూ గర్వపడినా అతడు తనకు దేవపుత్రుడు జన్మించినందుకు కూడా ఆనందించేవాడు. మిగిలిన రాక్షసులకు ఆ ఆనందం లేదు. వారికి రాక్షస కుమారుడైతేనే బాగుండుననిపించేది. రాక్షసుడు మాత్రం ఇద్దరి మీదా మమకారం పెంచుకున్నాడు. ఇది కూడా రక్త సంబంధమే కనుక ఆ ప్రేమ కూడా రక్తంలోనిదే అనుకోవాలి.

దేవపుత్రుడిది విలక్షణ వ్యక్తిత్వం. తన తల్లికున్నంత కరుణ అతనికి లేదు. నిజానికి అంతటి కరుణ, దయ ఉండకూడదని అతని విశ్వాసం. అతనివి చాలా విశాల భావాలు. ఉన్నత ధృక్పధంతో అలోచించేవాడు. అతనికెంతో ఆదర్శవంతమైన ఆశయాలున్నాయి. తన ఆశయ సాధనలో దుష్టుల మనస్సు నొప్పించటానికైనా వెనుకాడేవాడు కాదు. అతనికి తండ్రి ప్రవర్తన నచ్చలేదు. తల్లి మామూలు దేవతలా కాక, దేవతలకే దేవతలా కనిపించింది. తండ్రికి హృదయం లేదని, రంగులు మారుస్తాడని తెలుసుకున్నాడు. అయితే ఆ రంగులు మార్చటంలో తండ్రికి స్వార్థం లేదని గ్రహించాడు.

రాక్షసునికి మాత్రం పుత్రునిపై విపరీతమైన ప్రేమ. ఆ విషయం దేవకుమారునికి కూడా తెలుసు. అందుకే తండ్రిని ఈసడించుకోవాలనుకున్నా ఆ పని చేయలేకపోయేవాడు. తండ్రి మనస్సు నొప్పించే సాహసానికి ఒడిగట్టబుధ్ధి కాలేదతనికి.

అయితే తండ్రి సాంగత్యం వల్ల తల్లిలో వచ్చిన మార్పులను సహించలేకపోయేవాడు. తల్లిపై విసుగును, కోపాన్ని ప్రదర్శించేవాడు. ఆమె తప్పులు ఎత్తి చూపేవాడు. పాపం ఆమె మాత్రం ఏం చేయగలదు? దుర్గుణాలను ప్రవేశించకుండా నిరోధించటానికి, ఆమెకు కొడుక్కున్నంత సునిశిత దృష్టి, ఆలోచనా సరళి, ఆదర్శ భావాలూ లేవు. కొడుక్కున్నంతటి విలక్షణ వ్యక్తిత్వం, పరిఙ్ఞానం ఆమెకు లేవు. కాని కొడుకు గుండె కంటే వెన్నపూసలాంటి మనసున్నది. అందుకే ఆమెలో దైవత్వం పోలేదు.

రాక్షసపుత్రి వివాహం జరిగింది. దేవపుత్రుడు ఒక రాక్షసమూర్తి తమ ఇంటినుంచి కదిలిందని ఆనందించాడు. దేవత మాత్రం తన కూతుర్ని విడిచిపెట్టాల్సివస్తోందని ఏడ్చింది. అదీ తల్లీ కొడుకుల మనస్తత్వాల్లోని బేధం. రాక్షసునికి మాత్రం ఎప్పటిలానే దేవత కన్నీళ్ళు చూసి ఏడుపొచ్చింది.

రోజులు గడచాయి. దేవపుత్రుడు తనపై తల్లితండ్రులు ప్రేమను కురిపిస్తున్నా విదుల్చుకుంటున్నాడు. అతడికి వారి ప్రేమ కంటకంగా తోచింది. ఇద్దరి దగ్గరా ఒక్కలానే దురుసుగా ప్రవర్తించేవాడు. తల్లి దేవతని, ఆమె దైవత్వాన్ని ఏ మాత్రం కోల్పోలేదని అతనికి తెలుసు. అయినా ఆమెలో కొన్ని దుర్గుణాలని చూసి ఓర్వలేకపోయేవాడు. కొడుకు ప్రవర్తనకు వారెంతగానో నొచ్చుకున్నారు. అయినా ప్రేమ కురిపించటం మానలేదు.

ఓ రోజు దేవతకు జబ్బు చేసింది. రాక్షసునికి ఏడుపొచ్చింది. దేవకుమారునికి మరింత ఏడుపొచ్చింది. దేవకుమారుడు తల్లి కాళ్ళపై పడి భోరున విలపించాడు. రాక్షసుడు మాత్రం నిగ్రహించుకున్నాడు. తన భార్య మగవారంతగా ఏడవకూడదని చెప్పినట్లు అతనికి గుర్తుంది. రాక్షసపుత్రికి మాత్రం అది తన కుటుంబం కాదేమోననిపించింది. చిన్నప్పుడు దేవకుమారుడు తల్లితండ్రులతో దురుసుగా ప్రవర్తిస్తే తానెలా మందలించేదో, తల్లితండ్రులపై తాను ఎంత ప్రేమ ప్రకటించేదో అవన్నీ మరచిపోయింది. అయినా బాగుండదేమోనని కన్నీళ్ళు కార్చింది.

దేవతకి చివరి రోజులు సమీపించాయి. దేవపుత్రునికి విపరీతమైన ధుఃఖం కలుగుతోంది. రాక్షసునికైతే పిచ్చి పట్టేట్లుంది. దేవత కొడుకుని పిలిచి అద్దం తెమ్మంది. ఆ అద్దంలో ఒకసారి తన ముఖాన్ని చూసుకుంది. కళావిహీనంగా ఉన్న ముఖంతో శవంలా కనపడుతోంది. నెమ్మదిగా నోరు తెరచి చూసుకుంది. నిజమే! కొడుకు చెప్పినట్లు ఆమెకు దవడలపై దంతాలు చిన్న కోరల్లా రూపుదిద్దుకున్నాయి. ఒకప్పటి తన మనోహరమైన గంధర్వ రూపాన్ని గుర్తుకు తెచ్చుకుంది. ఎంతగానో కుమిలిపోయింది. అయినా భర్తపై క్రించిత్ ద్వేషమైనా కలుగలేదు.

కొడుకుని అక్కున చేర్చుకుని అతడి నుదుటిని ముద్దాడింది. కూతురి వైపు శెలవన్నట్లు చూసింది. భర్తను దగ్గరకు పిలిచి అతని పాదాలపై పడి ప్రాణం విడిచింది. రాక్షసునికి ఒక్కసారిగా తన పాదాల క్రింద భూమి కంపించినట్లనిపించింది. తూలిపోబోయి నిభాయించుకున్నాడు. అతనికి శ్వాస ఆడటం లేదనిపించింది. 'గాలి స్తంభించిందా?' అన్నట్లు వెర్రి చూపులు చూసాడు. దేవకుమారుడు తల్లి శవాన్ని చూసి చచ్చేంతగా ఏడ్చాడు. ఆ ఏడుపుకి అతని దవడలు నొప్పి కలిగి చచ్చుబడినట్లనిపించాయి. అయినా అతడు ఏడుపు ఆపలేదు.

రాక్షసపుత్రి పోయిన వాళ్ళ కోసం వేదన ఎందుకని ఓదార్చి, ఎక్కువ రోజులుంటే భర్త బెంగ పెట్టుకుంటాడని చెప్పి వెళ్ళిపోయింది.

రాక్షసుడు ఆ రోజంతా విరక్తి కలిగిన వదనంతో అలోచించాడు. అతనికి లోకం, భవిష్యత్తూ అన్నీ శూన్యంలా కనిపించాయి. దేవతలేని జీవితం వ్యర్ధంలా కనిపించింది. చచ్చిపోదామనుకున్నాడు. అంతలోనే కొడుకు గుర్తుకొచ్చాడు. పుత్రునిలో అతనికి భార్య కనిపించింది. తాను ఎందుకు జీవించాలో రాక్షసునికి అర్ధం అయ్యింది.

అయితే దేవపుత్రుడు తల్లి లేని ఇల్లు స్మశానమన్నాడు. ఆ స్మశానంలో తాను ఉండలేనన్నాడు. తల్లే పోయినప్పుడు తనకు మిగిలిన వాళ్ళు అఖ్ఖరలేదన్నాడు. రాక్షసుడు కలత చెందాడు. కొడుకు దగ్గర ఏడ్చుకున్నాడు. గడ్డం పట్టుకుని బ్రతిమాలాడు. దేవపుత్రుడు శాంతించాడు. అయితే తండ్రి రాక్షసులతో కలవకూడదని షరతు విధించాడు. సరేనని ఒప్పుకున్నాడు రాక్షసుడు.

కొన్నాళ్ళు గడచాయి. ఓ రోజు ఉదయం దేవపుత్రుడు బయటకు వెళ్ళి సాయంత్రానికి ఇల్లు చేరుకున్నాడు. ఇల్లంతా కోలాహాలంగా ఉంది. 'ఏంటా?' అని చూస్తే ఇల్లంతా రాక్షసులతో సందడిగా ఉంది. రాక్షసులంతా తన తల్లి పటం ఉన్న గది లో మాంసాలు తింటున్నారు. తనకూ, తన తల్లికీ నీచు వాసన కూడా పడదన్న విషయం దేవపుత్రునికి గుర్తుకు వచ్చింది. అయినా తల్లి తన తండ్రి కోసం అప్పుడప్పుడు మాంసం వండటం గుర్తుకువచ్చింది. పళ్ళు బిగబట్టాడు. కోపంగా తండ్రి వైపు చూసాడు. తండ్రి రాక్షసుల మధ్యన ఆనందంగా ఉన్నాడు. రాక్షసులంతా తన తండ్రిని 'వాజమ్మ' వంటున్నారు. తన తండ్రి బుర్రాడిస్తున్నాడు. అతనిలో ఆవేశం కట్టలు త్రెంచుకుంది. రాక్షసులంతా వెళ్ళిపోయాక తానూ ఇల్లు విడిచి వెళ్ళిపోవటానికి నిశ్చయించుకున్నాడు. బయలు దేరిన కొడుకుని చూసి రాక్షసునికి భయం వేసింది. వెళ్ళవద్దని ఏడ్చాడు. దేవపుత్రుడు చలించలేదు. కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడ్డాడు. దేవపుత్రుడు శాంతించాడు. తండ్రికి చివరి అవకాశాన్ని ఇచ్చాడు. రాక్షసుడు ఊపిరి పీల్చుకున్నాడు.

మరి కొన్నాళ్ళు గడిచాయి.

రాక్షసులు తమ సోదరుడ్ని తమ వైపు తిప్పుకోవటానికి ప్రయత్నించారు. అతడిని నానారకాలుగా మభ్యపెట్టారు. రాక్షసుడి మనస్సు లాగినా, కొడుకు కోసం ఆ కోరిక అణగద్రొక్కుకున్నాడు. 'వాజమ్మ'వన్నారు రాక్షసులు. అతడు బుర్రూపాడు.

కాలం గడిచే కొద్దీ రాక్షసుడు కొడుకు మాటను పెడచెవిన పెట్టాడు.

ఓ రోజు దేవపుత్రుడు ఇంటికి వచ్చేసరికి తండ్రి కనిపించలేదు. 'వెర్రి తండ్రి ఏమయినాడా?' అని దేవపుత్రుడు ఎంతగానో కలవరపడ్డాడు. తనకు తెలిసిన ప్రదేశాలన్నింటా వెతికాడు. చివరకు తన తండ్రి రాక్షస నగరంలో తన వారి మధ్య కేరింతలు కొడుతూ కనిపించాడు. రాక్షసులు తన తండ్రిని 'వాజమ్మ' అంటున్నారు. తండ్రి బుర్రూపుతున్నాడు. తండ్రికి తన అవసరం లేదనిపించింది. వెంటనే వెనుదిరిగాడు దేవపుత్రుడు. రాక్షసుడది గమనించాడు. అతడి గుండె గుభేలుమంది. గభాల్న కొడుకు వద్దకు వచ్చి క్షమించమని ప్రాధేయపడ్డాడు. కొడుకు కాళ్ళపై పడి పసిపిల్లవానివలే ఏడ్చాడు. కొడుకు లేకపోతే చచ్చిపోతానన్నాడు. దేవపుత్రుడు చలించలేదు. తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు.

