గెలుపు

ది 1998 నాటి సంగతి. నేను కాకినాడ దగ్గర రామచంద్రపురంలో MCA వెలగబెడుతున్న రోజులు. అప్పటికే మనవి ఒక కధా సంకలనం, కవితా సంపుటి అచ్చవటంతో ఒకరిద్దరు ఔత్సాహిక యువకవితాగ్రేసరులు వాళ్ళ కవితలు నాకు చూపించటానికి ఆసక్తి చూపెడుతూ ఉండేవారు. నాతో పాటూ చదువుకునే ఒక ఫ్రెండ్ ?? (?? ఎందుకో చివర్లో చెబుతాను) అలా రాసిచ్చిన కవితే ఇది. అనుకోకుండా రోజు నా పాత పుస్తకాల మధ్యన దొరికింది శిధిలావస్థలో...



గెలుపు
నేనొక మామూలు వ్యక్తిని.
పూలవానల్లో
తడిసే నిన్ను కలల కౌగిట్లో చూసాను...
ప్రేమించాను
...
ప్రేమిస్తే
సరిపోతుందా??
కల
చెదిరితే, కన్ను విప్పితే అంతా ముళ్ళదారి
అందుకే
ఏదో చేయాలి
నింగి
, నేల, నీరు, నిప్పు అన్నింటినీ మించాలి
ముఖ్యంగా
నన్ను నేను మించాలి.
అందుకే...
నిన్ను ప్రేమిస్తూ, నన్ను ప్రేమించుకోసాగాను.
చివరకు నిన్ను గెలిచే ప్రయత్నంలో నిన్ను కూడా కోల్పోయాను.
నేను, అవును నేను మాత్రమే మిగిలాను.
స్వార్ధం అన్నారంతా...
కాదని
నాకు తెలుసు.
అయినా
వాదించలేదు.
మౌనం
... మౌనంగానే యుధ్ధం చేసాను.
అభివృధ్ధి
ఎప్పుడూ యుధ్ధంతోనే ఆరంభమయినట్లు,
యుధ్ధంలో నన్ను 'నేను' గెలిచాను
నిన్ను గెలిచే ప్రయత్నంలో అన్నీ కోల్పోయాను
చివరకు నిన్ను కూడా...
అయితేనేం?! నన్ను నేను గెలిచాను.
అప్పుడు గర్వంతో కనులు విప్పిచూసాను.
కల
చెదిరిపోలేదు.
ముళ్ళదారి
ఎదురుపడలేదు.
పూలవానలు
లేవు. నువ్వు కూడా లేవు.
ఉండవని
ముందే ఊహించాను.
కానీ
కన్నీరు రాలేదు.
ఎందుకంటే
అప్పటికీ నువ్వు నా హృదయంలోనే ఉన్నావు.
నేను
పూర్తిగా "గెలిచాను"
ఇప్పుడు కూడా నేను మామూలు వ్యక్తిని.
*******


ఇక ఫ్రెండ్(??) అని ఎందుకన్నానంటే ఇతనితో నా స్నేహం తక్కువే. మరుసటి సంవత్సరమే రావులపాలెం వద్దకు మేం వెళ్ళిన పిక్నిక్ లో ఇతనితో పాటుగా మరో ఇద్దరు గోదావరిలో కొట్టుకుపోయి మరణించారు. ఐదురోజుల పాటు మిగిలినవారందరం అక్కడే ఉండి ప్రయత్నిస్తే కానీ వాళ్ళ మృతదేహాలు కూడా దొరకలేదు. మరణించిన వారు ప్రవీణ్ (విశాఖపట్నం), చంద్రమౌళి(మండపేట) మరియూ కవిత రాసిన యలమంచిలి అబ్బాయి.