రాక్షసునికి ఉన్న ఒక్క ఆశ అడుగంటినట్లనిపించింది. ఆఖరి దీపం కూడా ఆరిపోయినట్లనిపించింది. ఆకాశం నుంచి దేవత తనను పిలుస్తున్నట్లనిపించింది. కొడుకు తనని విడిచి పోవటం మరోసారి గుర్తుకు తెచ్చుకున్నాడు. తను చూసిన కొడుకు చివరి రూపాన్ని మరోసారి గుర్తుకుతెచ్చుకున్నాడు. మళ్ళీ అంతలోనే తన భార్య చితి గుర్తుకువచ్చింది. తను అప్పుడు ఎంతగా ఏడ్చాడో గుర్తుకుతెచ్చుకున్నాడు. తన ముద్దుల కూతురి ప్రవర్తన, తనవారైన రాక్షసుల అభిమానం గుర్తుకువచ్చింది. మరింత ముందుకు పోయి, దేవతతో తనకు జరిగిన వివాహాన్ని, మొదటి సంతానాన్ని గుర్తుకుతెచ్చుకున్నాడు. వివాహం జరుగుతున్నప్పుడు సిగ్గు పడుతున్న దేవత వదనం అతని కళ్ళ ముందు ప్రత్యక్ష్యమయ్యింది. అంతలోనే చనిపోయేటప్పుడు ఆమె ముఖం ఎంత వికృతంగా తయారయ్యిందో ఙ్ఞప్తికి వచ్చింది. ఏడుపొచ్చింది. చచ్చిపోదామనుకున్నాడు.

రాక్షసులు అతడిని చుట్టుముట్టారు. దేవతలతో పూర్తిగా తెగతెంపులు అయినందుకు సంతోషించమన్నారు. మౌనంగా తలాడించాడు. తినమంటూ మాంసం తెచ్చి ఇచ్చారు. భార్య కోసం మానలేకపోయినా, కొడుకు కోసం అన్నాళ్ళనుంచి తినటం మానేసిన మాంసాన్ని చూసి అతనికి నోరూరింది. ఆబగా తిన్నాడు.

'వాజమ్మ'వన్నారు రాక్షసులు.

బుర్రూపాడతడు.

రాక్షసుల మధ్యకు చేరి కేరింతలు కొట్టాడు. ఇప్పుడతనికి తన దేవత, పుత్రుడు గుర్తులేరు. వారిని పూర్తిగా మరచిపోయాడు.

రాక్షసుల మధ్యన చేరి, తిరిగి రాక్షసుడైపోయాడు.

విస్మరింపబడిన వివేకుని విశ్వసందేశం

'వివేకానందుడు' - ఈ పేరు వినగానే భరతమాత పులకిస్తుందనటం అతిశయోక్తి కాదేమో! అయితే ప్రస్తుత ఆధునిక యాంత్రిక జీవనంలో ఎంత మందికి వివేకుని ఆదర్శాలు తెలుసు? అతడు ప్రపంచానికి ఏమి చెప్పాలనుకున్నాడో నేటి విద్యావిధానాలు ఎలాగూ అందించవు. ఆసక్తితో తెలుసుకోవాలనుకునే వారికి వందలకొద్దీ పేజీలతోనున్న పుస్తకాలు డీలా పరుస్తాయి. అందుకే క్లుప్తంగా వివేకానందుని ఆదర్శాలు తెలుసుకుందాం.


1893 కాలంలో ప్రపంచానికి వివేకానందుడు ఇచ్చిన సందేశం ఏమయ్యుంటుందో అలోచించారా?

అధిక శాతం పశ్చిమ దేశస్థులు ఆ సందేశాన్ని ఒక అద్భుతమైన యోగా సిధ్ధాంతాల పరిచయంగా పేర్కొంటారు. భారతీయులు ప్రపంచానికి పరిచయం చేయబడ్డ నిజమైన హిందుత్వంగా భావిస్తారు. మరికొంత మంది వివేకానందుడు తన గురువు రామకృష్ణ పరమహంస కోరిక మేరకు ఒక విశ్వ మతాన్ని సృష్టించే ప్రయత్నమంటారు. వీరందరి అభిప్రాయాల్లో కొంత నిజమున్నప్పటికినీ స్వామీ వివేకానందుడు చెప్పదలుచుకున్న నిజమైన సందేశం ఇవి కావు.

కొంత మంది కమ్యూనిస్టులూ, క్రైస్తవులూ మరో అడుగు ముందుకేసి, స్వామిని తమ ధృక్పధం నుంచి చూడ ప్రయత్నించారు. వీరు వివేకానందుని సంఘసంస్కర్తగా, అణగారిన, వెనుకబడిన వర్గాల ఉధ్ధరణకు నడుంబిగించిన వ్యక్తిగా (హిందుత్వ వ్యతిరేక ముద్రతో) వారికి అనుకూలమైన దృష్టిలో చూసారు. అయితే వీరి వాదనలకు అంతగా ప్రాముఖ్యత లభించలేదు.

స్వామి యోగా ని ప్రవచించటం నిజమే! కానీ అతని ముఖ్యోద్దేశం అది కాదు. స్వామి పేర్కొన్న భౌతిక యోగాసనాల వల్ల తమకు ‘లాభం' ఉంది కనుక అవి మాత్రమే ప్రపంచ ప్రాచుర్యం పొందాయి. ఇప్పటికినీ పశ్చిమ దేశాల్లో యోగా భోధకులు, స్వామి ఫొటొ పెట్టుకుని, కేవలం యోగాసనాలకే ప్రాచుర్యం కల్పిస్తూ లబ్ది పొందుతున్నారు.

వివేకానందుడు పరిచయం చేయ సంకల్పించింది అత్యుత్తమ మానవీయ విలువలతో కూడిన వేదాంత సారాంశం, ఆత్మ, సత్య శోధనా విధానాలూనూ. వీటిని ఇప్పుడు సమీక్షిద్దాం!

జ్ఞానయోగం: వివేకానందుడు వేదాంతాలు చాటి చెప్పిన 'అహం బ్రహ్మస్మిః' (నేనే దేవుడను) సిధ్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేసాడు. వేదాంతాల ప్రకారం అన్ని శాస్త్రాల, మతాల పరమార్ధం జ్ఞాన సముపార్జన. జ్ఞానం అంటే ప్రకృతిలోనూ, విశ్వంలోనూ, అన్ని భౌతిక పదార్ధాలలోనూ ప్రవహించే అవిభాజ్యమైన, అఖండమైన ఆత్మ స్పృహను గుర్తించటం.

వివేకానందుడు ముఖ్యంగా ప్రవచించిన జ్ఞానయోగం ఈ విధమైన వేదాంతసారాన్ని అందిస్తుంది కానీ భౌతిక యోగాసనాలను కాదు.

భక్తియోగం: ఇది కూడా ఒక ముఖ్యమైన అవసరంగా వివేకానందుడు పేర్కొన్నాడు. ఇందులో హిందూ దేవుళ్ళయిన శివుడు, పరాశక్తి స్తోత్రోఛ్ఛారణలకు, ఓంకారానికి గల ప్రాముఖ్యతలను విశదీకరించాడు. (అయితే భారత దేశానికి చెందిన మరొక ఆధ్యాత్మికవాది తీర్థ రాముడు కొంత మేరకు ఈ భక్తి యోగతో విభేదించాడు. ఈయన భోధనలు కూడా బహు ఆసక్తి కరంగా ఉంటాయి. తీర్థ రాముని గురించి పూర్తి వివరాలు రాబోయే టపాల్లో తెలుసుకుందాం.)

రాజయోగం: ఇది సూక్ష్మ గ్రహణత పెంపొందించుకునేందుకు నిర్దేశింపబడినది. రాజయోగం ప్రకారం, మనసుని, సంకల్పాన్ని ఆధీనంలో ఉంచుకోవటం ద్వారా ఆత్మ విశ్వాసాన్ని, తద్వారా వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవచ్చును. ఏకాగ్రతకు సంబంధించిన వివేకానందుని అనుభవాలు ఈ రాజయోగం వర్గానికి చెందినవి.

కర్మయోగం: ఇది శ్రమనుద్దేశించినది. ఇందులో నిరంతర శోధన, మనిషిలోని అంతఃశక్తి నిర్వచింపబడినవి. ఫలితాన్ని ఆశించకుండా ఆచరించాల్సిన బాధ్యతలు, కార్యాలు ఈ కోవలోనికి వస్తాయి.

హఠయోగం: ఆరోగ్య సిధ్ధికై ఉపయోగ పడే భౌతిక ఆసనాలు(ప్రాణాయామం మొదలైనవి) ఈ కోవలోనికి వస్తాయి.

వివేకుడు అందించిన మిగిలిన యోగాలతో పోల్చి చూస్తే హఠయోగం అల్ప ప్రాముఖ్యత కలిగినది. జ్ఞాన, భక్తి, రాజ, కర్మ యోగాలను ఆచరించిన వారు తమ క్రమశిక్షణనూ, ఆరోగ్యాన్నీ ఆధీనంలో ఉంచుకుని తద్వారా మనో నిబ్బరాన్ని పొందేటందుకు ఉద్దేశించబడినదీ హఠ యోగం.

అయితే దురదృష్టవశాత్తూ అత్యుత్తమ యోగసాధనాలను విడిచి పెట్టి, ప్రపంచం ఆరోగ్యపరంగా తమకు లబ్ది చేకూర్చే హఠయోగాన్ని మాత్రమే అక్కున చేర్చుకుంది.

ఈ విధమైన వివేకానందుని పూర్తి జీవితం, అత్యుత్తమ హిందూవేదాల ఆధ్యాత్మికతకు దర్పణం. ఇతడు తన ఆధ్యాత్మిక భోధనలతో హిందువులను ఉత్తేజపరచి హిందూ ఆచారాలకూ, సంస్కృతికీ గౌరవం దక్కేలా కృషి చేసాడు. వేద, పురాణ, ఉపనిషత్తుల, చారిత్రాత్మక, ఇతిహాస, తంత్ర్యాలతో కూడిన ఇతని తర్కాలూ, ఉపన్యాసాలు హిందూ సంస్కృతి మొత్తాన్నీ ఒక్క తాటి పై తీసుకురాగలిగాయి. వివేకానందుని కాలానికే చెందిన ఎంతో మంది మహానుభావులూ, అభ్యుదయవాదుల వలే ఇతను తన హిందుత్వ జాతీయతను దాచుకోలేదు. ఆసియాలోని మిగిలిన ఆధ్యాత్మిక సంస్కృతులకంటే, పశ్చిమ దేశాల సంస్కృతులకంటే ఎంతో ఉన్నతమైన హిందుత్వ విలువలను ఎలుగెత్తి చాటాడు.

భారతీయులకు స్నేహ హస్తాన్నందించమని ప్రపంచాన్ని అభ్యర్ధించిన వివేకుడు, ఆ సహాయాన్ని ఆర్ధికపరమైన, మౌళిక విషయాలకు పరిమితం చేసాడు తప్పితే ఆధ్యాత్మిక, మతపరమైన విషయాలకై కాదు. (వీటిని కొంత మంది అనుకూలవాదులు వివేకానందుడు భారత దేశ సాంఘిక దురాచారాలను రూపు మాపటానికై ప్రపంచాన్ని అర్ధించాడన్న రకాన కధలల్లారు.)

హిందూ సందేశాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలన్న తపనతో ప్రపంచం నలుమూలలా ప్రయాణించి, మన సంస్కృతి విలువలనూ, ఆధ్యాత్మిక భోధనలనూ చాటి చెప్పాడు. వివేకానందుడు విభేదించిన కుల, లింగ విచక్షణ మరియూ సాంఘిక దురాచారాలు వేదాంత పరిధిలో వ్యక్తమైనవే తప్పితే, వామపక్ష్యవాదులూ, క్రైస్తవులూ పేర్కొనేటట్లు హిందూ వ్యతిరేకతతో కాదు. హిందూ సాంఘిక దురాచారాలను రూపుమాపటానికి వివేకానందుడు ఏనాడూ, ఏ ప్రపంచ సాయం ఆశించలేదు. తన తత్వాలను, తర్కాలను ఇతరులతో పంచుకుని ఆనందపడ్డాడే తప్ప, వారిపై రుద్దటానికి ప్రయత్నించలేదు.

వివేకుడు విశ్వమానవుడు. అన్ని మతాల వెనుకా, అన్ని తత్వాల వెనుకా, అన్ని శాస్త్రాల వెనుకా, ఉన్న సత్యం ఒక్కటేనని భోదించాడు. ప్రపంచంలో ఇతర మతాలనందు కనిపించిన మంచిని వివేకుడు సంతోషంగా అంగీకరించాడు. ఈయన భోధనల్లో బౌధ్ధ, క్రైస్తవ, ఇస్లాం మతాలలోని ఉన్నతమైన సారాంశాలు కూడా చోటు చేసుకున్నాయి. పశ్చిమదేశాల శాస్త్రీయతనూ, తర్కాలలోనున్న నిబధ్ధతనూ, గొప్పదనాన్ని నిస్సంకోచంగా ఒప్పుకున్న వివేకానందుడు స్వేఛ్ఛాయుతమైన ఆలోచనలను ఎల్లప్పుడూ గౌరవించి ఆదరించాడు.

అయినంతమాత్రాన స్వామి ఇతరమతాలను హిందుత్వంతో సమానంగా స్వీకరించాడనుకోవటం పొరపాటే. స్వామి పశ్చిమదేశాలలోని క్రైస్తవ మతాధికారాలను నిర్భయంగా ప్రశ్నించాడు. ఇవి ఆయా దేశాలలో వివాదాస్పదం కూడా అయినాయి. భారతదేశంలో మిషనరీలు చేసే మతమార్పిడిలను నిర్భీతిగా అడ్డుకున్నాడు. ఇస్లాం మత సోదరభావాన్ని అంగీకరిస్తూనే మహ్మద్ ప్రవక్తను ప్రశ్నించాడు. ఇస్లాం మతవ్యాప్తిలో భాగంగా హిందువులపై శతాబ్దాల తరబడి జరిగిన హింసాకాండను ఖండించాడు. మతాలకు అతీతంగా బ్రతికే కొందరు యూరోపియన్ల భౌతిక స్వార్ధపరాయణత్వాన్ని, అవకాశవాదాన్ని విమర్శించాడు.

వివేకానందుడు ప్రకటించిన విశ్వమతం ఆధునీకరణం చేయబడిన హిందుత్వ వేదాంతాల యొక్క సత్య సారాంశం. ఈ విశ్వమత ప్రతిపాదనలో స్వామి హిందుత్వాన్ని త్యజించలేదు. మతాలకు అతీతంగా ఆచరణ సాధ్యమైన అత్యుత్తమ ఆధ్యాత్మిక వేదాంతాన్ని మానవాళికి పరిచయం చేయ సంకల్పించాడు.

హిందుత్వాన్ని అన్ని మతాలకూ మాతృమూర్తిగా అభివర్ణించాడే తప్ప మిగిలిన మతాల గాటిన కట్టలేదు. ఏ సంస్కృతినైనా తనలో కలుపుకోగలిగిన విశాల మనస్వినిగానే హిందుత్వాన్ని గర్హించాడు.

వివేకుని ప్రకారం, వేదాంతం అన్నది మేధావులో, ప్రపంచానికి వేరుగా జీవించే సాధువులో మాత్రమే ఆచరించేది కాదు. ఆచరణీయమైన వేదాంతాన్ని, ఆత్మ స్పృహ కొరకు నిత్యజీవితంలో సగటు మానవుడు అభ్యసించగలిగే శాస్త్రంగా పేర్కొన్నాడు. ఈ ఆచరణయోగ్యమైన వేదాంతం స్వేఛ్ఛాయుత ఆలోచన, వ్యక్తిత్వ వికాసంలతో కూడి ఎదుటివారిలో దైవత్వాన్ని గుర్తించగలిగినది.

ఈ సిధ్ధాంతం ప్రకారం, ఏ ఒక్కరూ బలహీనులు కారు. 'నేను' అంటే ఈ భౌతిక దేహమో, మన అలోచనో కాదు. 'నేను' అనునది ఒక ఆత్మనో, భగవంతుని బిడ్డనో కూడా కాదు.

'నేను' అనునది 'భగవంతుడు'. ఇంకా స్పష్టంగా భగవంతుని కంటే గొప్పవాడు. భగవంతునికన్నా గొప్పదైన శక్తికి విభాజ్యత ఉండదు. కనుకనే మనుషులందరిలోనూ, సృష్టి స్థితిగతులలోనూ, ప్రకృతి లయజతులలోనూ, విశ్వంలోనూ అవిభాజ్యంగా అఖండితంగా ప్రవహిస్తున్న 'నేను' ఒక్కటే! దీనికి బహువచనం లేదు.

ఈ సత్యం అర్ధమయ్యేందుకు ఓ చిన్న కధ చెప్పుకుందాం:

ఒక పసివాడు అద్దంతో ఆడుకుంటున్నాడు. ఆ అద్దం క్రిందపడి ముక్కముక్కలయ్యింది. పిల్లవాడు పాకురుకుంటూ వెళ్ళి చూడగా, ప్రతి ముక్కలోనూ అతని దరహాస ప్రతిబింబం కనిపిస్తోంది. అతనికి ఎన్నో 'నేను'లు కనిపిస్తున్నారు. ఆ పసివాడు తన చేష్టలతో వారందరితోనూ ఆడుకుంటున్నాడు. అందులో కనిపిస్తున్న వారందరూ తానొక్కడినేనన్న సత్యం తల్లి చెప్పినా కూడా అర్ధం కాదతనికి. సరిగ్గా ఈ పసివాని మాదిరిగానే మనమందరం మనలో ప్రవహించే 'నేను' ఒక్కటేనన్న సత్యాన్ని గ్రహించలేకున్నాం.

మనుషులందరిలోనూ, పశుపక్ష్యాదులలోనూ, వృక్షాలలోనూ, సృష్టి స్థితిగతులలోనూ, ప్రకృతి లయజతులలోనూ, విశ్వంలోనూ, కాలంలోనూ అవిభాజ్యంగా అఖండితంగా ప్రవహిస్తున్న 'నేను' ఒక్కటే! దీనికి బహువచనం లేదు. ఇది లేని ప్రదేశం లేదు. దీనికి చావు పుట్టుకలు లేవు.

మన జీవిత పరమార్ధం ఈ 'నేను'ని గ్రహించటంలోనే ఉన్నది తప్పితే భౌతిక వాంఛలలోనో, ఈ అధికార, వస్తు వ్యామోహాలలోనో కాదు. వేదాంతాలలోని, హిందుత్వలోని ఉన్నత విలువలను నేటి ఆధునిక ప్రపంచానికి అనుగుణంగా చెప్పిన స్వామీ వివేకానందుడు ఈ ప్రక్రియలో దేనికీ తలవంచక, రాజీ పడక నిర్భయంగా సత్యాన్ని ప్రకటించాడు. సంస్కృతంలో పాండిత్యం సంపాదించిన ఈతడు, సంస్కృతంలో లిఖించబడిన ఎంతో విలువైన, మహోన్నతమైన వేదాంత సారాన్ని సామాన్య మానవునికి అర్ధమయ్యే రీతిలో వర్ణించాడు.

వివేకానందుని గౌరవించటం అంటే తరతరాల మన హిందుత్వాన్ని గౌరవించుకున్నట్లే!

అయోధ్య వివాదం - ప్రసారమాధ్యమాల పాత్ర

పర్ణశాల బ్లాగునందు ఈ వారం మహేష్ వెలిబుచ్చిన అభిప్రాయం ఇదీ(యధాతధంగా)...!

బాబ్రీ మసీదు స్థలంలో ఒకప్పుడు రాముడి కొడుకు కుశుడు కట్టించిన దేవాలయం ఉండేది. అనే అధారరహిత చరిత్ర, అపాయకరమైన చరిత్ర, భారతీయ సమగ్రతకు గొడ్డలిపెట్టులాంటి చరిత్ర.

ఈ వ్యాఖ్య నన్నెంతో కలచి వేసింది. నేను మొదలు పెడదామనుకున్న 'హిందూ ఆధ్యాత్మిక వాదుల' పరిచయాన్ని ప్రక్కన పెట్టించి, ఈ వ్యాసాన్ని రాసేందుకు పురిగొల్పింది.

- బృహఃస్పతి


హిందుత్వానికి వేరే దేశాలపై దండెత్తిన చరిత్ర లేదు. మిషనరీల పేరిటగానీ, మరేవిధంగానో గానీ ఇతర దేశాలకు పోయి అక్కడి వారి మతాన్ని ప్రేతమనో సైతాననో ప్రచారం చేసి హిందుత్వాన్ని మాత్రమే ఆచరించమని బలవంతం చేసిన సంఘటనలు అసలే లేవు. ప్రక్కదేశాలలో కోలనీ వ్యవస్థలను స్థాపించి, అక్కడి వారిని ఆర్ధికంగా దోచుకున్న ఘటనలు క్రించింత్ కూడా లేవు. హిందువు ఏనాడూ కూడా సత్యంగానీ, భగవంతుడు గానీ కేవలం తమకు (హిందువులకు) మాత్రమే చెందుతాడని, మిగిలిన వారు పాపులని చాటిన దాఖలాలు లేవు. హిందూ చరిత్రను తరిచి చూస్తే సహనం, పరమత ఆదరణ ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ఏ ఇతర మతమూ ఎరుగనివి.

ఐతే దురదృష్టవశాత్తూ ఈనాడు ప్రసార మాధ్యమాల్లో హిందూ వ్యతిరేకత అన్నది సర్వ సాధారణ విషయంగా మారింది. ఈ విధమైన హిందూ వ్యతిరేక భావనలు బహు కొద్ది మంది చేత మాత్రమే ఖండించబడుతున్నాయి.

1992 డిసెంబరులో జరిగిన అయోధ్య సంఘటనను ఇప్పుడు పరిశీలిద్దాం. ప్రపంచం అంతటా (భారతీయ మాధ్యమాలతో పాటుగా) “హిందూ తీవ్రవాదులు మసీదును కూలగొట్టారు" అంటూ కోడై కూసి హిందువులను అటు తీవ్రవాదులగానూ, ఇటు మసీదును నాశనం చేసిన వారిగానూ నిలబెట్టిన ఈ ఘటన పూర్వ పరాలను పరిశీలిద్దాం.

4 శతాబ్దాల క్రిందట మధ్య ఆసియాకు చెందిన ముస్లిం చక్రవర్తి నిర్మించిన ఒక కట్టడాన్ని హిందూ వర్గానికి చెందిన వారు కూల్చివేసారన్నది కాదనలేని సత్యం. ఈ కట్టడం గతంలో సుమారు (60-65 ఏళ్ళ క్రిందట) మసీదుగా ఉపయోగించబడినది. చివరిసారిగా ఇక్కడ ముస్లింలు 1945 ప్రాంతాంలో నమాజునాచరించారు. తరువాతి నాళ్ళలో ఈ అయోధ్య మసీదు లేదా బాబ్రీ మసీదు కేవలం హిందువుల మత కార్యక్రమాలకై మాత్రమే ఉపయోగించబడుతున్నది.