కవిత ఎందుకు రాసాడో తెలియదు. అసలతని జీవితమే తెలియదు. కవితతో పాటుగా సంతకం, తారీఖు(20-11-98) వేసి మరీ ఇచ్చాడు. ముగ్గురి సీట్లు ఖాళీ కావటంతో, స్థానాల్లో కాలేజీ మరో ముగ్గురిని భర్తీ చేసింది. కవిత రాసిన అబ్బాయి నోట్సులను వాళ్ళల్లో ఒకరికి ఇస్తే అతడా పుస్తకాల్లో దొరికిన బొమ్మను మా అందరికీ చూపాడు. యలమంచిలి అబ్బాయి క్లాస్ రూమ్ లో పాఠాలు వినకుండా బొమ్మలు వేయటం, కవితలు రాయటం మాకందరికీ తెలిసిందే. బొమ్మ నా దగ్గర లేకపోయినా అందులో నే చూసినది ఇదీ...




నా స్థానంలో ఉంటే మీరు కూడా షాక్ తినేవారు కదా...
అన్నట్లు యలమంచిలి అబ్బాయి పేరు చెప్పలేదు కదూ...

అతడి పేరు రాజేష్. నా పేరు కూడా...

9 comments:

భావన said...

wow you call that coincidence I don't.. such a sad story... May his soul rest in peace.

జయ said...

స్నేహం అనే రెండక్షరాల మాట
అది వెలిబుచ్హ లేనంత ప్రేమానురాగాల మూట.
నీవు నీకోసం జీవిస్తే నీవు నీలోనే నిలిచి పోతావు ...
మరచిపొమ్మన్నా మరచిపోనీని,
జీవితాంతం మనసు పొరల్లో దాగి పోకుండా
ఉండగలదా ఈ అనుభవం!

బృహఃస్పతి said...

భావన గారూ, మీకు Coincidenceలా అనిపించి ఉండవచ్చుకానీ, నాకైతే ఆ బొమ్మ చూసి షాక్. బహుశా ఈ దుర్ఘటనకి నెల రోజుల లోపల వేసినదే ఈ బొమ్మ. నీట్లో ముగ్గురి తలలు, ఒడ్డున జనాల పై ప్రశ్నార్ధకం అచ్చం ఇలానే జరిగింది. వాళ్ళు మునిగిపోతూ ఉంటే మేం ముందు act చేస్తున్నారనుకున్నాం. తెలుసుకునేటప్పటికే అంతా అయిపోయింది.

జయ గారూ, స్నేహంపై మీ కవిత బాగుంది. అయితే కవితల్లో స్నేహ మాధుర్యం కనిపించినా, వాస్తవంలో స్నేహానికి కూడా పరిమితులున్నాయని నేను నమ్ముతాను. సత్యనారాయణశర్మ గారు రాసిన నిశ్శబ్దం లోని మాధుర్యం లో ప్రశాంతతకు భంగం చేకూర్చేవాటిలో స్నేహం కూడా ఒకటని భావిస్తాను. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే లెండి.

sunita said...

కవిత్వం కన్నా రాసిన కవి గురించి చదివి ముందు నేనూ షాక్ అయ్యాను, తరువాత మనసంతా అయ్యో అనిపించింది.

బృహఃస్పతి said...

నిజానికి ఆ సంఘటనను నేను పూర్తిగా మర్చిపోయానండి. ఇదిగో ఈ కవిత కనపడి గుర్తుకుతెచ్చింది.

భాస్కర రామిరెడ్డి said...

అద్రుష్టవంతులు బృహస్పతి .. సీరియస్.

బృహఃస్పతి said...

భా.రా.రె. గారూ, నేను పోలేదనేనా అదృష్టవంతుణ్ణి అంటే?? అది పడవ ప్రమాదం కాదండీ. వాళ్ళు ముగ్గురూ ఈతకు అవతలి ఒడ్డు దాకా వెళ్ళారు. మిగిలిన వారం ఆ సాహసం చెయ్యలేదు. :)

భాస్కర రామిరెడ్డి said...

లేదండి, పైనున్న నలుగురిలో ( బొమ్మ ) మీరున్నా, మునిగిన ముగ్గురులో లేరు. కవిత చదివాక బహుశా ఆ అమ్మాయిని తనే .... అనే అనుమానం వచ్చింది.

బృహఃస్పతి said...

హ్మ్... మేమెవరం ఇంత లోతుగా ఆలోచించలేదండీ...