1949 వ సంవత్సరంలో ఇక్కడ రాముని ప్రతిమలు స్థాపించబడ్డాయి. కాకపోతే అప్పటికే కట్టబడిన మసీదు నిర్మాణాలను కూల గొట్టకుండా ఆ ప్రక్కన ఈ ప్రతిమలు ప్రతిష్టించారు. ఈ కట్టడం యొక్క నిర్మాణం నిజమైన మసీదుని పోలి ఉండదు. గోపురాలు(మీనార్), గూళ్ళు వంటి మసీదు పరమైన నిర్మాణాలు ఇక్కడ లేవు (గూగుల్ లో ఫోటోలు చూడండి) వీటన్నిటికీ మించి, ఈ స్థలం హిందువులు పవిత్రంగా భావించే శ్రీ రాముని జన్మస్థలంగా హిందూ గ్రంధాలలో పేర్కొనబడినది. అయితే కాలక్రమంలో జరిగిన డజన్ల కొద్దీ యుధ్ధాలలో హిందువులు(సిక్కులు కూడా) మొఘలుల నుండి ఈ ప్రదేశాన్ని కాపాడుకోవ యత్నించి అశువులు బాసి చివరకు నిస్సహాయంగా ధారాదత్తం చేసిన ప్రదేశమిది.

ముస్లింలకు సంబంధించి ఈ ప్రదేశం మక్కా లేక మదీనా వంటి పవిత్ర స్థలం కాదు. అయితే హిందువులకు సంబంధించి ఇది ఏడు అత్యంత పవిత్ర స్థలాలలో(sacred) ఒకటి.

కనుక ఈ స్థలాన్ని మసీదు అనడం అసంబధ్ధం. బహుశా ఒక 'వివాదాస్పద స్థలం' అని ఉన్నా సమంజసమేనేమో!

అయితే ఏ ప్రసారమాధ్యమమూ కూడా హిందువులు ఒక వివాదాస్పద కట్టడాన్ని కూల్చారన్న వార్తను ప్రజలకు చేరవేయలేదు. ఎందుకంటే ఇలా చెప్తే వారికి కావలసిన 'మసాలా కధ' దొరకదు. ఫలితం ప్రసారమాధ్యమాలు హిందువులు ముస్లిం సోదరుల యొక్క మనోభావాలను దెబ్బతీసారన్న గగ్గోలునే కాక హిందువులపై తీవ్రవాదులన్న అపవాదును మోపి తదనంతరం జరిగిన మరెన్నో హింసాజ్వాలలకు ఆజ్యం పోసారు.

వేయి సంవత్సరాల పైబడి, అలుపెరగని ముస్లిం చక్రవర్తుల దండయాత్రలలో కొన్ని లక్షల హిందూ దేవాలయాలు ధ్వంసమయ్యాయి. క్రీస్తు శకం 6-7 వ శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికులు (హుయాన్ త్సాంగ్ మొదలగువారు) తమ దేశానికి అందించిన చరిత్ర లెక్కల ప్రకారం ఉండాల్సిన ఎన్నో- ఎన్నెనో హిందూ దేవాలయాలూ, బౌధ్ధ, జైన కట్టడాలూ ఇప్పుడు ఆనవాళ్ళకు కూడా దొరకవు. ఇవేవీ సహజ సిధ్ధంగా నేలమట్టమవలేదు. రాత్రికి రాత్రి మాయమవనూలేదు. ముస్లిం చక్రవర్తుల సంకల్పానుసారం హిందువుల విశ్వాసాలను దెబ్బకొట్టే ప్రయత్నంలోనూ, ఆ దేవాలయాల్లోనున్న వజ్ర, వైఢూర్య, రతనాల సంపదలను కొల్లగొట్టే ప్రయత్నంలోనూ జరిగినవి.

ఇందులో భాగంగానే హిందువులు పవిత్రంగా భావించే శ్రీకృష్ణ, శ్రీరామ జన్మస్థానాలు దారుణంగా ధ్వంసం చేయబడ్డాయి. ఈ విధ్వంసంతో ఆగక ఈ పవిత్ర హిందూ కట్టడాలకు ఉపయోగించిన రాళ్ళను ఆ ప్రక్కనే మసీదు కట్టడాలలో (మధుర కు వెళ్ళిన వారికి ఇది ప్రత్యక్షానుభవం) ఉపయోగించటం అత్యంత దయనీయమైన విషాద సంఘటన. ఈ హిందూ ఆలయ పూజారులను, ఆ మసీదు ప్రవేశద్వారం వద్ద పూడ్చి పెట్టేవారట. మసీదునందు ప్రవేశించేవారు తమ పాదాన్ని ఈ భూస్థాపిత హిందూ సమాధిపై మోపి వెళితే అదొక విజయసూచికం.

ఈ విధమైన క్రూర చరిత్ర, చాలా మంది చరిత్రనుండి 'లాభాల'ను మాత్రమే ఆశించే 'వ్యాపారులకు' పట్టదు. తమ 'వ్యాపారాపేక్ష'తో 'చరిత్రహీనులు'గా ఉండటమే ఉత్తమమని భావించే వీరికి ఉన్నత విలువలు పట్టవు. రాముడక్కడే పుట్టాడనటానికి అక్కడ DNA ఆధారాలు కావాలంటారు. హిందువులు పది చోట్ల రాముడు పుట్టాడని ప్రకటించలేదు. హిందూ గ్రంధాల ప్రకారం, శిలాశాసనాల ప్రకారం అన్నీ ఏకాభిప్రాయంతో చెప్పిన చోటనే పుట్టాడంటున్నారు. ముస్లిం చక్రవర్తులు కూడా ఈ ఆధారాల అనుగుణంగానే ఒక ప్రణాళిక ప్రకారం హిందూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేసారు. ఏ భావాల, ఇజాల ప్రభావానికి లొంగకుండా, ప్రశాంత చిత్తంతో ఒక్క సారి మీ మనోనేత్రాన్ని తెరచిచూడండి. వేల యేళ్ళగా హిందుత్వ ఆత్మ ఎలా హత్యా యత్నాలకు గురి అవుతోందో మీ హృదయానికి ఖచ్చితంగా కనిపించి తీరుతుంది.

1947 లో ముస్లిం మైనార్టీలకొరకు జరిగిన దేశ విభజన ముఖ్యోద్దేశం హిందువుల పాలనలో జీవించేందుకు ముస్లిం వర్గాల తిరస్కారం. ఈ పరిణామంలో పాకిస్థాన్ లో నున్న అనేక హిందూ దేవాలయాలు ధ్వంసం చేయబడి మసీదులుగా రూపాంతరం చెందాయి. పాకిస్థాన్, బంగ్లాదేశ్ లకు చెందిన ప్రభుత్వాలూ, సైన్యం కూడా ప్రత్యక్షంగా పాల్గొని ఈ ధ్వంసాకాండకు రచన చేసిన సంఘటనలు కోకొల్లలు.

అయితే చరిత్రలో ఈ విధంగా హిందూ దేవాలయాలను కూల్చి మసీదు నిర్మించిన ఘటన ఒక్కటి కూడా వెలుగు సంతరించుకోలేదు. కనీసం అయోధ్య వివాద సమయంలోనైనా ఇటువంటి చరిత్ర ప్రస్తావన ఎవ్వరినీ ఆలోచింపచేయలేదు. ఇందుకు విరుధ్ధంగా తిరిగి హిందువులు తీవ్రవాదులగానూ, మసీదు విధ్వంసకులగానూ ప్రపంచానికి పరిచయం చేయబడ్డారు.

అయోధ్య వివాద సమయంలో కూడా డజన్ల కొద్దీ హిందూ దేవాలయాలు పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో కూల్చివేయబడ్డాయి. బ్రిటన్ మొదలగు భారతేతర దేశాలలో సైతం ఈ విధమైన దాడులు హిందూ దేవాలయాలపై జరిగాయి. అయినప్పటికినీ ఈ వివాదాలు చాలా తేలికగా తీసుకోబడ్డాయి. కారణం, 'మసీదు ధ్వంసానికి తెర లేపినది హిందువులు. కావున తదనంతరం చెలరేగిన హింసా వివాదాలకు (ముస్లిం వర్గాలచే కూల్చబడిన హిందూ దేవాలయాలకు) కూడా హిందువులే బాధ్యులు.'

ఇదీ దాదాపు అన్ని ప్రసార మాధ్యమాలూ కూడా అయోధ్య వివాదాన్ని చూసిన కోణం.

'హిందూ దేవాలయం కూల్చివేత ఎందుకు వార్త కాలేకపోతోంది?' 'ఒక వివాదాస్పద కట్టడం(మసీదుగా భావించే) కూల్చివేత ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ఉనికిని చాటుకుంటుంది?' నిజానికి ముస్లిం వర్గాలు వేరే వర్గానికి చెందిన మసీదులను కూల్చివేసిన సంఘటనలూ ఉన్నాయి. (పాకిస్థాన్లో కూల్చివేయబడ్డ అహ్మదీయ మసీదు). ఇవి సైతం ఎందుకు అయోధ్య సాధించినంతటి వివాదాన్ని పొందలేకపోతున్నాయి?

దీనికి సమాధానంగా తిరిగి ఇలా ప్రశ్నించుకుందాం.

"వేల సంవత్సరాలనుంచీ హిందూ దేవాలయాలు ధ్వంసమవుతున్నప్పటికినీ, ఎందుకు హిందువులు అయోధ్య విషయంలో మాత్రమే కళ్ళు తెరచారు?"

పై ప్రశ్నకు సమాధానం కూడా తరచి చూస్తే అక్కడే లభిస్తుంది.

"ఎవరు సమ్మతించినా, లేకున్నా తరతరాలుగా మనసు పొరల్లో దాగున్న మోసగింపబడ్డామన్న భావన లేదా అన్యాయం జరిగిందన్న బాధ లేదా దోచుకోబడ్డామన్న దుగ్ధ చట్ట పరంగా తగిన న్యాయం లభించనప్పుడు విప్లవంగా ఉబికి వస్తుంది."

ఇది కమ్యూనిస్టులు సైతం అంగీకరించవలసిన నిజం. విప్లవానికి వారిచ్చే నిర్వచనం కూడా ఇదే!

గత అరవై ఏళ్ళ పైబడి ఈ అయోధ్య వివాదం కోర్టు గోడల మధ్య సరియైన తీర్పు వెలువడక నలుగుతుందన్న నిజాన్ని ఏ పత్రికా చూపించ ప్రయత్నించలేదు. కనీసం మన చట్టాలు సైతం ఆ కట్టడం మసీదనో లేదా గుడి యనో నిర్ధారించలేకపోవటం శోచనీయం. ఇలాంటప్పుడు అది వివాదాస్పద కట్టడమే కానీ చట్టపరంగా కూడా మసీదు కాజాలదు.

అణగద్రొక్కబడిన ఎన్నో వర్గాల మాదిరిగానే హిందువులూ మేల్కొన్నారు. జాతి, వర్ణ, లింగ విచక్షణ తదితర వైషమ్యాలలో అణగద్రొక్కబడిన వారు కోపోద్రేకాలకు, కట్టలు తెంచుకునే అవేశానికీ లోనై ప్రవర్తించేటప్పుడు వారిపట్ల చూపే సానుభూతిలో కాసింతైనా హిందువు పొందలేకపోయాడు. కనీసం ప్రసార మాధ్యమాలు సైతం అటుగా దృష్టి సారించలేదు. తరతరాలుగా లభించని న్యాయానికై నిరీక్షించి నిరీక్షించి, ప్రజాస్వామ్య పాలనలో సైతం తమకు న్యాయం జరుగకపోవటంతో హిందువు తనకు తాను న్యాయం చేసుకో యత్నించిన ఘటన ఇది.

ఇది తప్పనో, ఒప్పనో నేను చాటిచెప్పటానికి ప్రయత్నించటంలేదు. ఇది ఒక విప్లవం అంతే! ప్రపంచంలో ఏ మూలనైనా అణగద్రొక్కబడ్డ వర్గాలు ఉద్యమించటం సరియైనట్లైతే, ఇది అందుకు మినహాయింపు కాజాలదు. హిందువు కూడా ఈ దారిలోనే నడిచాడని భావించాలి.

హిందువు అణగద్రొక్కబడిన వర్గం అంటే మీరెవరూ అంగీకరించకపోవచ్చును. ఒక్కసారి చరిత్రను చూడండి. 8 వ శతాబ్దం మొదలుకునీ ముస్లిం, పోర్చుగీసు, బ్రిటిష్ దండయాత్రలలో వర్ణ పరంగా, మత పరంగా, ఆర్ధిక పరంగా సైన్యం ఉక్కుపాదాల క్రింద అణచివేయబడిన చరిత్ర మనది. ఈ విధంగా చరిత్రను తరచి చూస్తే మనం హిందువులెందుకు ధ్వంస రచనకు పూనుకున్నారని ఆవేశపడటం మాని హిందువు ఇన్ని శతాబ్దాల తరబడి దేవాలయ విధ్వంసాలను ఎలా సహించాడని ఆలోచిస్తాం. ఈ తరహా సహనం ప్రపంచంలోని ఏ ఇతర సంస్కృతిలోనూ కనపడదు.

హిందుత్వ వ్యతిరేకతను ప్రసార మాధ్యమాలు ఎంత మేరకు ప్రదర్శిస్తాయో తెలుసుకోవాలనుకుంటే మనం ఓ రెండు ప్రపంచ దేశాలను ఉదహరించి పోల్చి చూడాలి.

అందులో మొదటిది సౌదీ అరేబియా. ఇక్కడ ఇస్లాం తప్ప వేరే మతాన్ని ఆచరించటం చట్టరీత్యా నేరం. ఇతర మత కార్యకలాపాలు కేవలం విదేశీయులకు అందునా బహిరంగం కానీ ప్రదేశాల్లో (అంటే ఇంట్లోనన్న మాట) మాత్రమే అనుమతి లభిస్తుంది.ఇక్కడ మతానికీ, ప్రభుత్వానికీ, రక్షాణా యంత్రాంగానికీ(పోలీసు వ్యవస్థ), సైన్యానికీ తేడా కనపడదు. అన్నీ ఇస్లాం మతాచారాల చట్టాల ప్రకారం నడుస్తాయి. ఇక్కడ సహనం అన్న విధానమే ప్రభుత్వ అజెండాలలోనూ, మత చట్టాలలోనూ ఉండదు. ఇస్లాంకు వ్యతిరేకంగానో లేదూ ఇతర మతాచారాలను బహిరంగంగానో ఆచరించినట్లైతే(సూర్య నమస్కారంతో సహా) చేతులు నరకివేయటం, కళ్ళు పీకివేయటం వంటి క్రూర శిక్షలు అమలవుతాయి. ఎన్నో ఏళ్ళగా ప్రపంచం నలు మూలలా విస్తరిస్తున్న తీవ్రవాద కార్యకలాపాలకు ఇక్కడి నుండే ధనం సమకూరుతోంది. అయినప్పటికినీ సౌదీ మధ్యస్థ ఇస్లామిక్ (moderate) దేశంగానే పేర్కొనబడుతుంది.

సౌదీలోని చట్టాల వంటివి 10% భారతదేశంలో హిందువులకు అనుకూలంగా ప్రవేశ పెట్టినా ప్రపంచం మొత్తం గగ్గోలు పెట్టి ఉండేది. పరిస్థితి యుధ్ధచర్యల దాకా వెళ్ళినా ఆశ్చర్యపడనవసరం లేదు.

అయినప్పటికినీ సౌదీ ఎందుకు ఈ విధమైన గౌరవాన్ని పొందగలుగుతోంది? కారణం అందరికీ తెలిసిందే. ప్రపంచం మొత్తం పెట్రోలు కొరకు సౌదీ పై ఆధారపడి ఉంది. ఈ ఆర్ధికావసరాలు ప్రపంచ ప్రసార మాధ్యమాలను సైతం నిర్దేశిస్తూ ఉన్నత ప్రమాణాలకు తిలోదకాలిప్పించి, పత్రికా విలువలకు నీళ్ళొదిలేలా చేస్తున్నాయి.

మనం వ్యాపారావసరాలకై ఎవరిపై ఆధారపడతామో వారు ఎంతటి నియంతృత్వ ధోరణి ప్రదర్శించినా అది మనలను విస్మరించేలా చేస్తుంది. ప్రతి రంగంలోనూ ఆధిక్యాన్ని చూపే పశ్చిమ దేశాలు భారత దేశం పై ఆర్ధికంగా ఆధారపడిలేవు. అదే సమయంలో భారతదేశం నుంచి తీవ్రవాద రూపంలోనో, మరే విధమైన ఆర్ధిక పరంగానో వారికి ముప్పులేదు. ఈ పరిస్థితి సహజంగానే ప్రభుత్వాలచే పరోక్షంగా నియంత్రించబడే ప్రసార మాధ్యమాలు భారత దేశం విషయంలో ఆచి తూచి వ్యవహరించాల్సిన అవసరం లేకుండా చేసాయి. (అయితే ఈ స్థితి కూడా మారుతుంది. ఛిన్నాభిన్నమైన ప్రస్తుత ఆర్ధిక వ్యవస్థ ప్రపంచదేశాలన్నిటినీ ఒకే స్థాయికి తెచ్చినప్పుడు ఆర్ధికంగా బలోపేతమయ్యే భారత వ్యవస్థ ఈ ప్రపంచ ప్రసార మాధ్యమాలకు కళ్ళెం వేయగలుగుతుంది)

ఇక రెండవ దేశం చైనా. కమ్యూనిస్టు నియంతృత్వంలోనున్న చైనాకు - అమెరికాకూ మధ్యన ఎన్నో ఏళ్ళగా బలమైన వ్యాపార సంబంధాలున్నాయి. అందువల్ల సహజంగానే చైనా వ్యతిరేకత ప్రపంచ ప్రసారమాధ్యమాల్లో కనపడదు. వారి సైనిక పాలన గూర్చి ఏ ప్రపంచ పత్రికా నోరు విప్పదు. చైనా ప్రభుత్వం ఎన్ని అణు ప్రయోగాలు చేసినా, టిబెట్టులో బౌధ్ధులపై అకృత్యాలు చేసినా అవి అంతగా ప్రాధాన్యత సంతరించుకోవు. చైనా ఎందుకు ఈ విధంగా ప్రత్యేక హోదా పొందగలుగుతోంది? సమాధానం, ఆర్ధిక లావాదేవీలూ, విస్తీర్ణత, జనాభా, శక్తి రీత్యా చైనా కున్న బలాబలాలు.

మానవీయ విలువలు, సమస్యలు ఈ విధంగా ఆర్ధిక అవసరాలకు దాసోహమై, ఆర్ధికంగా బలంగా ఉన్న దేశాలు ఏమి చేసినా అది ఒప్పే అన్న పరిస్థితిని తీసుకు వచ్చాయి. ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘనలు సులభంగా క్షమించబడతాయి. 'అర్ధం' చేసుకోబడతాయి.

ఇప్పుడు ముస్లిం దేశాలలోని హిందూ మైనార్టీలను, భారత దేశంలోని ముస్లిం మైనార్టీలతో పోల్చి చూద్దాం.

పాకిస్థాన్ తమ దేశంలోని హిందూ మైనార్టీలను ఏనాడో దాదాపుగా ఏరిపారవేసింది. బంగ్లాదేశ్ లోనున్న హిందూ మైనార్టీలు సమయం దొరికినప్పుడల్లా దోచుకోబడతారు. ఇవేవీ ప్రపంచ మాధ్యమాల చూపుకు సోకవు. 1971-72 లో జరిగిన బంగ్లాదేశ్ విభజన భారతదేశం జరిపిన కుట్రగా వర్ణించే ప్రపంచ ప్రసార మాధ్యమాలు ఆ సంఘటనలో అశువులు బాసిన వారిలో అధికులు హిందువులేనన్న నిజాన్ని చూపవు.

అరబ్ దేశాల్లో హిందువులు బహిరంగ ప్రదేశాల్లో ఏ విధమైన మతపరమైన కార్యకలాపాలను (సూర్య నమస్కారంతో సహా) ఆచరించకూడదని నిషేధిస్తే దానిని భారతదేశంతో సహా ఏ దేశమూ ప్రశ్నించదు. ఈ తరహా విధానం భారతదేశంలో అమలు చేద్దామంటే జరిగే వివాదం తేలిగ్గా ఊహించవచ్చు.

పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి ఇస్లామిక దేశాలు హిందువుల పట్ల ప్రదర్శించిన తీరును భారతదేశం ఏనాడూ ముస్లింల పట్ల ప్రదర్శించలేదు. బంగ్లాదేశ్ నుంచి వలస వస్తున్న, భారతదేశంలో పెరుగుతున్న ముస్లిం జనభాతో మనం ముస్లింల వ్యాప్తికి సహకరిస్తుంటే, పాకిస్థాన్ వంటి దేశాలు హిందువులను పూర్తిగా నిర్మూలిస్తున్నాయి.

ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం, ఏ ఇతర ఇస్లామిక దేశంలోనూ లేనన్ని ముస్లింవర్గాలు మన దేశంలో తమ ఉనికిని చాటుకో గలుగుతున్నాయి. అహమ్మదీయ ముస్లింలు పాకిస్థాన్ నుంచి తరిమివేయబడగా శరణార్ధులై వచ్చిన వీరిని భారతదేశం ఆదరించింది. ఇంత జరిగినప్పటికినీ అయోధ్య వివాదం భారతదేశంలో ముస్లింలపై హిందువులు సాగించిన అకృత్యంగానే మిగిలిపోయింది.

దీనివల్ల అర్ధమైనదేమిటంటే ముస్లింపై హిందువు జరిపే దాడి వార్తకు అర్హమైనది. హిందువుపై ముస్లిం జరిపే అకృత్యం(ఎంత పెద్ద ఎత్తునైనా గానీ) వార్తకు అనర్హమైనది.

పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలలో హిందూ దేవాలయాలను ధ్వంసం చేయటం ఒక వార్త కూడా కాజాలదు. మన దేశంలో వలే అక్కడి ప్రభుత్వాలు ఈ విధ్వంసాలను అడ్డుకునేందుకు ప్రయత్నించవు. కనుకనే ఇది అక్కడ ఏ రకమైన వివాదాన్నీ సృష్టించదు.

ఎన్నాళ్ళీ అసహాయత? ఎందుకీ అసమానత? కారణం ప్రపంచదేశాలకు ఇస్లాం తీవ్రవాద భయం. హిందువుకు తాను హిందువునన్న స్పృహ లేకుండటం రెండవ కారణం. ఈ రెండో కారణానికి మూల కారణం భారతదేశం పై నున్న వామవాద, మార్కిస్టు భావజాల ప్రభావం. విద్యావ్యవస్థలోనూ, ప్రభుత్వ విధానాలలోనూ(చట్టపరమైన, రాజ్యాంగ పరమైన) వీరు నింపిన హిందూ మత వ్యతిరేకత.

వీరు హిందుత్వాన్ని ఒక వర్గంగానూ, విగ్రహారాధన మొదలైన అనాగరిక దురాచారాలతో నిండిన మౌఢ్యంగానూ వ్యవహరిస్తారు. నిజానికి హిందుత్వం ఒక వర్గానికి చెందినది కాదు. అది వ్యక్తిగతం. హిందుత్వ ముఖ్యోద్దేశం విగ్రహారాధన కాదు. ఉద్దేశ్యం ఆధ్యాత్మికం. హిందూ ఆచరణాలయిన యోగ, ధ్యానం, మొదలైనవి ఆత్మ స్పృహ కొరకు(self realization) వాడబడు సాధనాలు. హిందుత్వ ఉన్నత లక్ష్యం ఈ ఆత్మ సిధ్ధాంతం. ఈ ప్రకృతి సిధ్ధమైన హిందూ తత్వం, ఆత్మ విశ్లేషణ విస్మరింపబడుతున్నాయి. వీటిని అకుంఠిత దీక్షతో ఆచరించిన మహానుభావులు రామకృష్ణ పరమహంస, అరబిందో, రమణ మహర్షి వంటి వారు ఆధ్యాత్మిక పుస్తకాలలో తప్పితే చరిత్రలో స్థానం సంపాదించుకోలేకపోయారు.

ప్రపంచదేశాలూ, ప్రసార మాధ్యమాలూ అన్నీ హిందూ సంఘజీవనంలోని లోపాలను (కుల వ్యవస్థ, లింగ విచక్షణ, వరకట్న దురాచారం వంటివి) ఎత్తి చూపాయి తప్పితే హిందుత్వ ఉన్నత విలువలను చూపటానికి ప్రయత్నించలేదు. కాస్తో కూస్తో వెలుగు చూసిన ఆధ్యాత్మికత అనాగరికులు ఆచరించినదన్నట్లు చూపబడింది. ఈ "అనాగరికులే" ఎన్నో శతాబ్దాల క్రిందటనే ప్రపంచ మానవుడు బట్ట కట్టక మునుపే నాగరికతనూ, అభివృధ్ధినీ సాధించి చూపారన్న సత్యం ఎవ్వరికీ పట్టదు. విచిత్రంగా హిందువులు ఏనాడూ ఏ ఇతరదేశస్థులనీ అనాగరికులని నిందించలేదు. తిరిగి తన చరిత్రను అనాగరికమని పరిగణించినపుడు మౌనం దాల్చవలసి వచ్చింది.

హిందూ దేవాలయం ధ్వంసం చేయటం ఇస్లాం మత వ్యాప్తిలో భాగమని అంగీకరిస్తే అంతకంటే హాస్యాస్పదం మరొకటి ఉండదు. జనులందరికీ ఒకటే న్యాయం వర్తింపజేయాలి. ఉన్నత విలువలతో కూడిన హిందుత్వ సహనం చేతకానితనంగా భావిస్తున్న రోజులు మారాలి. హిందువుకు ఏ ప్రత్యేక ప్రతిపత్తీ అవసరం లేదు. కానీ ప్రస్తుతం నడుస్తున్న అసమానత తొలగాలి. హిందువుల పట్ల సునాయాసంగా వ్యక్తమయ్యే చులకన పోవాలి.

ప్రసార మాధ్యమాల్లో(బ్లాగులే కానివ్వండి, లేదా TV channels, పత్రికలే కానివ్వండి) ఈ హిందూ వ్యతిరేకత కొనసాగినన్నాళ్ళూ అది హిందుత్వానికి మరింత హాని చేస్తుంది. కనీసం ఈ మార్పు మన భారతీయ ప్రసారమాధ్యమాల్లో ప్రారంభమవ్వాలి. ఇది స్వేఛ్ఛాపహరణ ఎంత మాత్రమూ కాదు. స్వేఛ్ఛ అన్నది విషయాన్ని సూటిగా, నిజాయితీగా చెప్పటంలో ఉండాలి తప్పితే మసి పూయటానికి కాదు. మన సంస్కృతిని, ఆచారాలను హేళన చేసే వారిని నిలదీసే స్థైర్యం సంపాదించుకోవాలి. ఇందుకోసం ప్రతి హిందువూ తన పరిధిలో ప్రయత్నించాలి.

హిందూవ్యతిరేకతను అంగీకరించిన పక్షంలో హిందువు తనను తానే నిందించుకోవాలి తప్ప వేరెవరినీ కాదు. ప్రసార మాధ్యమాలు హిందుత్వ ద్వేషాన్ని సవరించటానికి కూడా ఎంతో ఉపయోగపడగలవు. కాకపోతే ఈ సమస్య తీవ్రత దృష్ట్యా ఎక్కువ సమయం పట్టవచ్చు.

ఈ వ్యాసం ముఖ్యోద్దేశం హిందువులు నిష్కల్మషులని చెప్పటం ఎంత మాత్రమూ కాదు. హిందుత్వ పార్టీలు, సాంఘిక ఆచారాలు ఉన్నతమైనవని చాటటం కూడా నా ఉద్దేశ్యం కాదు. హిందూ సమాజాన్ని సంస్కరించుకునే అవకాశాన్ని హిందుత్వానికే ఇవ్వండి. అఖండ భారతావని ఆత్మకు, హిందూ ధర్మాలకు ఆ భాధ్యతనొసగండి. అంతే తప్ప ఈ కార్యాన్ని పశ్చిమ దేశాల చేతికో, కార్ల్ మార్క్స్ వీరారాధకులకో ఇవ్వకండి.


ఇదంతా చదివాక నేనేదో RSS అభిమానిననుకునే వారికి ఒక మనవి. నాకు కనీసం RSS కి అర్ధం కూడా తెలియదు (R అంటే రాష్ట్ర అని మాత్రమే తెలుసు. మిగిలిన S, S లకు అర్ధం తెలియదు. తెలుసుకోవ ప్రయత్నమూ చేయలేదు. I swear it). గత పదేళ్ళల్లో నేను గుళ్ళకూ, దేవాలయాలకూ వెళ్ళిన సంఘటనలు వేళ్ళ మీద లెఖ్ఖించవచ్చు. ఇక ఇంట్లో పూజ సరే సరి. గత పదేళ్ళల్లో ఏవో కొన్ని పండగలకు తప్ప కనీసం దేవుని పటానికి నమస్కారం పెట్టి కూడా ఎరుగను. నన్నేదో మత మౌఢ్యునిగా భ్రమించే వారి సందేహాన్ని తీర్చటం కోసం ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. నాది మతపరమైన విశ్లేషణ అని భావించేవారికి ఇదే నా ఆత్మఘోష.

నేనొక హిందువుని. చెట్టుపై అందనంత ఎత్తులోనున్న ఫలాన్ని కోసుకునేందుకు ఒక కర్రను ఉపయోగిస్తాం. ఫలం లభించాక ఆ పండుని ఆస్వాదిస్తాం కానీ కర్రను కాదు. అసలా కర్ర విషయం కూడా అలోచించం. ఆ అవసరమూ లేదు. మతం కూడా ఈ కర్రలాంటి సాధనమే. నేను హిందుత్వ ఫలాలను అందుకుని సాధనాన్ని ఏనాడో త్యజించాను. అంత మాత్రాన ఎవరో వచ్చి ఆ కర్రను తగలబెట్టాలి అని గగ్గోలు పెడితే నాకెందుకులే అని ఊరుకోను. ఎందుకంటే భావితరాలకు ఫలాలను అందించే శక్తి కేవలం ఆ సాధనానికి మాత్రమే ఉంది. అట్టి సాధనాన్ని ఎవరో నిర్మూలింప ప్రయత్నిస్తుంటే చూస్తూ కూర్చోలేక గళం విప్పుతున్నాను.

ఈనాడు పెల్లుబికిన ఈ స్వరం కేవలం నా ఒక్కడిది మాత్రమే కాదు. ఇది చదువుతున్న ప్రతి ఒక్కరి హృదయాంతరాల్లో, నరనరాల్లో నిద్రాణమైన హిందుత్వ ఆత్మది. నేడు నా గొంతునాశ్రయించినట్లే రేపు మరొకరి గొంతు సంతరించుకుంటుందని విశ్వసిస్తూ...

జై...
..."హింద్"


(చివరిగా: నా మాటలో మీకు నిజాయితీ కనిపించి ఉంటే, అలోచింపజేసి ఉంటే - ఈ సారాంశాన్ని నలుగురితో పంచండి. హిందుత్వ వ్యతిరేకతను నిర్మూలించటానికి, మీ వంతు చిన్ని ప్రయత్నంగా ఈ వ్యాసాన్ని forward చేసి(There is an email-a-friend option below next to the comments) గానీ, మీ బ్లాగులో copy చేసుకుని గాని వ్యాప్తి చేయండి)

అయోధ్య వివాదం



మొన్నీ మధ్యన ఒక బ్లాగులో(పర్ణశాల), రచయిత(మహేష్) వెలిబుచ్చిన అభిప్రాయం ఇదీ..!

బాబ్రీ మసీదు స్థలంలో ఒకప్పుడు రాముడి కొడుకు కుశుడు కట్టించిన దేవాలయం ఉండేది. అనే అధారరహిత చరిత్ర, అపాయకరమైన చరిత్ర, భారతీయ సమగ్రతకు గొడ్డలిపెట్టులాంటి చరిత్ర.

ఈ వ్యాఖ్య నన్నెంతగానో కలచివేసింది. అందరికీ అన్నీ తెలిసుండాలని నేననుకోను. అయితే ఇటువంటి సున్నితమైన అంశాలపై పదువురి ఎదుటా వ్యాఖ్యానించేటప్పుడు(అందునా negative గా) రచయితకు కనీస విషయ పరిజ్ఞానం అవసరం అని నేను నమ్ముతాను. దీనికి ప్రతిగా నేను నా ఖండనను అక్కడే comment లో ప్రచురించి ఉండవచ్చు. అయితే అంత మాత్రాన నా గొంతు వినపడుతుందా? ఉహూ…! అందుకే ఈ ప్రయత్నం. అయోధ్య వివాదాన్ని సమూలంగా సమీక్షించుకుందాం.

ఈ వారాంతపు(రేపటి)వికాసంలో…

భారతదేశం - భిన్నత్వంలో ఏకత్వం


"మనవాళ్ళొట్టి వెధవాయిలోయ్!" అన్నట్లు భారత్ దేశాన్ని ఆధునిక జపాన్ తోనూ, జర్మనీతోనూ పోల్చి చూపుతూ విమర్శించే వాళ్ళకి మన దేశంలో కొదువలేదు. భయంకరమైన యుధ్ధ పరిస్థితులనూ, ప్రకృతి వైపరీత్యాలనూ కూడా తట్టుకుని ప్రబల శక్తిగా ఎదిగిన ఈ దేశాలను చూపి అంతకంటే పెద్ద దేశమై ఉండి కూడా(వనరుల రీత్యా, ప్రాదేశికంగానూ) భారత దేశం అభివృధ్ధిని సాధించలేకపోయిందనే ఈ వాదన చాలా సహేతుకంగానే అనిపిస్తుంది. అయితే మన సమస్య ఇంత వీజీగా జపాన్, జర్మనీలతో పోల్చి చూసి నిర్ణయించుకోగలిగినదా? చూద్దాం!

నిజానికి భారత దేశం తన ఏకత్వాన్ని కాపాడుకోవటంలో మిగిలిన దేశాల కంటే ఎంతో మిన్నగా వ్యవహరించింది. సఫలీకృతమయ్యింది. ఈ ఏకత్వాన్ని కాపుడుకోవలసిన అగత్యం, సవాలూ అన్ని దేశాలకూ కలుగలేదు. ఇలా పోల్చి చూస్తే యూరోప్ ఖండానికీ, భారత దేశానికీ సారూప్యత కనిపిస్తూంది. ప్రాదేశికంగా యూరోప్ వైశాల్యంతో (యూరోప్ లోని వివిధ దేశాలను భారతదేశంలోని రాష్ట్రాలతో పోల్చి చూడవచ్చును) దాదాపు సరితూగగలిగే భారత దేశం ఎన్నో విపత్కర పరిస్థితులను తట్టుకుని ఒక్కటై నిలచిందే తప్ప చిన్న దేశాలుగా విడిపోలేదు.

యూరోప్ ఖండం యొక్క దేశ-రాష్ట్ర(nation-state) విభజన సిధ్ధాంతం సరిహద్దులను పంచుకునే చిన్న చిన్న దేశాలకు ముఖ్యంగా సంస్కృతి జనాభాలలో సారూప్యత కలిగి ఉన్న దేశాలకు వర్తిస్తుంది. సాధారణంగా యూరోప్ దేశాలకు పెద్దగా చరిత్ర లేకపోవటం వల్ల ఇది సాధ్యపడింది. భాషా ప్రాతిపదికన, జాతుల వర్గీకరణ ఆధారంగానో జరిగిన ఇట్టి విభజన సైతం రెండు ప్రపంచ యుధ్ధాలకు దారి తీసింది.

ఈ విభజన సిధ్ధాంతాన్ని ఇండియా, చైనా వంటి పెద్ద దేశాలకు వర్తింపచేయటం అంత సులభమేమీ కాదు. అందునా దీని వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువన్న సంగతి యూరోప్ దేశాలు సైతం నేడు గ్రహించి ఒక్కటయ్యేందుకు (ఆర్ధిక పరంగా ఒకే కరన్సీని తెచ్చి, ఇంకా ఒకే వీసా విధానాన్ని తెచ్చి) ప్రయత్నిస్తున్నాయి.

యూరోప్ నేలిన రాచ వంశీకులు సైతం( వోలటైర్, గోతె వంటి రాజులు) దీనిని గ్రహించే అఖండ యూరోప్ గురించి కలలు కన్నారు. అయితే అప్పటి రాజకీయ పరిస్థితుల రీత్యా nation-state సిధ్ధాంతం బలం పుంజుకోవటంతో నెపోలియన్ వంటి వారు ఎంత ప్రయత్నించినప్పటికినీ ఇది సాధ్యపడలేదు. చిన్న దేశాలు ఎప్పటికైనా పెద్దదేశాలపై ఆధారపడే పరిస్థితి వస్తుందని ఇప్పుడిప్పుడే నిరూపితమవుతోంది.

భారత దేశంతో విస్తీర్ణతా పరంగా పోల్చి చూడదగ్గ, మనకంటే కూడా సఫలీకృతమైన దేశంగా పేర్కొనబడేది చైనా ఒక్కటే. నిజానికి చైనా లో మనకున్నంత భిన్నత్వం లేదు. 'హాన్ చైనీస్' గా పిలవబడే వర్గానికి చెందిన వారే చైనా జనాభాలో దాదాపు 95% ఉన్నారు. అప్పుడప్పుడూ భిన్నత్వం కారణంగా ఏర్పడిన కలహాలను చైనా పాలకులు ఉక్కుపాదంతో హింసాత్మకంగా అణచివేసారు. ఉదాహరణకు ముస్లింలు ఎక్కువగా నివసించే పశ్చిమ చైనా ప్రాంతాలను గత కొన్నిఏళ్ళగా చైనా హాన్ చైనీయులతో భర్తీ చేసి, ముస్లింలను మైనార్టీలుగా ఉంచటంలో విజయం సాధించింది. ఇదే పధ్ధతిని టిబెట్టులో కూడా అమలు చేయటంతో బౌధ్ధులు (దలైలామాతో సహా) రోడ్డున పడ్డ సంగతి విదితమే. ఈ విధంగా ఏకత్వాన్ని సాధించటంలో చైనా విజయం సాధించినప్పటికినీ, ఆ ఫలితం నియంతృత్వ నిర్ణయాల కారణంగా వచ్చినవి. ఇది భారతదేశంలో ఊహకు సైతం అందనిది, ప్రజాస్వామ్య భారతంలో భారతీయులు ఇష్టపడనివి కూడానూ!

ఇక ఇస్లామిక్ దేశాలేవీ భారత్, చైనా, అమెరికాలకు దీటుగా విస్తీర్ణతను సాధించటంలో విజయం సాధించలేదు. ప్రస్తుత ఇస్లామిక్ దేశాలు చిన్నవైన ఇరాక్, ఇరాన్, సౌదీ అరేబియాలలో మాత్రమే ఉనికిని చాటుకోగలిగాయి. అవికూడా సైనిక, నియంతృత్వ పాలనలలో పరస్ఫర యుధ్ధాలతో రోజులు వెళ్ళదీస్తున్నాయి. ఈ విధంగా ఆసియా ఉప ఖండాన్ని ఒక్కటిగా కలిపి ఉంచటంలో ఇస్లాం సైతం విజయం సాధించలేకపోయింది.

ప్రాధేశికంగా అమెరికా తన అతి పెద్ద విస్తీర్ణతను కాపాడుకోగలిగినప్పటికినీ అక్కడి జనాభాలో అధిక శాతం వలస జీవులే. ఈ విధంగా వలస వచ్చిన వారికి సహజంగానే అమెరికాలో తమకంటూ దీర్ఘకాలిక ప్రతిపత్తిని సాధించుకోవలసిన అవసరం లేకుండా పోయింది. అదీగాక అమెరికాకు చెందిన నిజమైన జాతీయులు (రెడ్ ఇండియన్లు) పెద్దగా ప్రతిఘటన లేకుండానే ఈ వలస జీవులకు దాసోహమైనారు.

ఇక జపాన్, జర్మనీలు విస్తీర్ణతాపరంగా చిన్నవీ, జనులంతా ఒకే వర్గానికి చెందినవారు కావటంతో ఏకత్వాన్ని సాధించటం సులభమయ్యింది. ఇలా మిగిలిన దేశాలతో విస్తీర్ణాతా పరంగానూ, భిన్న సంస్కృతుల పరంగానూ పోల్చి చూస్తే ఇంత పెద్ద భూభాగాన్ని ఒక్కటిగా కాపాడుకునే అవసరంగానీ ప్రయత్నంగానీ భారతదేశానికి తప్ప మరే ఇతర దేశానికీ కలుగలేదు.

ఈ ప్రయత్నంలో భారతదేశం ఒకే ఒక్కసారి పరాజయాన్ని చూడవలసి వచ్చింది (1947 దేశ విభజన రూపంలో). అప్పుడుకూడా ఇస్లామిక్ చట్టాలకు లోబడి ఈ విభజన జరిగిందనది తెలిసిన విషయమే. యూరోప్ దేశాలవలే భారతదేశంలోని రాష్ట్రాలు స్వతంత్ర్యదేశాలుగా చీలకపోవటం వల్ల లాభించిందే తప్ప నష్టం కలుగలేదు. నేడు యూరోప్ కూడా భారత్, చైనా, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియాల వలే ఏకత్వంలోని లాభాలను గ్రహించి అటుగా అడుగులు వేస్తోంది.

భారతదేశం జర్మనీ, బ్రిటన్, జపాన్ల వలే అభివృధ్ధిని సాధించలేకపోయిందనేది ఒక అపవాదు మాత్రమే. నిజానికి అఖండ భారతావని ఇన్ని భిన్న సంస్కృతులను నిలుపుకుని, అభివృధ్ధి కంటే మరెంతో గొప్పదైన ఆదర్శాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది.

మిగిలిన దేశాలవలే భారతదేశంలో భిన్నత్వాలు అణచివేయబడలేదు. ఇవి ఏకత్వాన్ని సాధించగలిగాయి. లోతుగా అలోచించి చూస్తే ఇందుకు మూల కారణం ప్రకృతి సిధ్ధాంతాలతో నిర్మింపబడ్డ హిందుత్వమే.

భారతావని నిర్వచించిన ఈ దేశీయతా విధానం నేడు ప్రపంచం మొత్తానికీ అవసరం. ఈ విధానాలు ప్రపంచీకరణకు ఎంతగానో ఉపయోగపడతాయి. అదే జరిగితే ప్రపంచం మొత్తం ఒక్కటిగా అవుతుందన్న ఊహా సైతం ఎంత ఆనందాన్ని ఇస్తుంది. నిజమైన హిందుత్వ ఆత్మ మేలుకుంటే ఇది జరిగే అవకాశం ఉంది కదూ...! హిందుత్వాన్ని ఆచరించి, తన అస్థికలను గంగా నదిలో కలపమని కోరిన John Lennon(Beatles గ్రూపు సభ్యుడు) - imagine పాటను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి....

http://www.youtube.com/watch?v=VM0Z75KEd_o

హిందుత్వం-మార్కిస్టు దృక్పధం


ప్రపంచంలో కల్లా అతి ప్రాచీనమైన హిందుత్వ సిధ్ధాంతాలు మార్కిస్టులకు ఎలా కనిపిస్తాయో ఒక్కసారి ఊహించగలరా? సహజంగానే హిందుత్వం వీరిచే తృణీకరించబడింది. కార్ల్ మార్క్స్ తనంతట తానుగా ఇట్టి మత సిధ్ధాంతాలను భ్రమగా కొట్టేసినపుడు, భారతీయ కమ్యూనిస్టులందరూ హిందుత్వంతో విభేదించటంలో ఆశ్చర్యమేమీ లేదు. అయితే వాస్తవాన్ని పరిశీలిస్తే ప్రస్తుత సమాజంలో కమ్యూనిజం పేకమేడలా కుప్పకూలగా, మత సిధ్ధాంతాలు(హిందుత్వతో సహా అన్నీ) మరింత శక్తిని పుంజుకున్నాయి. ఇట్టి మార్పు మతాలు భ్రమ కాదని, కమ్యూనిజమే నిజమైన భ్రమ అని నిరూపించాయి.

స్వాతంత్ర్యానంతరం నుండీ దురదృష్ట వశాత్తు భారతీయ విశ్వ విద్యాలయాలు ఈ వామ పక్షవాదులచే ప్రభావితమై తమ అభిప్రాయాలను పాఠ్య పుస్తకాల రూపేణా విద్యా వ్యవస్థలో చొప్పించాయి.

జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన చరిత్రాధ్యాపకురాలు 'రోమీలా థాపర్' మార్కిస్టు కార్యకలాపాలకు పేరుపొందారు. (గూగుల్ లో ఈమె గురించి వెతికి చూడండి... 4వ తరగతి పాఠాల మొదలు పరిశోధనా గ్రంధాల వరకూ ఈమె పుస్తకాలు విద్యా వ్యవస్థలో చొప్పించబడ్డాయి). ఈమె తనకనుకూలురైన సహచరులతో కలసి రచించిన ఎన్నో వ్యాసాలు హిందూ చరిత్ర రూపేణా పాఠ్యపుస్తకాలలో చేరాయి. ఇవన్నీ కూడా హిందుత్వం పై దురభిప్రాయాన్ని కలిగించేవే.

నిజానికి భారత దేశంలో మిగిలిన మతాలు ప్రవేశించనంత వరకూ 'హిందూ మతం' అన్న స్పృహ, అవగాహన భారతీయులలో ఉండేవి కావు. వీరంతా తరతరాల నుండి కొనసాగుతున్న హైందవ ధర్మాన్ని ఆచరిస్తూ వచ్చారు. వీరు, రామాయణ, మహా భారతాల మొదలూ భగవద్గీత మనుసంహితాలను, వేద, ఉపనిషత్తులనూ ఏనాడు మత గ్రంధాలుగా భావించలేదు. భారతీయులు ఇట్టి పుస్తకాలను చారిత్రక, సాంఘిక, వైద్య, మూలికా, జ్యోతిష్య, గణిత, భౌతిక, ఖగోళ ఇత్యాది శాస్త్రాలకు చెందిన పరిశోధనలగానే భావించేవారు. కవులు తమ కవితా చాతుర్యానికీ, గురువులు తమ శిష్యులకు విద్యా బుధ్ధులు భోదించేందుకు, ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగించేవారు (వీటిని నమ్మని వారు కూడా అప్పట్లో ఇవి మతానికి చెందిన గ్రంధాలుగా ఏనాడూ భావించలేదు). భారత దేశంలో మిగిలిన మతాలు బలం పుంజుకోవటం ప్రారంభమయ్యాక, హైందవ ధర్మం ఆచరించే ఈ భారతీయులందరూ సంఘటితమయ్యి, మూలాలు కాపాడుకునే ప్రయత్నంలో 'హిందూ మతం' అన్న నానుడి సృష్టించారు.

ఇదిగో, సరిగ్గా ఇక్కడే రోమీలా థాఫర్ దృష్టి సారించారు. ఈమె హిందుత్వ మూలాల కొఱకు వేదాల వద్దకో, ఉపనిషత్తుల వద్దకో వెళ్ళక కాస్త ఆధునిక కాలంలో త్రవ్వటం మొదలు పెట్టారు. కొన్ని చారిత్రిక సత్యాలు ('హిందూ మత' ఆవిర్భావమంటూ పేర్కొనే ఆధారాలు) ఈమెకు సహజంగానే క్రీస్తు మరణానంతర కాలంలోనే లభించాయి. ఈమె ఈ విధమైన ఆధారాలతో హిందుత్వం అందరూ అనుకునేంత ప్రాచీనమైనది కాదనీ, నవీనమైనదేనని నిరూపించ ప్రయత్నించారు. ఈ విధమైన విశ్లేషణతో ఈమె అప్పటికే హిందుత్వంలో చొరబడిన సాంఘిక దురాచారాలకు పెద్ద పీట వేస్తూ, హిందూ మతంనందు ఆది నుండీ కూడా ఈ దురాచారాలు ఉండేవని ప్రచారం చేసారు. ఈ విధమైన ఫ్రెంచ్ తరహా మార్కిజం వల్ల హిందుత్వానికి మరింత మసి పూసినట్లైయ్యింది.

థాపర్ దృష్ట్యా హిందుత్వమనే సంస్కృతి(మతం) సాంఘిక మరియూ రాజకీయ ప్రయోజనార్ధం క్రీస్తు మరణానంతర కాలంలోనే ఒక వర్గం వారి ద్వారా(అగ్ర వర్ణాల) సృష్టింపబడింది. ఈమె రచనల ద్వారా(దురదృష్టవశాత్తు ఇవి పాఠ్యపుస్తకాలు) హిందుత్వమనేది సాంఘిక దురాచారాల(పురుషాధిక్యత, కుల సంస్కృతి ఇత్యాదివి)తో నిండి, ఆధునికులూ, నాగరికులూ, విద్యాధికులూ విభేదించాల్సిన మత తత్వంగా ప్రదర్శింపబడింది. ఇలా ఈమె హిందుత్వ ఆత్మకు మతరంగు పులిమి దురాచారాల అత్తరునద్దడం వల్ల 'హిందుత్వ' మంటే ఒక అనాగరిక మత మౌఢ్యం అన్న చందాన ప్రచారం చేయబడింది.

ఈ కమ్యూనిస్టు ప్రొఫెసర్లందరూ హిందువులు నమ్మే అహింస, సహనం వంటి గుణాలను అభూతకల్పనగా తిరస్కరించి, హిందుత్వంలో అటువంటి భావనలే లేవన్నట్లుగా కొద్ది మంది హిందూ రాజులు (బౌధ్ధులూ, జైనులూ) సాగించిన మారణహోమాలను ఉదహరించారు. ప్రతి మతంలోనూ, సంస్కృతిలోనూ ఈ విధమైన వర్గ వైషమ్యాలు సహజమే. చరిత్రలో బౌధ్ధమతాన్ని ఆచరించిన వారు కూడా హింసను ఆశ్రయించిన సందర్భాలున్నాయి. అయితే వీటికి మూల కారణాలు వేరు. ఇవి హిందుత్వానికీ, హైందవ ధర్మానికీ అతీతంగా జరిగినవి. ఇవేవీ కూడా పెద్ద యెత్తున పవిత్ర యుధ్ధం పేరుతోనో, మరే విధమైన ప్రభువు ఆజ్ఞగానో భావించి దేశ దేశాలను కబలించిన సంఘటనలు కావు.

హిందుత్వలో కూడా కొందరు హింసా సంస్కృతిని పాటించి ఉండవచ్చునుగాక, కానీ అవి వ్యక్తిగతమైనాయి తప్పితే పెద్ద ఎత్తున హిందువులందరూ సంఘటితమై హింసను ఆశ్రయించిన దాఖలాలు లేవు.

థాపర్ మరియూ మిగతా మార్కిస్టు ప్రొఫెసర్ల పరిశోధనలలో హిందుత్వ మూలమైన ఆత్మ సిధ్ధాంతాల గూర్చి గానీ, హిందూ మహర్షుల, మహాయోగుల ప్రస్తావనలు గానీ ఉండదు. ఈమె పరిశోధనలలో హిందూ విశ్వ తత్వం, జ్ఞాన సిధ్ధాంతాలు వంటివి ఉండవు. ఒకటో అరో ప్రస్తావించిన సన్యాస సిధ్ధాంతాలు కూడా మందిని శాసించే (అగ్ర వర్ణాల) సాంఘిక దురాచారాలుగా పేర్కొనబడ్డాయి.

ఈ విధంగా విద్యార్ధులకు చేరువైన ఈ పరిశోధనలు పూర్తిగా హిందూ సంస్కృతిలోని సాంఘిక అకృత్యాలూ, రాజకీయ ప్రయోజనాల చుట్టూ తిరిగాయి. నిజానికి ఒక మార్కిస్టు నుండి అంతకు మించిన భక్తి, యోగ సిధ్ధాంతాలను ఆశించటం అత్యాశే అవుతుంది. వీరు ఉపనిషత్తుల గూర్చి గానీ, గీత గురించి గానీ ఎక్కడా ఉదహరించలేదు. మార్కిస్టులు భగవద్గీతను మానవుడిని భ్రమలోకి నెట్టిన అతి పెద్ద సృష్టిగా వర్ణిస్తారంటే వీరి హిందుత్వ వ్యతిరేకతను అర్ధం చేసుకోవచ్చు.

కార్ల్ మార్క్స్ క్రైస్తవాన్ని, చైనా కమ్యూనిస్టులు బౌధ్ధాన్ని చూసిన చందానే మన హిందూ వామపక్ష వాదులు హిందుత్వాన్ని చూసారు తప్పితే, లోతైన అధ్యయనం చేయలేదు.

వీరి ఉద్దేశ్యనుసారం హిందుత్వాన్ని అధ్యయనం చేయటం అంటే మార్క్స్ క్రైస్తవాన్ని, మావో బౌధ్ధాన్ని అధ్యయనం చేయటంతో సమానం. ఒక వర్గం వారు (అగ్ర వర్ణాలు) తమ రాజకీయ ప్రయోజనార్ధం సృష్టించిన మతంగా హిందుత్వాన్ని పేర్కొనే వీరు, నిజానికి మార్కిస్టు సిధ్ధాంతాలే రాజకీయ పరంగా రాజకీయ అజండాలతో పుట్టాయంటే ఒప్పుకోరు. వీరి రచనల నిండా హిందూ మత మౌఢ్యులూ, వారు కమ్యూనిస్టులపై, ఇతర మైనార్టీలపై సాగించిన అకృత్యాలే ఉంటాయి. అయితే దురదృష్టవశాత్తు, ఈ థాపర్ వంటి మార్కిస్టులు గొప్ప సంఘ సంస్కర్తలుగా కీర్తింప బడ్డారు. వీరికున్న ప్రజ్ఞాపాటవాలూ, కీర్తి ప్రతిష్టలూ, ప్రపంచజ్ఞానం, డిగ్రీలూ, ఇవన్నీ కూడా భావితరాల వారికి వీరు ఆదర్శప్రాయమయ్యే దుస్థితిని కలిగించాయి.

(నా రచనల్లో ఏదైనా అస్పష్టత ఉంటే అంగీకరిస్తాను. ఎందుకంటే మార్కిస్టులు విశ్వవిద్యాలయాలలో పాఠ్యాంశాలను శాసించే స్థాయికి ఎదిగిన కారణాలను వివరించలేకపోయాననిపిస్తోంది. అదీగాక హిందూ దురాచారాల పట్ల సానుభూతిని ప్రదర్శించానేమో (మొత్తం చదువుతుంటే నాకే సంశయమేస్తోంది) అని కూడా అనిపిస్తోంది.)

అయితే మార్కిస్టులు హిందూ విశ్వ విద్యాలయాల్లోనే కాక, యూరోప్ మరియూ పశ్చిమ దేశాల యూనివర్సిటీలలో కూడా కీలక పాత్ర పోషించారు. దీనివల్ల సహజంగానే హిందూ వామపక్షవాదులు తమకున్న మిగిలిన దేశపు మార్కిస్టు సంబంధాలను ఉపయోగించుకుని, తమకు తోచిన(తాము అర్ధం చేసుకున్న) హిందుత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసారు. ఇది ఇప్పటికినీ కొనసాగుతుంది. మిగిలిన మతాల యొక్క రాజకీయ, సాంఘిక ప్రయోజనాలను మార్కిస్టులు విజయవంతంగా నిరూపించటం ద్వారా, భారతీయ లెఫ్టిస్టులకు, విద్యాధికులకు, వీరు ఆదర్శమయ్యి - హిందుత్వాన్ని కూడా అదే కోణంలో చూసేందుకు దోహదపడ్డారు. దీనితో సహజంగానే ఈ హిందూ విద్యాధికులకు గురువైనా, దేవుడైనా మార్క్స్ అయి కూర్చుని, సొంతం కావాల్సిన వేదాలు విదేశీయమైనాయి. అప్పటికే మన భారతీయ సంస్కృతిలో చొప్పించబడ్డ దురాచారాల వల్ల అణగద్రొక్క బడిన దళిత వర్గాల వారు, నాస్తికులు కూడా వీరికి బాసటగా నిలిచారు. నిజమైన హిందుత్వం ఎప్పటిలానే తనకు మాత్రమే సొంతమైన సహనాన్ని అశ్రయించి మౌనంగా ఉండిపోయింది.

హిందుత్వ విషయంలో మార్కిస్టు సిధ్ధాంతాలకు, క్రైస్తవ సిధ్ధాంతాలకూ(ఇది మార్కిస్టులు వ్యతిరేకించే మతమయినప్పటికినీ) పెద్దగా తేడా కనిపించదు. క్రైస్తవం హిందుత్వాన్ని మత సాతానుగా వర్ణిస్తే, మార్కిస్టులు హిందూ సాంఘిక దురాచార భూతాలను ప్రదర్శించ యత్నించారు.

అదృష్టవశాత్తూ కమ్యూనిజం ప్రపంచం అంతటా తుడిచిపెట్టుకు పోయే రోజులు రానుండటంతో భారతదేశంలో కూడా కమ్యూనిజం ప్రభావం తగ్గుతుందని ఆశిద్దాం. భారతీయులు ఈ మార్కిస్టు సిధ్ధాంతాలను ఎంత తొందరలో త్యజిస్తే హిందుత్వానికి అంత మేలు చేసిన వారౌవుతారు.

ఈ వ్యాసం ద్వారా హిందుత్వంలో మార్కిస్టులు పేర్కొనే సాంఘిక దురాచారాలు లేవని చెప్పటం ఎంత మాత్రమూ నా ఉద్దేశ్యం కాదు. మన దేశంలోనున్న ఈ సాంఘిక దురాచారాలను రూపుమాపేందుకు హిందుత్వాన్ని త్యజించాల్సిన అవసరం లేదు. నిజానికి ఈ సూత్రం ఏ మతానికైనా వర్తిస్తుంది. తమ తమ మతాలలోని దురాచారాలను సంస్కరించటం కోసం తమ తమ మతాలను విసర్జించాల్సిన పని లేదు. ఇందు కోసం కమ్యూనిస్టు సిధ్ధాంతాలను దత్తత చేసుకునే అవసరం అంతకంటే లేదు. స్థూలంగా అలోచిస్తే హిందూ మూల సిధ్ధాంతాల ద్వారానే హిందుత్వాన్ని (హిందూ మతాన్ని) సంస్కరించుకోవచ్చు.

ఈ సందర్భంలో కధా ఉపనిషత్తులో పేర్కొన్న సూక్తి గుర్తొస్తోంది.

"అజ్ఞానాంధకారంలో బ్రతికే వాడు తనని తాని జ్ఞానిగానే భావిస్తాడు. ఆ చీకటిలో అతడికి నిజమైన జ్ఞాని కూడా కనపడడు. ఇట్టి అజ్ఞానులు మందిని ప్రభావితం చేసి, ఒక గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివానిని నడిపించే చందాన వ్యవహరిస్తారు. సత్యానికి చేర్చాల్సిన దారి ఇట్టి అయోమయులకు ఎన్నటికీ కనపడదు."

ప్రపంచం ఒక్కటి మాత్రమే నిజమని, అది మాత్రమే దుఃఖానికీ, అజ్ఞానానికీ హేతువని భావించే మార్కిస్టులకు ఈ సూక్తి సరిగ్గా వర్తిస్తుంది కదూ!